అమెరికన్ కాంగ్రెస్‌లో మహిళా సాధికారత

by  |
అమెరికన్ కాంగ్రెస్‌లో మహిళా సాధికారత
X

వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ కాంగ్రెస్‌లో చేసిన తొలి ప్రసంగం దేశ చరిత్రలో కీలక మైలురాయికి చిహ్నంగా మిగలనుంది. ఉభయ సభలను ఉద్దేశించిన ఆయన బుధవారం ప్రసంగిస్తుండగా వేదికపై ఇద్దరూ మహిళామణులు అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హ్యారిస్, స్పీకర్ నాన్సీ పెలోసి‌ ఆసీనులై అరుదైన దృశ్యానికి రూపమిచ్చారు. జో బైడెన్ తన ప్రసంగాన్ని ప్రారంభిస్తూ వెనుదిరిగి ‘మేడం స్పీకర్. మేడం వైస్ ప్రెసిడెంట్’ అంటూ గౌరవసూచకంగా ప్రస్తావించారు. ఈ పోడియం ఇప్పటి వరకు ఏ అధ్యక్షుడూ ఈ మాటలను పలుకలేదని బైడెన్ అన్నారు.

ఇది మారిన కాలానికి గుర్తు అని వివరించారు. 245 ఏళ్ల అమెరికా చరిత్రలో ఇద్దరు మహిళలు అధికారంలో కీలక స్థానాలు తొలిసారి అధిరోహించిన ఘట్టం ఇది. ఈ దృశ్యాన్ని అరుదుగా, అభివృద్ధిగా భావిస్తూ సభకు హాజరైన సభ్యులు స్టాండింగ్ ఓవేషన్ ఇచ్చారు. ఫస్ట్ లేడీ జిల్ బైడెన్, సెకండ్ జెంటిల్‌మన్ డగ్లస్ ఎమోఫ్ ఈ ఘట్టంలో భాగస్వాములయ్యారు. కరోనా కారణంగా పరిమితసంఖ్యలోనే సభ్యులు హాజరయ్యారు. మహమ్మారి కట్టడి కోసం డెమోక్రాట్లు తొలినుంచీ గళమెత్తిన మాస్కులను ఈ ఇరువురు ధీర వనితలు ధరించి ఉండటం మరో కోణంగా విశ్లేషిస్తున్నారు. ‘అందరి మహిళల్లాగే, ఈ క్షణాన గర్విస్తున్నాను. వారి ప్రాతినిధ్యాన్ని చూసి ఆనందపడుతున్నాను’ అని డెమోక్రాట్ సభ్యురాలు బార్బరా లీ తన ట్వీట్ చేసి సంతోషాన్ని వ్యక్తం చేశారు.

Next Story