రండి.. రండి.. జొన్న రొట్టెలోయ్

by  |
రండి.. రండి.. జొన్న రొట్టెలోయ్
X

దిశ ప్రతినిధి, రంగారెడ్డి: ఇప్పుడంతా ఉరుకులు, పరుగుల జీవితం. ఈ పోటీ ప్రపంచంలో ఇంటిలో సమయం కేటాయించేది చాలా తక్కువ. ఇంట్లో కంటే బయటే ఎక్కువ సమయం గడుపుతున్నారు. ఇంటి పుడ్‌ను మానేసి బయట ఫుడ్‌ని తినడం ప్రజలు అలవాటు చేసుకున్నారు. బిజీ లైఫ్‌లో బయట ఏది పడితే అది తినేస్తున్నారు. మంచి ఆహారం తీసుకోకపోవడం వల్ల అనారోగ్యాల బారిన పడుతున్నారు.

సిటీలు, టౌన్లలో మంచి ఫుడ్ తిందామన్నా దొరకని పరిస్థితి. దీనిని గమనించిన గిరిజన మహిళలు.. జొన్న రొట్టెల విక్రయంతో ఉపాధి పొందుతున్నారు. సిటీలు, పట్టణాలు, మండల కేంద్రాల్లో జొన్నె రొట్టెలు అమ్ముతూ ఉపాధి పొందుతున్నారు. శరీరానికి శక్తిని అందించే జొన్నె రొట్టెలను తినేందుకు ప్రజలు ఆసక్తి చూపుతున్నారు. అది కూడా తక్కువ ధరలోనే లభిస్తుండటంతో.. జొన్నె రొట్టెలు తినేందుకు పోటీ పడుతున్నారు.

మన పూర్వీకులకు ముఖ్యమైన ఆహారం జొన్న రొట్టెలు. ఆ కాలంలో జొన్న రొట్టెలు తిన్న పూర్వీకులు ఎంతో ఆరోగ్యంగా ఉండేవారు. నేడు జంక్‌ఫుడ్‌కి ఆలవాటు పడుతున్న ప్రజలను ఆరోగ్య సమస్యలు చుట్టుముట్టుటున్నాయి. దీంతో ఇప్పుడు సంప్రాదాయక ఆహారం వైపు ప్రజలు మొగ్గు చూపుతున్నారు. షుగర్, బీపీ సమస్యలతో బాధపడే వారికి జొన్న రొట్టే దివ్య ఔషదంగా పని చేస్తోంది. జిల్లాలోని మండల కేంద్రాలు, నియోజకవర్గ కేంద్రాలు వ్యాపార కేంద్రాల వద్ద వెలసిన ఈ జొన్న రోట్టెల కేంద్రాలకు మంచి ఆదరణ కనిస్తోంది.

ఉదయం, సాయంత్రం వేళల్లో ప్రత్యేకంగా జొన్న రొట్టెలను తయారు చేస్తున్నారు. ఒక వ్యక్తి టిఫిన్ చేయాలంటే రూ.35 నుంచి రూ.50 వరకు, చాయ్ తాగాలంటే రూ.10 నుంచి రూ.15 వరకు ఖర్చు చేయక తప్పడం లేదు. ఉదయం మొదలు రాత్రి పడుకునే వరకు ఛాయ్, టీఫిన్ల కోసం కనీసం రూ.100 వరకు ఖర్చు చేస్తున్నారు. అందులో సుమారుగా రూ.30లు ఖర్చు చేస్తే మంచి ఆహారంతో కడుపు నింపే జొన్నరొట్టె దొరుకుతుంది.

రూ.15కే రొట్టె, కూర

రూ.15లకే రొట్టె, కూర ఇస్తుండటంతో ఎంతోమంది పేదలు జొన్న రొట్టెతోనే కడుపు నింపుకుంటున్నారు. తినేందుకు ఎక్కువమంది ఆసక్తి చూపిస్తుండటంతో.. ఇద్దరు, ముగ్గురు మహాళలు గ్రూపులుగా ఏర్పడి రొట్టెల కొట్టును ఏర్పాటు చేసుకుంటున్నారు. వారితో పాటు పలువురు రోజువారి కూలీలుగా మహిళలను నియమించుకుని రొట్టెలను విక్రయిస్తూ ఉపాధి పొందుతున్నారు.

దివ్య ఔషదం

జొన్న రొట్టెలు దివ్య ఔషదం లాంటివి. రొట్టెల తయారీలో చుక్క నూనె కలపకుండా జొన్న రొట్టెను తయారు చేస్తారు. కేవలం వేడి నీళ్లతోనే రోట్టె తయారు అవుతుంది. ఈ విధంగా చేసే రొట్టె ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని వైద్యులు చెబుతున్నారు. దీంతో చాలా మంది జొన్న రొట్టెలు తినేందుకు ఇష్టపడుతున్నారు.

ఇక జొన్న రొట్టేలు తయారు చేయడానికి ఎంతో నైపుణ్యం కావాలి. జొన్న పిండిని వేడి నీటిని కలిపి ముద్దగా చేసుకొని దాన్ని చేతిలో గుండ్రంగా తయారు చేసే నైపుణ్యం సాధించాలి. చేతిలో వేసుకొని గుండ్రంగా తిప్పి వెడలప్పుగా రొట్టేను తయారు చేయాలి. ఇప్పుడు జొన్న రొట్టేలు తయారు చేయడం మహిళలు, యువకులకు రాదనే చెప్పాలి.

అదుపులో షుగర్

షుగర్ వ్యాధితో బాధపడే వారికి జొన్న రొట్టెలు వరం లాంటిది. రక్త హీనత, షుగర్ లెవల్స్‌ను తగ్గిస్తాయి. ఇందులో ఉండే పొటాషియం, మెగ్నిషియం, మినరల్స్ రక్తపోటును అందుపులో ఉంచుతుంది. ఇందులో సమృద్దిగా ఉండే ఐరన్ రక్తహీనత సమస్యను దూరం చేస్తుంది. ఎర్ర రక్తకణాల వృద్ధికి తోడ్పడుతుంది. రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. తరుచుగా జొన్న రొట్టెలు తీసుకోవడం వల్ల మూత్రాశయంలో రాళ్లు ఏర్పడవు. జొన్నల ఆహారం తీసుకోవడం వల్ల రొమ్ము క్యాన్సర్ అదుపులో ఉంటుందని వైద్యులు సూచిస్తున్నారు.

రొట్టె తయారీకి యంత్రాలు

ఇప్పటి వరకు జొన్న రొట్టెల తయారీని ఇద్దరు లేక ముగ్గురు మహిళలు పీటపై చేసి, పెన్నంపై కాల్చేవారు. దీని వల్ల గిరాకీ ఎక్కువ ఉన్న సందర్భాల్లో గంటకు కనీసం 1‌‌‌‌‌‌‌‌00 నుంచి 150 వరకు రొట్టెలను చేయాల్సి ఉంటుంది. అయితే చేతితో ముద్ద చేసి పీటపై కొడుతూ చేయడం వల్ల గంటకు 50 కూడా చేయడం లేదు. దీని వల్ల ఆలస్యం అవుతుండటంతో వచ్చిన గిరాకీ పోతోంది. దీన్ని దృష్టిలో పెట్టుకొని నిమిషానికి 2–3 వరకు చేసే యంత్రాలు వచ్చాయి. ఈ యంత్రాలతో గంటకు 100–150 రొట్టెలను చేయవచ్చు.


Next Story

Most Viewed