- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
1979 తర్వాత చారిత్రాత్మక చర్చలు.. పాక్ ప్రధానితో భేటీ అయిన జేడీ వాన్స్
ఇరాన్తో శాంతి చర్చల్లో భాగంగా అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ నేతృత్వంలోని బృందం పాకిస్తాన్ రాజధాని ఇస్లామాబాద్కు చేరుకుంది.

దిశ, డైనమిక్ బ్యూరో: ఇరాన్తో శాంతి చర్చల్లో భాగంగా అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ నేతృత్వంలోని బృందం పాకిస్తాన్ రాజధాని ఇస్లామాబాద్కు చేరుకుంది. ఈ కీలక చర్చలకు ముందు వాన్స్ బృందం.. పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్తో సమావేశమైంది. ఈ భేటీలో అమెరికా ప్రతినిధులు స్టీవ్ విట్కాఫ్, జేరెడ్ కుష్నర్లతో పాటు పాక్ అంతర్గత, విదేశాంగ మంత్రులు మోసిన్ నఖ్వీ, ఇషాక్ దార్ తదితరులు పాల్గొన్నారు. 1979 ఇస్లామిక్ విప్లవం తర్వాత అమెరికా, ఇరాన్ల మధ్య అత్యున్నత స్థాయిలో జరుగుతున్న చర్చలు ఇవే కావడం గమనార్హం. ఈ చర్చల్లో పాల్గొనేందుకు ఇరాన్ పార్లమెంట్ స్పీకర్ మహ్మద్ బాఘేర్ గాలిబాఫ్, విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాఘ్చీ తదితర అగ్రశ్రేణి ప్రతినిధులు సైతం ఇప్పటికే ఇస్లామాబాద్ చేరుకున్నట్లు అంతర్జాతీయ మీడియా సమాచారం. ఇరాన్ చిత్తశుద్ధితో చర్చలకు వస్తే, స్నేహ హస్తం అందించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని వాన్స్ పేర్కొన్నారు. అయితే, ఇరు దేశాల ప్రతినిధులు ముఖాముఖిగా చర్చిస్తారా లేక మధ్యవర్తుల ద్వారానే చర్చలు సాగిస్తారా అనేది ఇంకా స్పష్టం కాలేదు.
సందిగ్ధంలో కాల్పుల విరమణ..
ఇజ్రాయెల్, అమెరికా, ఇరాన్ల మధ్య ఐదు వారాల పాటు భీకర దాడులు జరగ్గా.. పాకిస్తాన్ మధ్యవర్తిత్వంతో రెండు వారాల పాటు తాత్కాలిక కాల్పుల విరమణ అమల్లోకి వచ్చింది. అయితే, లెబనాన్పై ఇజ్రాయెల్ దాడులు, హార్ముజ్ జలసంధిపై ఇరాన్ ఆధిపత్యం నేపథ్యంలో ఈ కాల్పుల విరమణ శాశ్వత ఒప్పందంగా మారుతుందా లేదా అనేది ఇంకా సందిగ్ధంలోనే ఉంది. మరోవైపు గల్ఫ్ దేశాలలో శనివారం పరిస్థితి ప్రశాంతంగా ఉంది.






