కాల్ మాట్లాడుతుండగా..సెల్ లాక్కెల్లిన దుండగులు

by  |

దిశ, క్రైమ్ బ్యూరో :
కరోనా నేపథ్యంలో ప్రజలందరూ భయభ్రాంతులకు గురవుతుంటే..అదే అదునుగా దొంగలు తమ చేతివాటం ప్రదర్శిస్తున్నారు. వైరస్ బారిన పడకుండా ఉండేందుకు ప్రతిఒక్కరూ ఫేస్ మాస్కులు ధరించాలని ప్రభుత్వం స్పష్టం చేయగా, ఉల్లంఘించిన వారికి జరిమానాలు విధిస్తామని హెచ్చరిచ్చింది.దీంతో బయట అందరూ ముఖం కనిపించకుండా మాస్కులు,చేతి రుమాలు కట్టుకుని తిరుగుతున్నారు.ఈ క్రమంలోనే ఆదివారం అబిడ్స్ ప్రధాన రహదారిపై ఓ మహిళా తన సెల్ ఫోన్లో ముచ్చటిస్తుండగా గుర్తు తెలియని వ్యక్తులు బైక్ పై వేగంగా వచ్చి మొబైల్ లాక్కుని వెళ్లిపోయారు. ఆమె తేరుకునేలోపే రోడ్డు పక్క సందులోంచి దుండగులు పరారయ్యారు. ఈ విషయంపై బాధితురాలు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా, పోలీసులు సీసీటీవీ ఫుటేజీలను పరిశీలించారు. సెల్‌ఫోన్ లాక్కెళుతున్న దృశ్యం స్పష్టంగా కన్పిస్తున్నా..ముఖానికి మాస్కులు ధరించడం, ఆ బైక్‌కు నంబర్ ప్లేట్ లేనందున పోలీసులు అయోమయంలో పడిపోయారు. లాక్ డౌన్ వలన ఇన్నాళ్ళు షాపింగ్‌లకు, ఇతర కార్యకలాపాలకు దూరంగా ఉన్న ప్రజలు కేంద్ర, రాష్ట్రప్రభుత్వాలు ఇచ్చిన సడలింపులతో ఇప్పుడిప్పుడే రహదారులపైకి వస్తున్నారు. బయటకు వెళ్లేవారు తప్పనిసరి మాస్కు నిబంధన ఉండటంతో..ఇది దొంగలకు వరంలా మారిందని చెప్పుకోవచ్చు.ఈ మేరకు నెంబర్ ప్లేట్లు సరిగాలేని, అసలు నంబర్ ప్లేట్లు లేని వాహనాలను తనిఖీ చేసేందుకు ప్రత్యేక డ్రైవ్ చేపట్టాలని నగర సీపీ అంజనీకుమార్ పోలీసులను ఆదేశించారు.

Next Story

Most Viewed