- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
7 గంటలు గాల్లోనే.. సౌదీ నుంచి ఢిల్లీకి యూటర్న్ తీసుకున్న ఎయిరిండియా విమానం
విమానంలో సాంకేతిక లోపం తలెత్తడంతో సౌదీ అరేబియా గగనతలం నుంచి పైలట్లు ఎయిరిండియా విమానాన్ని తిరిగి ఢిల్లీకి తీసుకొచ్చారు.

దిశ, డైనమిక్ బ్యూరో: ఢిల్లీ నుంచి లండన్ (హీత్రూ) వెళ్తున్న ఎయిరిండియా విమానం (AI111) మార్గమధ్యలోంచి వెనక్కి మళ్లింది. విమానంలో సాంకేతిక లోపం తలెత్తడంతో సౌదీ అరేబియా గగనతలం నుంచి పైలట్లు ఈ విమానాన్ని తిరిగి ఢిల్లీకి తీసుకొచ్చారు. ఏడు గంటల పాటు గాల్లోనే ప్రయాణించిన ఈ విమానం ఎట్టకేలకు ఢిల్లీలో సురక్షితంగా ల్యాండ్ కావడంతో ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. గురువారం ఉదయం 6 గంటల ప్రాంతంలో ఢిల్లీలో టేకాఫ్ అయిన ఎయిరిండియా (A350) విమానం సుమారు నాలుగు గంటల పాటు ప్రయాణించింది. సౌదీ అరేబియా గగనతలంలోకి ప్రవేశించిన తర్వాత, విమానంలో వింత శబ్దాలు రావడాన్ని సిబ్బంది గుర్తించారు.
సురక్షితంగా ల్యాండింగ్...
వింత శబ్దాల నేపథ్యంలో ప్రయాణికుల భద్రతను దృష్టిలో ఉంచుకుని ముందుజాగ్రత్త చర్యగా విమానాన్ని ఢిల్లీకి మళ్లించారు. టేకాఫ్ అయిన ఏడు గంటల తర్వాత.. అంటే మధ్యాహ్నం 12:30 గంటల సమయంలో విమానం ఢిల్లీ విమానాశ్రయంలో సురక్షితంగా ల్యాండ్ అయింది. ఈ ఘటనపై ఎయిరిండియా ప్రతినిధి స్పందిస్తూ.. ‘ప్రయాణికుల భద్రత మాకు అత్యంత ప్రాధాన్యం. అందుకే విమానాన్ని వెనక్కి రప్పించాం. ప్రస్తుతం నిపుణులు విమానంలో సాంకేతిక తనిఖీలు చేస్తున్నారు. ప్రయాణికులకు కలిగిన అసౌకర్యానికి చింతిస్తున్నాం. వారు వీలైనంత త్వరగా లండన్ చేరుకునేలా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నాం’ అని వెల్లడించారు. అయితే, విమానంలో ఎంతమంది ప్రయాణికులు ఉన్నారనేది స్పష్టం చేయలేదు.






