సిటీ సివిల్​కోర్టు న్యాయసేవాధికార సంస్థకు మహిళల చేయూత

by  |
Womens Help
X

దిశ, తెలంగాణ బ్యూరో: లాక్ డౌన్ కాలంలో ఇబ్బందులు పడుతోన్న అభాగ్యులకు సిటీ సివిల్ కోర్టు న్యాయసేవాధికార సంస్థ భోజనం, నిత్యావసర వస్తువులు పంపిణీ చేస్తోంది. ఈ కార్యక్రమానికి పలువురు గృహిణులు స్పందించారు. స్వచ్ఛందంగా సహకరించేందుకు ముందుకొస్తున్నారు. వారి ఇంట్లోనే భోజనం వండి ఆహార పొట్లాలను సిద్ధం చేసి న్యాయసేవాధికార సంస్థకు అందిస్తున్నారు.

ఈ సందర్భంగా సేవకు ముందుకొస్తున్న మహిళలను సిటీ సివిల్ కోర్టు న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి, సీనియర్ సివిల్ జడ్జి కె.మురళీమోహన్ అభినందించారు. లాక్ డౌన్ కారణంగా వలస కార్మికులకు, పేదలకు ఎలాంటి ఇబ్బంది రాకుండా చూసుకోవాలని కోరారు. కాగా, తెలంగాణ రాష్ట్ర న్యాయసేవాధికార సంస్థ సభ్య కార్యదర్శి అనుపమ చక్రవర్తి, సిటీ సివిల్ కోర్టు న్యాయసేవాధికార సంస్థ చైర్ పర్సన్, చీఫ్ జడ్జి డాక్టర్ సి.సుమలత సూచనల మేరకు పారా లీగల్ వాలంటీర్ల, గృహిణులు, పలు ఎన్జీఓల సహకారంతో పది రోజులుగా ఆహారాన్ని, నిత్యావసరాలను, మాస్క్ లను పంపిణీ చేస్తున్నారు.

City Civil Court Judiciary

అందులో భాగంగా మంగళవారం మధ్యాహ్నం సిటీ సివిల్ కోర్ట్ న్యాయ సేవ అధికార సంస్థ కార్యదర్శి కె మురళీమోహన్ మోహన్, పలువురు పారా లీగల్ వాలంటీర్లతో కలిసి హైదరాబాదులోని ఉస్మానియా ఆస్పత్రి వద్ద రోగుల కుటుంబ సభ్యులకు, చార్మినార్ వద్ద పేదలకు, అసంఘటిత కార్మికులకు, పారిశుద్ధ్య సిబ్బందికి సుమారు ఐదు వందల భోజన పొట్లాలు పంపిణీ చేశారు. గచ్బిబౌలి ప్రాంతానికి చెందిన గృహిణిలు గాయత్రి, భువనేశ్వరి, కస్తూరి, రితిక, విజయలక్ష్మి, రింకీ, నిధా తదితరులు స్వయంగా భోజనం వండి న్యాయసేవా సంస్థకు అందించారు.

రాజేంద్ర కుమార్, యతీంద్ర కుమార్, రేఖా చారిటబుల్ సంస్థలు కూడా భోజన పంపిణీకి న్యాయ సేవా సంస్థకు సహకరించేందుకు ముందుకు వచ్చారు. కార్యక్రమంలో పారా లీగల్ వాలంటీర్లు బి.సురేష్ కుమార్, దయాకర్ రావు, ప్రమోద్ కుమార్, ఖాసీం అలీ, రేఖ చారిటబుల్ ఎన్జీఓ నిర్వాహకులు రేఖ తదితరులు పాల్గొన్నారు.


Next Story