- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
డేంజర్ బెల్స్ మోగిస్తోన్న ఎబోలా.. వేగంగా వ్యాపిస్తోన్న కొత్తరకం
డెమొక్రాటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగోలో అరుదైన ఎబోలా వైరస్ కొత్తరకం తీవ్రకలకలం రేపుతోంది.

దిశ, వెబ్డెస్క్: డెమొక్రాటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగోలో అరుదైన ఎబోలా వైరస్ కొత్తరకం తీవ్రకలకలం రేపుతోంది. ఈ ప్రాణాంతక వైరస్ బారిన పడి మరణించిన వారి సంఖ్య 131కి చేరింది. దీంతో ప్రపంచ ఆరోగ్య సంస్థ.. ఎబోలా వైరస్ కొత్త స్ట్రెయిన్ ను ఇప్పటికే పబ్లిక్ హెల్త్ ఎమర్జెన్సీగా ప్రకటించింది. కాంగో తూర్పు ప్రాంతంలో ఈ అరుదైన 'బుందిబుగ్యో' వేరియంట్ బారిన పడి 513 మంది వైద్యం తీసుకుంటున్నట్లు వైద్యులు చెప్తున్నారు.
అక్కడ ఈ ప్రాణాంతక వైరస్ బారిన పడిన ఒక అమెరికా పౌరుడిని అత్యవసర చికిత్స నిమిత్తం జర్మనీకి తరలిస్తున్నట్లు అమెరికా వ్యాధి నియంత్రణ, నివారణ కేంద్రం (CDC) మంగళవారం ప్రకటించింది. బాధితుడిని 'సెర్జ్ క్రిస్టియన్ మిషన్' అనే సంస్థకు చెందిన మెడికల్ మిషనరీ పీటర్ స్టాఫోర్డ్గా గుర్తించారు. అమెరికా అధికారుల అభ్యర్థన మేరకు బెర్లిన్లోని ప్రముఖ 'చారిటీ యూనివర్శిటీ హాస్పిటల్' లో ఉన్న ప్రత్యేక ఐసోలేషన్ వార్డులో ఆయనకు చికిత్స అందించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు జర్మనీ ఆరోగ్య మంత్రిత్వ శాఖ ధృవీకరించింది. అత్యంత ప్రమాదకరమైన అంటువ్యాధుల నిర్వహణలో జర్మనీకి చెందిన నిపుణుల బృందం నిరంతరం పర్యవేక్షిస్తుందని అక్కడి అధికార ప్రతినిధి తెలిపారు.
అయితే.. అమెరికా విధించిన ఈ ప్రయాణ ఆంక్షలపై ఆఫ్రికా సిడిసి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. కేవలం సరిహద్దులను మూసివేయడం వల్ల గ్లోబల్ హెల్త్ సెక్యూరిటీని సాధించలేమని, వ్యాధి మూలాలను అణచివేయడానికి అంతర్జాతీయంగా దూకుడుగా మద్దతు ఇవ్వడమే ఏకైక మార్గమని ఆఫ్రికా సిడిసి డైరెక్టర్ జనరల్ డాక్టర్ జీన్ కసేయా అభిప్రాయపడ్డారు. ఇదిలావుండగా, ప్రెసిడెంట్ డోనాల్డ్ ట్రంప్ పరిపాలనలో యుఎస్ సిడిసి నిధులలో కోతలు విధించడం, ఈ ఏడాది ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) నుండి అమెరికా అధికారికంగా వైదొలగడం వంటి పరిణామాలు, ప్రస్తుత ఎబోలా సహాయక చర్యలపై, అంతర్జాతీయ సమన్వయంపై తీవ్ర ప్రభావం చూపుతాయని ప్రజారోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.






