చైనా, జపాన్‌లలో భూకంపం: భయాందోళనలో ప్రజలు

by Dishanational2 |
చైనా, జపాన్‌లలో భూకంపం: భయాందోళనలో ప్రజలు
X

దిశ, నేషనల్ బ్యూరో: తైవాన్‌లో భూకంపం సంభవించిన విషయం మరువక ముందే చైనా, జపాన్‌లలో భూకంపం వచ్చింది. వాయువ్య చైనాలోని కింగ్‌హై ప్రావిన్స్‌లోని మంగ్యా నగరంలో గురువారం తెల్లవారుజామున 5.5 తీవ్రతతో భూకంపం సంభవించినట్టు చైనా భూకంప నెట్‌వర్క్స్ సెంటర్ (సీఈఎన్‌సీ) తెలిపింది.10 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం నమోదైనట్టు వెల్లడించింది. మరోవైపు జపాన్‌లో హోన్షు తూర్పు తీరంలో 6.3 తీవ్రతతో భూకంపం సంభవించినట్టు యూరోపియన్-మెడిటరేనియన్ సిస్మోలాజికల్ సెంటర్ తెలిపింది. దీని భూకంప కేంద్రం 32కిలోమీటర్ల లోతుతో నమోదైనట్టు పేర్కొంది. అయితే ఈ రెండు భూకంపాలకు సంబంధించిన ప్రాణనష్టం, ఆస్తి నష్టం వివరాలను అధికారులు వెల్లడించలేదు.

చైనా పొరుగున ఉన్న తైవాన్‌లో బుధవారం 7.5 తీవ్రతతో భూకంపం సంభవించిన విషయం తెలిసిందే. అనంతరం అధికారులు సునామీ హెచ్చరికలు జారీ చేశారు. ఈ నేపథ్యంలోనే చైనా, జపాన్‌లలో ప్రకంపనలు రావడంతో ఆందోళనలు నెలకొన్నాయి. తైవాన్‌లో ఇప్పటివరకు తొమ్మిది మంది మరణించగా..1000 మందికి పైగా గాయపడ్డట్టు తెలుస్తోంది.100కు పైగా భవనాలు, పలు రహదారులు, వంతెనలు దెబ్బతిన్నాయి. 50 మందికి పైగా గల్లంతుకాగా..అందులో ఇద్దరు భారతీయులు సైతం ఉన్నారు. అధికారులు సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.


Next Story

Most Viewed