కస్టడీలో మహిళ అనుమానాస్పద మృతి.. ఇది పోలీసుల పనేనా..?

by  |
addagudur
X

దిశ, మోత్కూరు : పోలీసు కస్టడీలో ఉన్న మహిళ అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన ఘటన అడ్డగూడూరు పోలీస్ స్టేషన్‌లో శుక్రవారం వెలుగు చూసింది. వివరాల్లోకి వెళితే.. ఖమ్మం జిల్లా మధిర మండలం కోమటి గూడంనకు చెందిన మరియమ్మ( 45 ) మండల పరిధిలోని గోవింద పురం గ్రామంలోని కానుక మాత పాఠశాలలో వంట మనిషిగా పనిలో చేరింది. ఆమెతో పాటు ఆమె కుమారుడు ఉదయ్( 28 )గత రెండు నెలలుగా ఇక్కడే ఉంటున్నట్లు సమాచారం. ఈ తరుణంలోనే 4 రోజుల కిందట ఫాదర్ బాలస్వామి నివాసంలో రెండు లక్షలు పోయాయని పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు నమోదైంది. ఈ మేరకు అనుమానితులైన శంకర్, ఉదయ్ అనే వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆ తర్వాత మరియమ్మను పీఎస్‌కు తీసుకు వచ్చే క్రమంలో వాస్తవాలు చెప్పకుంటే తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటావని పోలీసు సిబ్బంది మనోవేదనకు గురిచేయగా పోలీస్ స్టేషన్ ఆవరణలోనే కుప్పకూలిపోయినట్లు తెలుస్తోంది. కుప్పకూలిన మరియమ్మను స్థానిక ప్రైవేటు ఆస్పత్రికి తీసుకెళ్లగా ఆమె పరిస్థితి ఆందోళనకరంగా ఉందని చెప్పడంతో భువనగిరి కి తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందిందని పోలీసులు చెబుతున్నారు.

అయితే, గ్రామస్తుల కథనం సీన్ వేరేలా ఉంది. పోలీస్ స్టేషన్ ఆవరణలో ఆమెను తీవ్రంగా కొట్టడంతో కుప్పకూలిపోయిందని అనుకుంటున్నారు. సరిగ్గా ఇప్పుడే ఎస్సై అందుబాటులో లేకపోవడం మరిన్ని అనుమానాలకు తావిస్తోంది. సాయంత్రం మఫ్టీలో ఉన్న పోలీసులతో పాటు మోత్కూర్ ఎస్ఐ పోలీస్ స్టేషన్‌కు వచ్చిన విషయాన్ని గమనించిన మీడియా ప్రతినిధులు స్టేషన్ వద్దకు వెళ్లగా తనకేమీ తెలియదని వాహనంలో ఎస్‌ఐ వెళ్లిపోయినట్లు సమాచారం. ఇదిలాఉండగా, కస్టడీలో మహిళ మరణించిన విషయం బయటకి పొక్కకుండా ప్రవర్తిస్తున్న పోలీసుల చర్యలు వాస్తవాలను పక్కకు పెట్టి కేసును తప్పుదోవ పట్టించే విధంగా ఉన్నాయని ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి.


Next Story

Most Viewed