పాము కాటుకు మహిళ మృతి.. చికిత్స చేయలేదన్న కుటుంబీకులు

by  |
పాము కాటుకు మహిళ మృతి.. చికిత్స చేయలేదన్న కుటుంబీకులు
X

దిశ, జడ్చర్ల: పాము కాటుకు గురై మహిళ మృతి చెందిన సంఘటన మంగళవారం మిడ్జిల్ మండలంలో వెలుగుచూసింది. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని బోయిన్‎పల్లి గ్రామానికి చెందిన కేశవ పార్వతమ్మ (40) తన వ్యవసాయ పొలంలో పని చేసుకుంటుండగా సాయంత్రం 4 గంటల ప్రాంతంలో పాము కాటేసింది. ఆ తర్వాత పార్వతమ్మ నడుచుకుంటూ ఇంటికి వెళ్లి పాముకాటుకు గురైన విషయం తమ కుటుంబ సభ్యులకు తెలిపింది. దీంతో వెంటనే కుటుంబ సభ్యులు అప్రమత్తమై 108 అంబులెన్స్‌కు సమాచారం అందించగా అంబులెన్స్ అందుబాటులో లేదు. మహబూబ్‌నగర్‌లో ఉన్నామని.. రావడానికి ఆలస్యం అవుతుంది అని సమాధానం చెప్పడంతో ప్రయివేట్ వాహనంలో కల్వకుర్తి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ రాత్రి 8 గంటల ప్రాంతంలో పార్వతమ్మ మృతి చెందినట్లు వారు తెలిపారు. ఇదిలా ఉండగా 108 అంబులెన్స్ రాకపోవడం, ఆస్పత్రికి తరలించడంలో ఆలస్యం జరిగిందని, దీనికితోడు పార్వతమ్మకు ఆసుపత్రిలో సరైన చికిత్స అందించకపోవడంతోనే మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.

Next Story

Most Viewed