అధికారుల నిర్లక్ష్యం వల్లే కార్మికులు మృతి.. నష్ట పరిహారం చెల్లించాలి

by  |
అధికారుల నిర్లక్ష్యం వల్లే కార్మికులు మృతి.. నష్ట పరిహారం చెల్లించాలి
X

దిశ, మణుగూరు : మణుగూరు మండలంలోని సింగరేణి ఓసి-2లో బుధవారం జరిగిన వంద టన్నుల డంపర్.. బొలెరోను ఢీ కొట్టిన ఘటనలో ముగ్గురు కార్మికులు మృతి చెందిన విషయం విధితమే. గురువారం ఐఎఫ్‌టీయూ జిల్లా ఉపాధ్యక్షులు ఆర్. మధుసూదన్ రెడ్డి ఓసి-2లో జరిగిన ప్రమాదస్థలాన్ని సందర్శించి, ప్రమాదంలో మరణించిన కార్మిక కుటుంబాలకు నష్టపరిహారం చెల్లించాని డిమాండ్ చేశారు.

అనంతరం చనిపోయిన కార్మికుల మృతికి సంతాపం ప్రకటించి, ఐఎఫ్‌టీయూ ఆధ్వర్యంలో నల్లబ్యాడ్జీలు ధరించి రెండు నిమిషాలు మౌనం పాటించారు. అనంతరం కార్మికుల మృతదేహాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించి, తమ కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సింగరేణి ప్రమాదంలో ముగ్గురు కార్మికులు చనిపోవడం దురదృష్టకరమన్నారు. మరణించిన కార్మికులకు కోటి రూపాయల నష్టపరిహారం, కుటుంబంలో ఒకరికి ఉద్యోగంతో పాటు, ఇతర చట్టబద్ధ పరిహారాన్ని చెల్లించాలని డిమాండ్ చేశారు. సింగరేణి అధికారుల నిర్లక్ష్యం కారణంగానే కార్మికులు మరణించారని ఆవేదన వ్యక్తం చేశారు.

మరణించిన వారిలో ఒకరు కాంట్రాక్ట్ కార్మికుడని, పర్మినెంట్ కార్మికులతో పాటు కాంట్రాక్ట్ కార్మికునికి చట్టబద్ధమైన పరిహారం అందించాలని డిమాండ్ చేశారు. సింగరేణికి వచ్చే లాభాలు కార్మికుల శ్రమవల్లేనని ఆ విషయాన్ని అధికారులు మర్చిపోవద్దన్నారు. 23వ తేదీన జరిగే సింగరేణి చర్చలలో సింగరేణి యాజమాన్యం గుర్తింపు సంఘం, ప్రాతినిధ్య సంఘాలు చిత్తశుద్ధితో ఆలోచించి పర్మినెంట్ కార్మికులతో పాటు కాంట్రాక్ట్ కార్మికులకు కూడా నష్టపరిహారం పాలసీని తీసుకురావాలన్నారు.

ఉత్పత్తి లక్ష్యంగా కార్మికుల రక్షణను విస్మరించి ముగ్గురు కార్మికుల ప్రాణాలు పోవడానికి కారణమైన ఓసీ-2 అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. భవిష్యత్‌లో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని సింగరేణి అధికారులను కోరారు. ఈ కార్యక్రమంలో ఐఎఫ్‌టీయూ మణుగూరు ఏరియా నాయకులు ఎండీ గౌస్, అశోక్, సత్తి, విజయ్, మంగీలాల్, ఖాన్, జావేద్, బాబి, వెంకన్న, కనకరాజు, కళ్యాణ్, శ్రీను, ప్రసాద్, ప్రవీణ్, బాలు తదితరులు పాల్గొన్నారు.

Next Story