టార్గెట్ నాలుగు రోజులే.. ‘విన్’ కావాలంటే ‘వారే’ డిసైడింగ్ ఫ్యాక్టర్.!

by  |
Huzurabad
X

దిశ, తెలంగాణ బ్యూరో : హుజూరాబాద్ ఉప ఎన్నిక పోలింగ్​తేదీ సమీపిస్తున్నా.. గెలుపెవరిది.? అనేది అంతుచిక్కడం లేదు. మరో నాలుగు రోజుల్లో బహిరంగ ప్రచారానికి తెర పడనుంది. నువ్వా.. నేనా అన్న రీతిలో టీఆర్ఎస్, బీజేపీ మధ్య హోరాహోరీ ప్రచారం సాగుతున్నది. ఎవరు గెలుస్తారనే అంశంపై పలు సంస్థలు సర్వేలు చేస్తున్నా.. రోజు రోజుకూ పరిస్థితులు మారిపోతున్నాయి. ఒక రిపోర్టుకు, మరో నివేదికకు పొంతన కుదరడం లేదు.

ఒక రిపోర్టులో బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ గెలుస్తాడంటే.. మరుసటి నివేదికల్లో టీఆర్ఎస్‌కే గెలుపు అవకాశాలు ఎక్కువని వస్తున్నది. ఓటరు నాడిని పసిగట్టే రాజకీయ విశ్లేషకులనూ తికమకపెడుతున్నది. ఈ సెగ్మెంట్‌లో మహిళా ఓటర్లే అధికంగా ఉన్నారు. వారు ఎటువైపు నిలిచారు..? ఏ పార్టీకి మద్దతు ఇస్తున్నారు..? అన్నది స్పష్టత రావడం లేదు. సర్వే సంస్థల ప్రతినిధులు అడిగినా సమాధానం చెప్పడం లేదు. ఒక పార్టీ పేరు చెబితే.. ప్రత్యర్థి పార్టీతో ఇబ్బందులు తలెత్తుతాయేమోనన్న భయం వారిని వెంటాడుతుండటంతోనే వారు నోరు మెదపడం లేదని తెలుస్తున్నది.

నాలుగు రోజులే కీలకం..

సరిగ్గా మరో నాలుగు రోజుల్లో ప్రతిష్టాత్మక హుజూరాబాద్ అసెంబ్లీ ఉప ఎన్నిక ప్రచార పర్వం ముగియనుంది. ఏడు రోజుల్లో అంటే ఈ నెల 30న పోలింగ్ జరుగనుంది. ఉప ఎన్నికలో అన్ని పార్టీలు ప్రలోభాలకు గురి చేయడం సాధారణమే అయినా.. వ్యక్తిగత ప్రతిష్టకు సవాలుగా మారిన హుజూరాబాద్‌లో అభ్యర్థులు గెలుపు కోసం కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తున్నారు. మహిళా ఓటర్లను ఆకట్టుకునేందుకు బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ తన సతీమణి జమునను ముందు వరుసలో నిలిపి ప్రచారం చేయిస్తున్నారు.

మంత్రి హరీష్​రావు సైతం నిత్యం మహిళలను వెంటబెట్టుకుని క్యాంపేయిన్​ నిర్వహిస్తున్నారు. నోటిఫికేషన్‌కు ముందే ఇక్కడ మహిళా సంఘాలకు వడ్డీ రాయితీ ఇవ్వడం, రాష్ట్రంలో ఎక్కడా ఇవ్వకపోవడం తెలిసిందే. ఒకే విడుతలో 160కిపైగా మహిళా సంఘాల భవనాలకు నిధులిచ్చిన రికార్డ్ కూడా ఇదే. హుజూరాబాద్‌లో మహిళా ఓటర్లే నిర్ణయాత్మక శక్తులు కావడంతో అన్ని పార్టీలూ వారిని ప్రసన్నం చేసుకునే ప్రయత్నం చేస్తున్నాయి.

హుజూరాబాద్ అసెంబ్లీ నియోజకవర్గంలో మొత్తం 2.36 లక్షల మంది ఓటర్లున్నారు. కొత్త ఓటర్లుగా నమోదు చేసుకున్న వారు 20 వేల మంది వరకు ఉన్నారు. మొత్తం ఓటర్లలో పురుషులు 1,17,779 (1.17లక్షలు), మహిళా ఓటర్లు 1,19,093 (1.9లక్షల) మంది ఉన్నారు. పురుషుల కన్నా ఎక్కువగా ఉన్న మహిళా ఓటర్లే ఇక్కడ డిసైడింగ్ ఫ్యాక్టర్‌గా ఉన్నారు. గడిచిన నాలుగు అసెంబ్లీ ఎన్నికల్లోనూ మహిళా ఓటర్లే నిర్ణయాత్మకశక్తిగా నిలిచారు.

ష్..! అంతా గప్ చుప్​..

హుజూరాబాద్‌లో సర్వే సంస్థలన్నీ మకాం వేశాయి. ప్రభుత్వ నిఘా వర్గాలతోపాటుగా ప్రైవేట్ సంస్థలూ సర్వే చేస్తున్నాయి. కానీ ఇక్కడ మహిళల నుంచి మాత్రం సరైన రిప్లై రావడం లేదు. ఎవరికి ఓటేస్తామనే అంశం ఎక్కడా చెప్పడం లేదు. తమకు నచ్చిన వారికి వేస్తామంటూనే విషయాన్ని దాటవేస్తున్నారు. సర్వేల ప్రకారం ఎవరికి ఓటేస్తామని చెప్పిన వారిలో మహిళలు 6% మాత్రమే ఉండటం గమనార్హం. ప్రస్తుతం సర్వే నివేదికలు అయోమయానికి గురి చేస్తున్నాయి. ఒక రోజు బీజేపీ గెలుస్తుందని.. మరో రోజు వెంటనే పరిణామాలు మారిపోతున్నాయి. బీజేపీ గెలుస్తుందని చెప్పేలోపే టీఆర్ఎస్‌కు చాన్స్ అని, ఆ వెంటనే మళ్లీ బీజేపీ అంటూ నివేదికల్లో మార్పులు చేసుకుంటున్నారు. దీంతో చాలా మంది ఓటర్లు ఎవరి వైపు మొగ్గు చూపుతున్నారో అర్థం కాని పరిస్థితి నెలకొంది.


Next Story

Most Viewed