మార్కెట్లో బుల్డోజర్ బీభత్సం.. 8 మంది దుర్మరణం

by Naga Rani Yarlagadda |

దహంజీ మార్కెట్లో హెవీ లోడ్ బుల్డోజర్ ప్రజలపైకి దూసుకెళ్లడంతో 8 మంది మృతి చెందారు. పదుల సంఖ్యలో ప్రజలు గాయాలపాలయ్యారు.

మార్కెట్లో బుల్డోజర్ బీభత్సం.. 8 మంది దుర్మరణం
X

దిశ, వెబ్‌డెస్క్: చైనా రాజధాని బీజింగ్‌ శివార్లలోని ఒక గ్రామీణ మార్కెట్‌లో శనివారం ఉదయం పెను విషాదం చోటుచేసుకుంది. వేగంగా వచ్చిన ఒక బుల్‌డోజర్ (ఫ్రంట్ లోడర్) జనంపైకి దూసుకెళ్లడంతో భారీగా ప్రాణనష్టం సంభవించింది. ఫాంగ్‌షాన్ జిల్లాలోని దహంజీ మార్కెట్‌లో ఈ ప్రమాదం జరిగింది. ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం.. ఒక భారీ నిర్మాణ వాహనం సెక్యూరిటీ చెక్‌పోస్ట్‌ను ధ్వంసం చేసుకుంటూ మార్కెట్ ప్రధాన రహదారిపైకి దూసుకువచ్చింది. ఆ సమయంలో మార్కెట్ జనంతో కిక్కిరిసి ఉంది. అదుపు తప్పిన వాహనం స్టాళ్లను, అక్కడున్న ప్రజలను తొక్కుకుంటూ వెళ్లడంతో మార్కెట్ అంతా చెల్లాచెదురైంది. శనివారం ఉదయం సుమారు 11 గంటల సమయంలో ఈ దుర్ఘటన జరగ్గా.. ఇది ఆలస్యంగా వెలుగుచూడటం గమనార్హం.

ఈ ఘటనకు కారణమైన 50 ఏళ్ల వ్యక్తిని భద్రతా దళాలు వెంటనే అదుపులోకి తీసుకున్నాయి. అధికారికంగా ఇంకా ఎటువంటి ప్రకటన రానప్పటికీ, సోషల్ మీడియాలో వస్తున్న సమాచారం ప్రకారం సుమారు ఎనిమిది మంది వరకు మరణించి ఉండవచ్చని తెలుస్తోంది. అనేకమంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన జరిగిన కొద్దిసేపటికే చైనా ప్రభుత్వం సమాచార నియంత్రణ (Censorship) చర్యలు చేపట్టింది. వీచాట్ (WeChat), డౌయిన్ (Douyin) వంటి సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో దహంజీ మార్కెట్, ఫాంగ్‌షాన్ రామింగ్ వంటి పదాల సెర్చ్ రిజల్ట్స్‌ను నిలిపివేసింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియోలను, పోస్టులను అధికారులు తొలగిస్తున్నట్లు అంతర్జాతీయ మానిటర్లు గుర్తించారు.

Next Story