పోలింగ్‌కు ముందు TRSకు బిగ్ షాక్.. హుజురాబాద్‌లో రోడెక్కిన మహిళలు(వీడియో)

by  |
పోలింగ్‌కు ముందు TRSకు బిగ్ షాక్.. హుజురాబాద్‌లో రోడెక్కిన మహిళలు(వీడియో)
X

దిశ ప్రతినిధి, కరీంనగర్ : ఎంకి పెళ్లి సుబ్బి చావుకొచ్చిందంటే ఇదేనేమో కాబోలు.. ఓటర్లను ఆకర్షించేందుకు చేసిన ప్రయత్నం కాస్తా గ్రౌండ్ లెవల్లో వికటించింది. సీల్డ్ కవర్లు చేరిన విషయం సోషల్ మీడియాతో పాటు ఆ నోటా ఈ నోటా ప్రచారం విస్తృతం కావడంతో హుజురాబాద్ నియోజకవర్గంలోని పల్లెల్లో ఆందోళనలు మొదలయ్యాయి.

ఓటుకు ఆరు వేల రూపాయల చొప్పున పంచారాన్న ప్రచారం గుప్పుమనడంతో రాని వారు రోడ్లెక్కి ఆందోళనలు చేస్తున్నారు. మావి ఓట్లు కావా..? కేసీఆర్ పైసలు మాకొద్దా అంటూ మహిళలు ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. హుజురాబాద్ నియోజవకర్గంలోని ఐదు మండలాలు, రెండు మున్సిపాలిటీల్లోనూ ఈ చోద్యం చోటుచేసుకుంది. అయితే, గ్రామాల్లో ఆందోళనలు వ్యక్తమవుతుంటే పట్టణాల్లో వార్డు నాయకులను నిలదీస్తున్నారు. దీంతో, స్థానికంగా ఉన్న నాయకులు తామెందుకు నియోజకవర్గంలోనే ఉన్నామురా దేవుడా అని తలలు పట్టుకుంటున్న పరిస్థితి తయారైంది.

లోకల్ లీడర్లపై ఫైర్..

చాలా చోట్ల స్థానికంగా ఉన్న నాయకులనే ఓటర్లు టార్గెట్ చేస్తున్నారు. అధిష్టానం కవర్లు పంపినా కావాలనే మాకు ఇవ్వలేదంటూ మండిపడుతున్నారు. స్థానికంగా ఉన్న రాజకీయాలను దృష్టిలో పెట్టుకొనే తమకు అన్యాయం చేశారని కొందరు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.

కావాలనేనా..

అయితే హుజురాబాద్ నియోజవకర్గంలో ప్రలోభాల పర్వంలో నగదు పంపిణీలో ఓటర్ల సంఖ్యకు తగ్గట్టుగానే సీల్డ్ కవర్లు పంపిస్తే వాటిని దారి మల్లించారా.? లేక, తమ పార్టీకి ఓట్లు పడవన్న ఉద్దేశ్యంతో వారికి కవర్లు పంపలేదా అన్నది ఇప్పుడు మిస్టరీగా మారింది. ఇదే సమయంలో కొన్ని సీల్డ్ కవర్లలో నగదు తగ్గినట్టుగా కూడా స్థానికంగా ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.

రెడ్ మార్క్..

తమకు కవర్లు ఇవ్వవద్దనే ఆలోచనతోనే రెడ్ మార్క్ వేసుకున్నారని కూడా స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. డబ్బులు ఇవ్వవద్దన్న యోచనతోనే తమ ఇళ్లకు కావాలనే రెడ్ మార్క్ వేశారని కొందరు అంటుంటే స్థానిక నాయకులే ఇలా చేశారన్న అనుమానం వ్యక్తమవుతోంది.

పోలీసులకు కొత్త చిక్కులు..

మే మొదటి వారం నుండి ఏకధాటిగా సాగిన ప్రచార పర్వంలో బందోబస్తు చేసి తలమునకలైన పోలీసులు ఇప్పుడు ఎన్నికల కమిషన్ చేస్తున్న ఏర్పాట్ల వద్ద గస్తీ చేయాల్సి ఉంటుందని అనుకున్నారు. మూడు రోజుల పాటు ఎన్నికల కమిషన్ ప్రచారానికి పుల్‌స్టాప్ పెట్టడంతో ప్రశాంతంగా విధులు నిర్వర్తిస్తామనుకున్నారు. కానీ, సీల్డ్ కవర్ల పంపకాల పంచాయితీ కాస్తా రోడ్డెక్కడంతో గ్రామ గ్రామాన బందోబస్తు నిర్వహించాల్సిన పరిస్థితి తయారైంది.


Next Story