మహిళా ఉద్యోగికి సర్పంచ్ భర్త బెదిరింపు

by  |
మహిళా ఉద్యోగికి సర్పంచ్ భర్త బెదిరింపు
X

దిశ, నిజామాబాద్: ఉపాధి హామీ పనికి రాకున్న కూలి డబ్బులు వచ్చేలా చేయాలని ఓ జూనియర్ మహిళ పంచాయతీ కార్యదర్శిపై గ్రామ సర్పంచ్ భర్త, ఎంపీటీసీ భర్త, మాజీ కారోబార్ బెదిరింపులకు పాల్పడిన ఘటన కామారెడ్డి జిల్లాలో చోటు చేసుకుంది. తనకు రక్షణ కావాలని, బెదిరించిన వారిపై చర్యలు తీసుకోవాలని ఆ కార్యదర్శి పోలీసులకు ఫిర్యాదు చేశారు. వివరాల్లోకి వెళితే..

రామారెడ్డి మండలం మోషంపూర్ గ్రామంలో గత ఏడాది కాలంగా సౌందర్య అనే మహిళాఉద్యోగి జూనియర్ పంచాయతీ కార్యదర్శిగా పని చేస్తున్నారు. అయితే గ్రామంలో ఉపాధి హామీ పనులను గ్రామ ఫీల్డ్ అసిస్టెంట్ చూస్తున్నాడు. అయితే ఫీల్డ్ అసిస్టెంట్ కూలి డబ్బులు తక్కువ వచ్చేలా చేస్తున్నాడని అతని పై గ్రామస్థులతో వ్యతిరేకత తెచ్చారు. దాంతో గత వారం రోజులుగా ఉపాధి హామీ పనులను పంచాయతీ కార్యదర్శి చూస్తున్నారు. ఈ నెల 25వ తేదీన మద్యం సేవించిన గ్రామ సర్పంచ్ భర్త కిషన్ గౌడ్, ఎంపీటీసీ భర్త దత్తాద్రి, లింగపూర్ మాజీ కారోబార్ జగదీశ్వర్ లు గ్రామ పంచాయతీకి వచ్చి గ్రామస్థులు పని చేసినా చేయకున్నా కూలి డబ్బులు రూ.200 వచ్చేలా చూడాలని ఆమెను కోరారు. దానికి ఆమె ససేమిరా అనడంతో బెదిరించారు. పని ఎలా చేస్తావో చూస్తామని, ఒకవేళ వేరే గ్రామానికి బదిలిపై వెళ్లినా అక్కడ కూడా బెదిరింపులకు గురి చేస్తామని గొడవకు దిగారు. అంతే కాకుండా ఎంపీటీసీ భర్త ఎస్సీ కావడంతో ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కింద కేసు పెడతానని..అసభ్యకరంగా మాట్లాడారని సౌందర్య రామారెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేసింది. సర్పంచ్ భర్త, ఎంపీటీసీ భర్త, మాజీ కారోబార్ల నుంచి తనకు ప్రాణహాని ఉందని, తనకు రక్షణ లేదని, న్యాయం చేయాలని కోరుతోంది.

ఆరోపణల్లో వాస్తవం లేదు..

పంచాయతీ కార్యదర్శి చేసిన ఆరోపణలు అవాస్తవమని సర్పంచ్ భర్త కిషన్ గౌడ్ తెలిపారు. ఉపాధి హామీ కూలీలకు రూ.30 వస్తున్నాయని అదే విషయమై ఆమెకు రూ.200 వచ్చేలా చూడాలని కోరినట్లు చెప్పారు. అంతే కానీ ఆమెను బెదిరించలేదన్నారు. ఆమెకు ఇక్కడ పని చేయడం ఇష్టం లేకనే తమపై ఆరోపణలు చేస్తుందని వివరించాడు. తాము ఆమెను చంపేస్తామని బెదిరించినట్టయితే తమపై మర్డర్ కేసు పెట్టినా జైలుకు వెళ్ళడానికి కూడా సిద్ధమని తెలిపారు.

కేసును విచారిస్తున్నాం..

ఈ విషయమై పోలీసులను వివరణ కోరగా మద్యం సేవించి తన విధులకు ఆటంకం కలిగిస్తున్నారని పంచాయతీ కార్యదర్శి ఫిర్యాదు చేశారని, దీనిపై విచారణ చేస్తున్నామని ఇంచార్జ్ హౌస్ ఆఫీసర్ గణేశ్వర్ తెలిపారు.



Next Story

Most Viewed