కోమటిరెడ్డి పై సంచలన వ్యాఖ్యలు చేసిన జగ్గారెడ్డి

by  |
jaggareddy
X

తెలంగాణ బ్యూరో : కొత్త పీసీసీ కమిటీపైన భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డికి అసంతృప్తి ఉన్నదని, త్వరలోనే అది సర్దుకుంటుందని వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి వ్యాఖ్యానించారు. కొత్త పీసీసీ కమిటీతో ఆయనకు గ్యాప్ ఉన్న మాట నిజమేనని అన్నారు. ఆ ఆగాధాన్ని పూడ్చే ప్రయత్నాలు జరుగుతున్నాయని, ఆయనకు ఉన్న అసంతృప్తిని చల్లార్చే ప్రక్రియ జరుగతున్నదని అన్నారు. త్వరోలోనే గాంధీ భవన్‌కు కూడా వస్తారని అన్నారు. గాంధీ భవన్‌లో ఆదివారం ఆయన మీడియాతో చిట్‌చాట్ చేస్తూ, నిజంగా కోమటిరెడ్డికి పార్టీపైన అసంతృప్తి ఉంటే ఇప్పటికే ఒక నిర్ణయం తీసుకుని ఉండేవారని, కానీ ఇంకా పార్టీలోనే కొనసాగుతున్నారంటే ఆయనకు కాంగ్రెస్‌పైన కోపం లేదనే అర్థం చేసుకోవాలన్నారు. ఒకవేళ పార్టీపైనే ఆయనకు కోపంఉన్నట్లయితే ఈ పాటికే పార్టీ నుంచి వెళ్ళిపోయి ఉండేవారన్నారు.

పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిని కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తాలిబన్లతో పోల్చడం దురదృష్టకరమని, దాన్ని తాను సమర్ధించబోనని జగ్గారెడ్డి స్పష్టం చేశారు. వైఎస్సార్సీపీ గౌరవాధ్యక్షురాలు ఇటీవల నిర్వహించి ఆత్మీయ సమ్మేళనానికి కోమటిరెడ్డి హాజరుకావడాన్ని ప్రస్తావిస్తూ, విజయమ్మ ఆహ్వానం మేరకే ఆయన హాజరయ్యారని, ఆత్మీయ సమ్మేళనం కాబట్టి రాజకీయాలకు ఆతీతంగా జరిగిందనే అభిప్రాయం ఆయనకు ఉండొచ్చని వ్యాఖ్యానించారు.

కానీ ఇదే విషయాన్ని మధు యాష్కీ తప్పుపట్టాన్ని పాత్రికేయులు ప్రస్తావించగా, ఏ కోణంలోమధు యాష్కీ ఆ విమర్శలు చేశారో తనకు తెలియదన్నారు. ఆ సమావేశానికి వెళ్ళొద్దంటూ కాంగ్రెస్ ఆదేశాలు జారీ చేసినట్లు వచ్చిన వ్యాఖ్యలపై జగ్గారెడ్డి స్పందిస్తూ, వాటిని వెనక్కి తీసుకోవాలని కోమటిరెడ్డి చేసిన వ్యాఖ్యలపై తాను మాట్లాడదల్చుకోలేదన్నారు.

తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడికి ఎమ్మెల్యే సీతక్క రాఖీ కట్టడం గురించి ప్రస్తావిస్తూ, అందులో తప్పేమీ లేదని, ఆమె తీసుకున్న నిర్ణయాన్ని సమర్ధిస్తున్నానని అన్నారు. కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఆత్మీయ సమ్మేళనానికి వెళ్ళడం కూడా తప్పుకాదన్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఇటీవల చేసిన వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ, కేసీఆర్‌ను నిజంగా జైల్లో పెట్టాలనే ఉద్దేశం ఆయనకు ఉన్నదా అని ప్రశ్నించారు. ఇప్పటికి ఆ మాటను వందసార్లు చెప్పి ఉంటారని, ఒకవేళ అదే నిజమైన ఆ పార్టీకి చెందిన మాజీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా తో భేటీ సందర్భంగా దర్జాగా ఎలా కూర్చున్నారని ప్రశ్నించారు. దీని గురించి బండి సంజయ్ ఆలోచించాలని హితవు పలికారు.

Next Story

Most Viewed