భారతీయులకు అలర్ట్.. యూఏఈలో భారత వీసా, పాస్‌పోర్ట్‌ సేవలకు బ్రేక్‌!

by Ramesh Naini |   (  Updated:2026-06-20 10:22:51  IST  )

యూఏఈలోని ప్రవాస భారతీయులకు కీలక గమనిక. జూన్ 26 నుంచి 30వ తేదీ వరకు (ఐదు రోజుల పాటు) యూఏఈలో భారత పాస్‌పోర్ట్, వీసా, అటెస్టేషన్ సేవలు తాత్కాలికంగా నిలిచిపోనున్నాయి.

భారతీయులకు అలర్ట్.. యూఏఈలో భారత వీసా, పాస్‌పోర్ట్‌ సేవలకు బ్రేక్‌!
X

దిశ, డైనమిక్ బ్యూరో: యూఏఈలోని ప్రవాస భారతీయులకు కీలక గమనిక. జూన్ 26 నుంచి 30వ తేదీ వరకు (ఐదు రోజుల పాటు) యూఏఈలో భారత పాస్‌పోర్ట్, వీసా, అటెస్టేషన్ సేవలు తాత్కాలికంగా నిలిచిపోనున్నాయి. సేవలు అందించే కాంట్రాక్టును జూలై 1 నుంచి కొత్త సంస్థకు అప్పగిస్తున్న నేపథ్యంలో ఈ విరామం ప్రకటించినట్లు అబుదాబిలోని భారత రాయబార కార్యాలయం వెల్లడించింది.

కొత్త సంస్థ చేతికి బాధ్యతలు..

జూలై 1 నుంచి ఈ సేవల బాధ్యతను ‘అల్ హింద్ టూర్స్ అండ్ ట్రావెల్స్ (Al Hind Tours and Travel)’ సంస్థ తీసుకోనుంది. ఇందుకోసం జూలై 1న కొత్త ఆన్‌లైన్ పోర్టల్‌ను లాంచ్ చేయనున్నారు. ఏడు ఎమిరేట్స్‌లో మొత్తం 16 కేంద్రాల ద్వారా వీరు సేవలు అందిస్తారు.

పాత దరఖాస్తుల గడువు

ప్రస్తుతం పాస్‌పోర్ట్, వీసా సేవలు అందిస్తున్న ‘బీఎల్ఎస్ ఇంటర్నేషనల్’, అటెస్టేషన్ సేవలు చూస్తున్న ‘ఎస్‌జీఐవీఎస్ గ్లోబల్’ సంస్థలు జూన్ 25 సాయంత్రం తర్వాత కొత్త దరఖాస్తులను స్వీకరించవు. అలాగే సాధారణ అపాయింట్‌మెంట్లు నిలిచిపోయినప్పటికీ, మెడికల్ లేదా ఇతర అత్యవసర పరిస్థితుల్లో ఉన్నవారు అబుదాబి ఎంబసీ లేదా దుబాయ్ కాన్సులేట్ జనరల్‌ను సంప్రదించవచ్చని అధికారులు తెలిపారు. అత్యవసర సేవలకు టోల్ ఫ్రీ నెంబర్: 800 INDIA (800 46342), వాట్సాప్ +971 54 309 0571 మార్గాల ద్వారా అధికారులను ఆశ్రయించవచ్చని పేర్కొన్నారు. సేవల మార్పుకు సంబంధించిన అధికారిక సమాచారం కోసం భారత ఎంబసీ లేదా కాన్సులేట్ అధికారిక వెబ్‌సైట్లను మాత్రమే అనుసరించాలని అధికారులు సూచించారు.

Next Story