అన్నం పెట్టిన ఇంటికే సున్నం పెట్టిన కి‘లేడి’..

by  |
అన్నం పెట్టిన ఇంటికే సున్నం పెట్టిన కి‘లేడి’..
X

దిశ, ములుగు: మాయమాటలతో ఓ మహిళను మచ్చిక చేసుకుని ఆమె ఇంట్లోనే భోజనం చేసి అనంతరం వారిని బెదిరించి బంగారం, వెండిని దోచుకెళ్లిన ఘటన సిద్దిపేట జిల్లా ములుగు మండలం కొక్కొండ గ్రామంలో శుక్రవారం చోటు చేసుకుంది. దోపిడికి సంబంధించి ములుగు ఎస్సై రంగ కృష్ణ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. కొక్కొండ గ్రామానికి చెందిన కుర్మా ఎల్లమ్మ కూరగాయలు అమ్ముకుంటూ జీవనం సాగిస్తోంది. ఈ క్రమంలోనే శుక్రవారం ఉదయం కొక్కొండ గ్రామంలోని కూరగాయల మార్కెట్‌లో కూరగాయలు తీసికొని బస్సు కోసం బస్టాప్ వద్ద నిలబడింది. అయితే, మేడ్చల్ జిల్లా గాజులరామారం మార్కండేయ నగర్‌లో నివాసం ఉంటున్న కైరం కొండ సంతోషి అలియాస్ లక్ష్మి అనే మహిళ ఎల్లమ్మతో పరిచయం ఏర్పరచుకొని వారింటికి వెళ్ళింది.

నిన్న రాత్రి ఎల్లమ్మ ఇంట్లోనే ఉండి భోజనం చేసి ఎల్లమ్మ, కూతురు మల్లమ్మకు మాయమాటలు చెప్పి మైమరపించింది. అనంతరం రాత్రి 7 గంటల సమయంలో ఇంట్లో ఉన్న కొడవలితో తల్లీకూతుళ్లను బెదిరించి వారి ఒంటిపైన ఉన్న బంగారాన్ని వెండిని దొంగిలించింది. సమాచారం అందుకున్న ములుగు ఎస్సై రంగకృష్ణ కేసు నమోదు చేసుకుని సంతోషిని పట్టుకోవడానికి తన సిబ్బందితో కలిసి రంగంలోకి దిగారు. గాజులరామారం మార్కండేయ నగర్‌లో నివాసముంటున్న లక్ష్మీ ఇంటికి చేరుకొని దోపిడీ జరిగిన 12 గంటలలోపు అదుపులోకి తీసుకున్నారు. దొంగిలించిన బంగారం వెండి వస్తువులను స్వాధీనం చేసుకుని బాధితురాలు కుర్మా ఎల్లమ్మకు వస్తువులను అప్పగించారు. అనంతరం నిందితురాలిని జ్యుడీషియల్ రిమాండ్‌కు తరలించినట్లు ఎస్‌ఐ రంగ కృష్ణ తెలిపారు.


Next Story

Most Viewed