దుబాయ్ ఎయిర్‌పోర్టుపై డ్రోన్ దాడి.. టన్నెల్స్‌లోకి ప్రయాణికులు

by Ramesh Naini |

ప్రపంచంలోనే అత్యంత రద్దీగా ఉండే దుబాయ్ అంతర్జాతీయ విమానాశ్రయం లక్ష్యంగా డ్రోన్ దాడి చేసినట్లు అంతర్జాతీయ మీడియాలో వార్తలు వస్తున్నాయి.

దుబాయ్ ఎయిర్‌పోర్టుపై డ్రోన్ దాడి.. టన్నెల్స్‌లోకి ప్రయాణికులు
X

దిశ, డైనమిక్ బ్యూరో: పశ్చిమాసియాలో యుద్ధం మరింత ఉగ్రరూపం దాల్చుతున్నాయి. అమెరికా, ఇజ్రాయెల్‌లతో ఇరాన్ జరుపుతున్న పోరాటంలో భాగంగా శనివారం ఉదయం ప్రపంచంలోనే అత్యంత రద్దీగా ఉండే దుబాయ్ అంతర్జాతీయ విమానాశ్రయం లక్ష్యంగా డ్రోన్ దాడి చేసినట్లు అంతర్జాతీయ మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఈ ఘటనతో దుబాయ్ నగరం ఒక్కసారిగా దద్దరిల్లింది. విమాన రాకపోకలకు తీవ్ర అంతరాయం కలగడంతో పాటు ప్రయాణికులు ప్రాణభయంతో పరుగులు తీశారు.

భారీ పేలుడుతో నిలిచిపోయిన విమానాలు!

శనివారం ఉదయం దుబాయ్ నగరంలో పేలుళ్ల శబ్దాలు వినిపించాయి. విమానాశ్రయంపై డ్రోన్ దాడికి సంబంధించిన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. డ్రోన్ ఢీకొన్న వెంటనే విమానాశ్రయ ప్రాంతంలో భారీ ఎత్తున పొగ కమ్ముకుంది. అప్రమత్తమైన అధికారులు ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్‌ను యాక్టివేట్ చేశారు. దీంతో భద్రతా కారణాల దృష్ట్యా దుబాయ్ నుంచి వెళ్లే, వచ్చే అన్ని విమానాలను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు ఎమిరేట్స్ ఎయిర్‌లైన్స్ ప్రకటించింది. అయితే, పరిస్థితిని సమీక్షించిన అనంతరం కొద్దిసేపటికే ఈ ఆంక్షలను ఎత్తివేసింది. ఎయిర్‌పోర్టులో అలర్ట్ ప్రకటించగానే ప్రయాణికులు ప్రాణాలు కాపాడుకోవడానికి రన్‌వే సమీపంలోని రైలు టన్నెల్స్‌లోకి పరుగులు తీసినట్లు వీడియోలు వైరల్ అవుతున్నాయి.

దుబాయ్‌పై దాడులు జరిగిన కొద్ది గంటలకే ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్ టెలివిజన్ వేదికగా ఒక అనూహ్య ప్రకటన చేశారు. గల్ఫ్ పొరుగు దేశాలపై దాడులను నిలిపివేస్తున్నట్లు ఆయన ప్రకటించారు. తమ క్షిపణి, డ్రోన్ దాడుల వల్ల ఇబ్బంది పడ్డ గల్ఫ్ దేశాల ప్రజలకు, ప్రభుత్వాలకు ఆయన క్షమాపణలు తెలిపారు. కాగా, గత వారం రోజులుగా ఇరాన్ జరుపుతున్న దాడుల్లో దుబాయ్, అబుదాబి నగరాలు నిరంతరం లక్ష్యంగా మారుతున్నాయి. ఇరాన్ ప్రయోగించిన మెజారిటీ క్షిపణులను యూఏఈ రక్షణ వ్యవస్థలు అడ్డుకుంటున్నప్పటికీ, కూలిన డ్రోన్లు, క్షిపణి శకలాల వల్ల నగరంలో అక్కడక్కడా అగ్నిప్రమాదాలు సంభవించాయి.

Next Story