కూతురిని చూసేందుకు వెళ్లి శవమైన తల్లి.. ఎక్కడంటే..?

by  |
కూతురిని చూసేందుకు వెళ్లి శవమైన తల్లి.. ఎక్కడంటే..?
X

దిశ, జడ్చర్ల : తలపై బండరాయితో మోదీ గుర్తుతెలియని దుండగులు ఓ మహిళను దారుణంగా హత్యచేశారు. ఈ ఘటన శనివారం మిడ్జిల్ మండలంలో వెలుగుచూసింది. సీఐ జములప్ప, ఎస్ఐ జయప్రసాద్ కథనం ప్రకారం.. మిడ్జిల్ మండల పరిధిలోని మల్లాపూర్ గ్రామానికి చెందిన పశుల లక్ష్మీదేవి (40) శుక్రవారం తన ఇంటి నుండి జడ్చర్లకు వెళ్లింది. అక్కడే హాస్టల్లో ఉంటూ డిగ్రీ మొదటి సంవత్సరం చదువుతున్న తన పెద్ద కూతురిని కలిసిన అనంతరం తన సొంత గ్రామమైన మల్లాపూర్ బయలుదేరి బోయిన్ పల్లి గ్రామం వద్ద దిగింది. అక్కడి నుండి గుర్తుతెలియని వ్యక్తులు లక్ష్మీదేవిని కారులో ఎక్కించుకొని తీసుకెళ్లారు. చీకటి పడినా లక్ష్మీదేవి ఇంటికి రాకపోగా, కాల్ చేస్తే ఫొన్ స్విచాఫ్ రావడంతో కుటుంబ సభ్యులు ఆందోళన చెందారు. బంధువులు తెలిసిన వారి వద్ద లక్ష్మీదేవి కోసం ఆరా తీయగా ఆచూకీ లభ్యం కాలేదు. ఈరోజు మధ్యాహ్నం మిడ్జిల్ మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్లో మిస్సింగ్ కేసు నమోదు చేయగా.. ఈ క్రమంలోనే బోయిన్పల్లి గ్రామ శివారులోని అడవిలో సీతాఫలం కోసం రైతు తాండ్ర రవీంద్రరెడ్డి వెళ్లాడు.

అక్కడే బండరాయితో మోది మహిళను దారుణంగా హత్య చేసినట్టు గుర్తించిన రైతు ఈ విషయాన్ని పోలీసులకు తెలిపాడు. వెంటనే రూరల్ సీఐ జమ్మల అప్ప, ఎస్సై జయప్రసాద్ సిబ్బందితో కలిసి ఘటనా స్థలికి చేరుకున్నారు. మృతదేహాన్ని పరిశీలించిన హత్య జరిగిన తీరును అంచనా వేశారు. జిల్లా కేంద్రం నుండి క్లూస్ టీంను రప్పించి పోలీసు జాగిలాలతో ఆధారాల కోసం వెతికారు. ఇదిలాఉండగా మృతురాలు లక్ష్మీదేవికి సోమవారం, శుక్రవారం దేవుడు ఒంటి పైకి వచ్చే వాడని, అలా వచ్చినప్పుడు సోది చెప్పేదని.. కొందరు తమ ఇండ్లకు తీసుకెళ్లి పూజలు కూడా చేయించుకునేవారని కుటుంబ సభ్యులు తెలిపారు. లక్ష్మీదేవి తన కూతురిని చూడటానికి వెళ్లి హత్యకు గురికావడంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. మృతురాలికి భర్త శంకరయ్య గౌడ్, ఇద్దరు కూతుర్లు, కుమారుడు ఉన్నాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకొని విచారణ చేపడుతున్నామని, మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం జడ్చర్ల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్టు పోలీసులు తెలిపారు.

Next Story

Most Viewed