పంచాయతీ కార్యదర్శి మెడపై కత్తి

by  |
Workload on Panchayat Secretaries
X

ఉద్యోగం వచ్చిందని సంబురపడాలో.. పర్మినెంట్​ కాకముందే ఊడుతుందేమోనని దిగాలుపడాలో తెలియని పరిస్థితి.. ఉన్న పనులకే దిక్కులేదు, ఇప్పుడు అదనంగా మరిన్ని బాధ్యత​లు అంటగట్టడంతో పంచాయతీ కార్యదర్శులు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. చదివిన చదువుకు, చేస్తున్న ఉద్యోగానికి పొంతనలేకే కుమిలిపోతున్నారు. సర్కార్​ కొత్తకొత్త నిబంధనలతో మరింత కుంచించుకుపోతున్నారు.

దిశ, తెలంగాణ బ్యూరో: పంచాయతీ కార్యదర్శులు పనిభారంతో తల్లడిల్లుతున్నారు. రోజు రోజుకూ విధులభారం పెరుగుతుండటంతో ఉద్యోగాలను వదులుకుంటున్నారు. ఉన్నతాధికారులేమో ఉపాధి పనుల టార్గెట్​తో విధుల నుంచి తొలగిస్తామని బెదిరింపులకు దిగుతున్నారు. ఈ క్రమంలోనే ఈజీఎస్​ పనులను కల్పంచడం లేదంటూ 1100 మందికిపైగా కార్యదర్శులకు షోకాజ్​ నోటీసులు జారీ చేశారు. అసలే ప్రొబెషనరీ సమయంలో ​ నోటీసులు వస్తుండటంతో విధులను వదిలేసుకునేందుకే ఎక్కువ మంది సిద్ధమవుతున్నారు. కార్యదర్శులపై ఈజీఎస్‌ అమలు తీవ్ర భారమవుతోంది. ఫీల్డ్‌ అసిస్టెంట్లను తొలగించిన తర్వాత వారి విధులను కూడా కార్యదర్శులే చేస్తున్నారు. ఉపాధి పనులు గుర్తించడం, కూలీలకు పనులు అప్పగించడం, హాజరును నమోదు చేయడం, డబ్బులు చెల్లించడం, జాబ్‌ కార్డులను జారీ చేయడం తదితర పనులన్నీ వారే చేయాల్సి వస్తోంది. దీంతో అసలు జాబ్‌ చార్డ్‌ను పక్కన పెట్టాల్సి వస్తోంది. ఇక గ్రామాల్లో పారిశుధ్య పరిరక్షణ బాధ్యత కూడా వారిదే. ప్రతీ 500 జనాభాకు ఒక పారిశుధ్య కార్మికుడిని ఇచ్చినా సరిపోవడం లేదు. వీటికి తోడు పన్నులు వసూలు, వీధి లైట్ల నిర్వహణ, ఇతర పనులు ఈ కార్మికుడే చూడాల్సి రావడంతో పారిశుధ్య పనులకు ఆటంకం కలుగుతోంది.

రాజీనామా బాట

ప్రభుత్వం 9,355 మంది కార్యదర్శులను 2019 ఏప్రిల్‌లో నియమించింది. ఉన్నత విద్యను అభ్యసించిన వారు కూడా ఈ ఉద్యోగాల్లో చేరారు. 1310 మంది మొదట్లోనే ఉద్యోగాలు వదులుకోగా, ప్రభుత్వ ఒత్తిడిని తట్టుకోలేక మరికొంతమంది తప్పుకున్నారు. యాప్​లు, ఉపాధి హామీ పనిభారంతో 90 మందికిపైగా ఈ ఏడాది రాజీనామా చేశారు. జూనియర్‌ పంచాయతీ కార్యదర్శులు ప్రొబేషనరీ కాలం మూడేళ్లు. ఆ సమయంలో ఏ చిన్నపొరపాటు జరిగినా ఇక అంతే. వాస్తవానికి ఏ ఉద్యోగికి ఇంత ప్రొబెషనరీ పీరియడ్‌ ఉండదు. ఇదే సమయంలో షోకాజ్​ నోటీసులు వస్తే రెగ్యులర్​ సమయంలో చాలా ఇబ్బందులు వస్తాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక, మహిళా కార్యదర్శులకు ప్రసూతి సెలవులు లేవు, పెడితే వేతనంలో కోత తప్పదు. ప్రస్తుతం కార్యదర్శుల్లో 50 శాతం మహిళలే. రెండు మొబైల్‌ యాప్‌లు పంచాయతీ సెక్రటరీలను ఇబ్బంది పెడుతున్నాయి. ఈ బాధ్యతల నుంచి తప్పించాలని కోరుతున్నారు.

ఆర్థిక భారం

పంచాయతీల్లో నిధుల్లేకపోవడంతో కార్యదర్శులపై భారం పడుతోంది. పల్లె ప్రగతిలో భాగంగా ప్రతినెలా ప్రభుత్వం రూ.339 కోట్లు విడుదల చేస్తున్నా ఒక్కో గ్రామానికి రూ.50వేల నుంచి రూ.లక్ష వరకే వస్తున్నాయి. పెద్ద గ్రామాల పరిస్థితి కొంత ఫర్వాలేకున్నా చిన్నగ్రామాల్లో నిధులు సమస్యగా మారాయి. పాలకవర్గాల ఖర్చులు, మండలాధికారుల పర్యటనల ఖర్చుతో పాటు రోజూ గ్రామంలో సమావేశాలు ఉండే పరిస్థితులు నెలకొన్నాయి. వీటి ఖర్చులు కూడా కార్యదర్శులదే. రోడ్ల నిర్వహణకు కూడా రూపాయి రావడం లేదు. పారిశుధ్య కార్మికులు, మల్టీపర్పస్ ఉద్యోగులకు వేతనాలు పెంచడంతో పల్లెప్రగతి నిధులు వాటికే సరిపోతున్నాయి. బిల్లులు పెడుతున్నా విడుదల చేయడం లేదు. కార్యదర్శులకు రూ.15 వేల జీతం ఇస్తున్నా, సక్రమంగా చెల్లింపులు లేకపోవడం, నోటీసులు, మెమోలతో జీతాల్లో కోతతో వారికీ డబ్బులు సరిపోవడం లేదు. గ్రామాల్లో ఖర్చులు పెరిగిపోవడంతో కార్యదర్శులు విధులపై ఆసక్తి చూపడం లేదు.

Next Story

Most Viewed