దాయాది దేశంలో హిందూ వైద్యుడి దారుణ హత్య

by Disha Web Desk 1 |
దాయాది దేశంలో హిందూ వైద్యుడి దారుణ హత్య
X

దిశ, వెబ్ డెస్క్: దాయాది దేశంలో దారుణం జరిగింది. కరాచీ నగరంలో ఓ హిందూ వైద్యుడిని గుర్తు తెలియని వ్యక్తులు తుపాకీతో దారుణంగా కాల్చి చంపారు. మృతుడిని పోలీసులు కంటి వైద్యుడు డా.బీర్బల్ జినానీగా గుర్తించారు. అతను ఇది వరకు కరాచీలోని మెట్రోపాలిటన్ కార్పొరేషన్ ఆరోగ్య విభాగానికి సీనియర్ డైరెక్టర్ గా కూడా పని చేశారు. వివరాల్లోకి వెళితే డా.జినానీ తన అసిస్టెంట్ అయిన మరో వైద్యురాలితో కలిసి కారులో గుల్షణ్-ఏ-ఇక్బాల్ ప్రాంతానికి వెళ్తున్నారు. ఈ క్రమంలోనే లైయారీ ఎక్స్‌ప్రెస్ హైవేపై గార్డెన్ క్రాస్‌రోడ్స్‌ వద్దకు కారు చేరుకోగానే ఒక్కసారిగా గుర్తు తెలియని వ్యక్తులు జినానీపై కాల్పులు జరిపారు.

ఈ ఘటనలో జినానీ అక్కడికక్కడే మృతి చెందగా.. మరో వైద్యురాలికి బుల్లెట్ గాయాలయ్యాయి. కాల్పులు జరిగిన వెంటనే జినానీ ప్రయాణిస్తున్న కారు అదుపు తప్పి ఓ గోడకు ఢీకొట్టింది. ఈ తతంగం అంతా సమీపంలోని సీసీటీవీ కెమెరాల్లో రికార్డైంది. ఈ నేపథ్యంలో డా.జినానీ హత్యపై పూర్తి స్థాయి నివేదిక ఇవ్వాలంటూ కరాచీ పోలీస్ అడిషనల్ ఇన్స్‌స్పెక్టర్ జనరల్‌ను ఆదేశించారు. కేవలం నెలరోజుల వ్యవధిలో పాకిస్థాన్ లో ఇద్దరు వైద్యులు హత్యకు గురికావడం సోచనీయం.

Also Read..

తానా ప్రపంచ సాహిత్యవేదిక ఆధ్వర్యంలో “మన యువశక్తి – తెలుగు భాషానురక్తి”


Next Story