ట్విన్ టవర్స్‌పై దాడికి 24 ఏళ్లు.. నేటికీ కళ్లెదుటే కదలాడుతోన్న విషాదం

by Malleboina Mahesh |

సరిగ్గా 24 సంవత్సరాల కింద అమెరికాతో పాటు యావత్ ప్రపంచాన్ని ఉగ్రదాడి ఊహించని షాక్‌కు గురి చేసింది.

ట్విన్ టవర్స్‌పై దాడికి 24 ఏళ్లు.. నేటికీ కళ్లెదుటే కదలాడుతోన్న విషాదం
X

దిశ, వెబ్‌డెస్క్: సరిగ్గా 24 సంవత్సరాల కింద అమెరికాతో పాటు యావత్ ప్రపంచాన్ని ఊహించని ఉగ్రదాడి షాక్‌కు గురి చేసింది. 2001 సెప్టెంబర్ 11న అమెరికాలో జరిగిన ఉగ్రదాడులు ఆ దేశాన్ని అతలాకుతలం చేశాయి. ఆ రోజు ఉదయం న్యూయార్క్ నగరంలోని వరల్డ్ ట్రేడ్ సెంటర్ (World Trade Center) ట్విన్ టవర్స్‌పై ఉగ్రవాదులు (Terrorist attack on the Twin Towers) మెరుపు దాడి చేశారు. రెండు విమానాలను ఉగ్రవాదులు హైజాక్ చేసి వాటితో.. ట్విన్ టవర్స్‌పై దూసుకెళ్లారు. ఆ సయమంలో మొదటిసారిగా ఇలాంటి ఘటనను చూసిన అమెరికా ప్రజలు భయభ్రాంతులకు గురయ్యారు. గంటల వ్యవధిలోనే ట్విన్ టవర్స్ కూలిపోవడంతో దుమ్ము, పొగతో న్యూయార్క్ వీధులు నిండిపోయాయి.

ఎవరూ ఊహించని ఈ దాడుల్లో వేలమంది అమాయకుల ప్రాణాలు కోల్పోయారు. రక్షణ సిబ్బంది, అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు ప్రాణాలనే పణంగా పెట్టి వేల మందిని రక్షించడానికి ప్రయత్నించారు. ఆ ఘటన తర్వాత అమెరికా భద్రతా విధానాల్లో విప్లవాత్మక మార్పులు జరిగాయి. అంతర్జాతీయ స్థాయిలో ఉగ్రవాద వ్యతిరేక యుద్ధానికి నాంది పలికింది. ఉగ్రవాదులు ఈ దుశ్చర్య మానవ చరిత్రలో అత్యంత విషాదకరమైన రోజుగా మిగిలిపోయింది. దీంతో నేటికీ సెప్టెంబర్ 11వ తేదీని అమెరికాలో "Patriot Day"గా పాటిస్తూ బాధితులను స్మరించుకుంటున్నారు. ఉహించని దాడిలో బంధువులను కోల్పోయిన వారి ఆవేదన, భయాందోళనలు ఇంకా అమెరికా జ్ఞాపకాల్లో మిగిలే ఉన్నాయి.

కానీ రాజకీయంగా ఈ ఘటన అమెరికా, ప్రపంచ రాజకీయాలను మార్చేసింది. ఉగ్రవాదంపై యుద్ధం పేరుతో అమెరికా అఫ్ఘానిస్తాన్‌పై దాడి చేసింది. తరువాత ఇరాక్‌లోనూ సైనిక చర్యలు చేపట్టింది. దీని వల్ల మిలియన్లాది ప్రజలు శరణార్థులుగా మారారు. మధ్యప్రాచ్యంలో అస్థిరత పెరిగి, అంతర్జాతీయ సంబంధాలు కొత్త దిశను ఎంచుకున్నాయి. అదే సమయంలో అమెరికాలో భద్రతా విధానాలు కఠిన మయ్యాయి. వలసల నియంత్రణ, విమాన ప్రయాణాల్లో కఠిన తనిఖీలు మొదలయ్యాయి. సరిగ్గా 24 ఏళ్ల కిందట జరిగి ఈ విషాద ఘటన మానవీయంగా నష్టాన్ని మిగిల్చినప్పటికీ, రాజకీయంగా ప్రపంచ శాంతి, భద్రతలపై పెద్ద ప్రశ్నలను లేవనెత్తింది. ఈ సంఘటనతో "ఉగ్రవాదం ఒక దేశానికే కాదు, మొత్తం ప్రపంచానికే ముప్పు" అనే అవగాహన అంతర్జాతీయ సమాజంలో బలపడింది.

పక్కా ప్రణాళికతో అల్-ఖైదా ఉగ్రవాదుల దాడి

ముందస్తుగా ప్లాన్ ప్రకారం అల్-ఖైదా ఉగ్రవాదులు ఈ దాడికి పాల్పడ్డారు. న్యూయార్క్ నగరంలోని వరల్డ్ ట్రేడ్ సెంటర్, వాషింగ్టన్ డీసీ లోని పెంటగాన్, పెన్సిల్వేనియాలో విమానాలను అల్-ఖైదా ఉగ్రవాదులు హైజాక్ చేసి ఈ దాడి చేశారు. 19 మంది ఉగ్రవాదులు నాలుగు విమానాలను హైజాక్ చేసి, రెండు విమానాలను వరల్డ్ ట్రేడ్ సెంటర్‌లోని ట్విన్ టవర్లపైకి, ఒక విమానాన్ని పెంటగాన్‌పైకి, నాలుగో విమానాన్ని పెన్సిల్వేనియాలో కూల్చివేశారు. ఈ దాడులలో దాదాపు 3,000 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇది అమెరికా చరిత్రలో అత్యంత ఘోరమైన సంఘటన గా నిలిచిపోయింది. అనంతరం అమెరికా ఉగ్రవాదంపై ఉక్కుపాదం మోపడం స్టార్ట్ చేసింది.

Next Story