అనుకున్న లక్ష్యం నెరవేరలేదు: గ్రెగ్ బార్‌క్లే

by  |
అనుకున్న లక్ష్యం నెరవేరలేదు: గ్రెగ్ బార్‌క్లే
X

దిశ, స్పోర్ట్స్ : టెస్టు చాంపియన్‌షిప్ వల్ల అనుకున్న లక్ష్యం నెరవేరలేదని.. కరోనా మహమ్మారి కారణంగా ఈ చాంపియన్‌షిప్ ఒక ఫెయిల్యూర్‌గా మారిందని ఐసీసీ చైర్మన్ గ్రెగ్ బార్‌క్లే అభిప్రాయపడ్డారు. టెస్టు ఫార్మాట్‌కు మరింత ఆదరణ తీసుకొని రావాలనే ఉద్దేశంతో ఐసీసీ టెస్టు చాంపియన్‌షిప్‌ను ప్రారంభించింది.. 2021లో దీనికి సంబంధించిన ఫైనల్స్ జరగాల్సి ఉన్నది. కానీ, కొవిడ్ కారణంగా పలు దేశాల మధ్య జరగాల్సిన ద్వైపాక్షిక సిరీస్‌లు రద్దు కావడంతో ఇటీవలే ఐసీసీ చాంపియన్‌షిప్ పాయింట్ల విధానంలో మార్పులు తీసుకొని వచ్చింది.

‘కోవిడ్-19 కారణంగా చాంపియన్‌షిప్‌లోని లోపాలు బయటపడ్డాయి. దీనికి సంబంధించిన వివరాలను ఇప్పటికే నేను తెప్పించుకున్నాను. టెస్టులకు ఆదరణ పెంచడానికే ఈ ఈవెంట్ నిర్వహిస్తున్నాము. తర్వాత మరింత పకడ్బందీగా టెస్టు చాంపియన్‌షిప్ రూపొందిస్తాము. ఇప్పటికైతే ఈ చాంపియన్‌షిప్ వల్ల అనుకున్న లక్ష్యం నెరవేరలేదనే భావిస్తున్నాను’ అని గ్రెగ్ బార్‌క్లే మీడియాతో అన్నారు. కొవిడ్ వల్ల చిన్న దేశాలు బయో సెక్యూర్ ఏర్పరచుకొని టెస్టులు ఆడలేక పోయాయి. ప్రస్తుతం పెద్ద దేశాల్లోనే టెస్టులు జరుగుతున్నాయి. దీని వల్ల పలు దేశాలు నష్ట పోతున్నాయి. అందుకే పాయింట్ల విధానంలో మార్పులు తీసుకొని వచ్చామని బార్‌క్లే అన్నారు.


Read More ఖద్దరు వెనుక కన్నీటి వ్యథ లెన్నో.. సర్పంచ్ ఎన్నికలపై గ్రామాల్లో జోరుగా చర్చ !



Next Story

Most Viewed