‘పోడు’ ఫైటింగ్.. పురుగుల మందు తాగిన మహిళా రైతు

by  |
‘పోడు’ ఫైటింగ్.. పురుగుల మందు తాగిన మహిళా రైతు
X

దిశ, మణుగూరు : ఖమ్మం జిల్లా అశ్వాపురం మండలంలోని తుమ్మల చెరువు గ్రామ పంచాయతీలో శుక్రవారం పోడు భూముల కోసం ఫారెస్ట్, గిరిజన రైతుల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొన్నది. భూముల కోసం నినాదాలు చేస్తున్న రైతులను ఫారెస్ట్ అధికారులు అడ్డుకోవడంతో ఇరువురి మధ్య తీవ్ర వాగ్వాదంతో పాటు పెనుగులాట చోటుచేసుకుంది. గత మూడ్రోజులుగా రైతులు సాగు చేసుకుంటున్న భూముల్లో ఫారెస్ట్ అధికారులు కందకాలు తవ్వటాన్ని నిరసిస్తూ రైతులు దీక్షలు కొనసాగిస్తున్నారు. రైతు దీక్షలకు పలు రాజకీయ పార్టీలు సైతం సంఘీభావం ప్రకటించాయి. కాగా, ఇవాళ ఉదయం ఫారెస్ట్ అధికారులు భారీ పోలీస్ బందోబస్తుతో జేసీబీలను తీసుకుని రైతుల పొలాల్లో కందకాలను తవ్వేందుకు ప్రయత్నించగా, రైతుల నుండి తీవ్ర ప్రతిఘటన ఎదురైంది. జేసీబీల ఎదుట రైతులు పురుగుల మందు డబ్బాలతో బైఠాయించారు.

ఫారెస్ట్ అధికారుల వైఖరితో విసుగు చెందిన గుండి లక్ష్మి అనే మహిళా రైతు పురుగుమందు తాగి ఆత్మహత్య ప్రయత్నం చేయగా, తోటి రైతులు అడ్డుకొని ఆమెను హుటాహుటిన ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. దీంతో ఒక్కసారిగా తుమ్మలచెరువు పంచాయతీలో ఉద్రిక్త వాతావరణం నెలకొన్నది. కాగా తాము ఎన్నో సంవత్సరాలుగా సాగుచేసుకుంటున్న భూముల్లో ఫారెస్ట్ అధికారులు జేబీసీలతో కందకాలు తవ్వి, తమకు తీరని అన్యాయం చేస్తున్నారని రైతులు మండిపడ్డారు. ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకొని పోడు భూముల సమస్యలను పరిష్కరించాలని రైతులు కోరారు. గిరిజన రైతులు సాగు చేసుకుంటున్న పోడు భూములకు పట్టాలు మంజూరు చేస్తామని చెప్పిన సీఎం కేసీఆర్ వెంటనే వాటిని పరిష్కరించాలని వామపక్ష నేతలు డిమాండ్ చేశారు.

Next Story