కొచ్చి తీరంలో కలకలం : చమురు నౌకలో పేలని క్షిపణి.. రంగంలోకి దిగిన భారత నౌకాదళం

by Ramesh Naini |

కొచ్చి తీరంలోని సముద్ర మార్గంలో కలకలం రేగింది. ఎం.టి. ఒలింపిక్ లైఫ్ (MT Olympic Life) అనే ముడి చమురు నౌకలో చిక్కుకున్న పేలని క్షిపణిని (మిస్సైల్ వార్‌హెడ్‌) భారత నౌకాదళం అత్యంత చాకచక్యంగా వెలికితీసింది.

కొచ్చి తీరంలో కలకలం : చమురు నౌకలో పేలని క్షిపణి.. రంగంలోకి దిగిన భారత నౌకాదళం
X

దిశ, డైనమిక్ బ్యూరో: కొచ్చి తీరంలోని సముద్ర మార్గంలో కలకలం రేగింది. ఎం.టి. ఒలింపిక్ లైఫ్ (MT Olympic Life) అనే ముడి చమురు నౌకలో చిక్కుకున్న పేలని క్షిపణిని (మిస్సైల్ వార్‌హెడ్‌) భారత నౌకాదళం అత్యంత చాకచక్యంగా వెలికితీసింది. కొచ్చి తీరంలో జరిగిన ఈ సంక్లిష్టమైన ఆపరేషన్‌ను నేవీ విజయవంతంగా పూర్తి చేసి, నౌక సిబ్బందిని, పోర్టును ప్రమాదం నుంచి రక్షించింది.

అసలేం జరిగిందంటే..?

మార్షల్ ఐలాండ్స్ జెండాతో ఉన్న ఈ నౌక యూఏఈలోని ఫుజైరా నుంచి కొచ్చికి వస్తుండగా మే 26, 2026న ఒమన్ తీరంలో దీని హల్‌ (నౌక కింది భాగం) వద్ద పేలుడు సంభవించింది. ఆ తర్వాత నౌక కొచ్చి వైపు తన ప్రయాణాన్ని కొనసాగిస్తుండగా, అందులో పేలని క్షిపణి ఉన్నట్లు అధికారులకు సమాచారం అందింది. కాగా, ఈ నౌకలో భారతీయులెవరూ లేరు.

రంగంలోకి నేవీ ఈఓడీ (EOD) బృందం

ఇన్ఫర్మేషన్ ఫ్యూజన్ సెంటర్ (IFC-IOR) ద్వారా సమాచారం అందుకున్న వెంటనే, కొచ్చిలోని సదరన్ నావల్ కమాండ్ అప్రమత్తమైంది. బాంబు నిర్వీర్య నిపుణుల (EOD) బృందాన్ని రంగంలోకి దించింది. ఒక క్షిపణి నౌక పైభాగాన్ని చీల్చుకుంటూ వెళ్లి నేరుగా ఇంధన ట్యాంకులో చిక్కుకున్నట్లు అధికారులు గుర్తించారు. ఇంధన ట్యాంకులో పేలుడు పదార్థం ఉండటంతో నౌకకు, సిబ్బందికి ఎలాంటి నష్టం వాటిల్లకుండా నేవీ అధికారులు అత్యంత జాగ్రత్తగా వ్యవహరించారు. అధునాతన సాంకేతిక పద్ధతులను ఉపయోగించి ఆ క్షిపణి వార్‌హెడ్‌ను, దాని శిధిలాలను నౌక నుండి సురక్షితంగా బయటకు తీశారు. అనంతరం తదుపరి విశ్లేషణ కోసం దానిని సురక్షిత ప్రాంతానికి తరలించారు. అత్యంత ప్రమాదకరమైన ఈ ఆపరేషన్‌ను విజయవంతంగా పూర్తి చేయడం ద్వారా, అంతర్జాతీయ సముద్ర భద్రతలో, విపత్తుల నిర్వహణలో భారత నౌకాదళం తన అసాధారణ సాంకేతిక నైపుణ్యాన్ని మరోసారి నిరూపించుకుంది. నౌక ఏ దేశానిదైనా సరే, ఆపదలో ఉంటే కాపాడే నమ్మకమైన భద్రతా భాగస్వామిగా భారత నౌకాదళం తన బాధ్యతను చాటిచెప్పింది.

Next Story