రోడ్డు దాటుతుండగా ఘోర ప్రమాదం.. సీసీటీవీలో భయానక దృశ్యాలు!

by Ramesh Naini |

నగరంలోని కూకట్‌పల్లిలో సోమవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది.

రోడ్డు దాటుతుండగా ఘోర ప్రమాదం.. సీసీటీవీలో భయానక దృశ్యాలు!
X

దిశ, డైనమిక్ బ్యూరో: నగరంలోని కూకట్‌పల్లిలో సోమవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. కేపీహెచ్‌బీ పోలీస్ స్టేషన్ పరిధిలోని హైదర్‌నగర్ వద్ద రోడ్డు దాటుతున్న ఓ వృద్ధుడిని అతివేగంగా వచ్చిన ఆటో ఢీకొట్టడంతో ఆయన అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఈ ప్రమాదానికి సంబంధించిన భయానక దృశ్యాలు సమీపంలోని సీసీటీవీ కెమెరాల్లో రికార్డయ్యాయి. పోలీసుల వివరాల ప్రకారం.. మృతుడు నర్సింహ (60) జహీరాబాద్‌లోని శిశుమందిర్ పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పనిచేసి పదవీ విరమణ పొందారు. సోమవారం ఉదయం ఆయన జహీరాబాద్‌కు వెళ్లేందుకు రోడ్డు దాటుతుండగా.. వేగంగా దూసుకొచ్చిన ఆటో ఢీకొట్టింది. ఆపై అదుపుతప్పిన ఆటో ఆయనపైనే పడిపోవడంతో నర్సింహ ఘటనాస్థలంలోనే దుర్మరణం పాలయ్యారు.

సమాచారం అందుకున్న కేపీహెచ్‌బీ పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని, మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఆటో డ్రైవర్ నిర్లక్ష్యమే ఈ ప్రమాదానికి కారణమని ప్రాథమికంగా నిర్ధారించారు. వాహనదారులు వేగ నియంత్రణ పాటించాలని, పాదచారులు రోడ్డు దాటేటప్పుడు అప్రమత్తంగా ఉండాలని ఈ సందర్భంగా పోలీసులు సూచించారు.

Next Story