‘నెలసరి సమయంలో మహిళపై వెలి వద్దు’

by  |
periods
X

అహ్మదాబాద్ : నెలసరిలో ఉన్న మహిళపై వెలి చాలా సాధారణంగా అమలవుతూ ఉంటుంది. వంటింటిలోకి, దేవాలయాల్లోకి అనుమతించరు. క్రతువుల్లోనూ పాల్గొననివ్వరు. దీనికి సమాధానం ‘మైల’గా మనకు వినిపిస్తుంది. రుతుస్రావంలో ఉన్న మహిళ అపరిశుద్ధరాలు అని, ఆమె చుట్టుపక్కలా ఆ అపవిత్ర వ్యాపిస్తుందని ఇప్పటికీ చాలా మంది అపోహపడుతుంటారు. పీరియడ్స్‌ చుట్టూ అలుముకున్న మూఢనమ్మకాలు, అశాస్త్రీయ భావాలకు వ్యతిరేకంగా ప్రపంచవ్యాప్తంగా అనేక ఉద్యమాలు వచ్చాయి కూడా. తాజాగా అదే దారిలో గుజరాత్ హైకోర్టు ఓ ప్రతిపాదన చేసింది. ఒక మహిళ నెలసరి సమయంలో ఉన్నదానిని బట్టి బహిరంగప్రదేశాల్లోకి, ఆధ్యాత్మిక ప్రాంతాల్లోకి అనుమతించాలా? వద్దా? అనే నిర్ణయాలు తీసుకోవద్దని, పీరియడ్స్ ఆధారంగా సదరు మహిళపై వెలివేయడాన్ని నిషేధించాలని ప్రతిపాదించింది. మనదేశంలో ఇలాంటి వ్యవహారాలపై బహిరంగ మాట్లాడటానికి చాలా మంది అభ్యంతరం చెబుతారు. ఈ నేపథ్యంలోనే తమ ప్రతిపాదనను ఏకపక్షమని భావించవద్దని, దీనిపై అందరూ చర్చించాలనే భావిస్తున్నామని జస్టిస్ జేబీ పర్దివాలా, జస్టిస్ ఐలేశ్ వోరాల డివిజన్ బెంచ్ తెలిపింది. తాము సున్నితమైన అంశాన్ని ముందుకు తెస్తున్నామని తెలుసని, అందుకే దీనిపై అన్నివర్గాలు చర్చించడానికి ఆస్కారమిస్తున్నామని వివరించింది.

గుజరాత్‌లోని భుజ్ పట్టణంలో ఓ ఉదంతం వెలుగులోకి వచ్చిన తర్వాత సామాజిక కార్యకర్త నిర్జరి సిన్హా దాఖలు చేసిన వ్యాజ్యాన్ని ఈ డివిజన్ బెంచ్ విచారిస్తున్నది. భుజ్‌లో శ్రీ సహజానంద్ గర్ల్స్ ఇన్‌స్టిట్యూట్ నడుపుతున్న ఓ హాస్టల్‌లో గతేడాది ఫిబ్రవరిలో విస్మయకర ఘటన జరిగింది. మతపరమైన నిబంధనలు ఉల్లంఘించి నెలసరిలో ఉన్న ఓ యువతి వంటింటిలోకి వెళ్లిందన్న ఫిర్యాదు హాస్టల్ ఇన్‌చార్జీకి చేరింది. దీంతో ఆ హాస్టల్లో ఉన్న 68 మంది డిగ్రీ చదువుతున్న యువతులను వారు నెలసరిలో లేరని నిరూపించుకోవాల్సిందిగా ఆజ్ఞాపించారు. వారంతా వరుసగా బట్టలు విప్పి తాము రుతుస్రావంలో లేమని నిరూపించుకోవాల్సి వచ్చింది. ఈ ఘటన అప్పుడు రాష్ట్రవ్యాప్తంగా కలకలం సృష్టించింది. ఈ ఘటన తర్వాతే గుజరాత్‌లో నిర్జరి సిన్హా పిటిషన్ వేశారు.

కోర్టులో నిర్జరి సిన్హా తరఫు న్యాయవాది మేఘా జానీ వాదిస్తూ, మహిళల పునరుత్పత్తి వ్యవస్థలో నెలసరి చాలా సహజంగా జరిగే చర్య అని, ప్రతి మహిళలో ఇది జరుగుతుందని అన్నారు. అయినా, దీని చుట్టూ అభూత కల్పనలు వేళ్లూనుకున్నాయని, నెలసరి సమయంలో సదరు మహిళలను చాలా చోట్లకు అనుమతించకుండా వెలివేస్తుంటారని తెలిపారు. రోజువారీ పనుల నుంచీ దూరంగా ఉంచుతారని, కనీసం నీరుతాగే గ్లాసునూ, వంటపాత్రనూ ముట్టుకోనివ్వరని వివరించారు. ఆ కాలమంతా గడపడానికి వారికి నిర్దేశించిన ఒక ప్రాంతానికే మహిళలను బంధీగా ఉంచుతారని అన్నారు. ఈ వాదనలు విన్న గుజరాత్ హైకోర్టు డివిజన్ బెంచ్ పై ప్రతిపాదన చేస్తూ విచారణను 30వ తేదీకి వాయిదా వేసింది.

Next Story

Most Viewed