రుణం ఇవ్వలేదని మహిళ ఆత్మహత్యాయత్నం

by  |
రుణం ఇవ్వలేదని మహిళ ఆత్మహత్యాయత్నం
X

దిశ, కామారెడ్డి: డ్వాక్రా గ్రూపులో రుణం ఇవ్వలేదని ఓ మహిళ పురుగుల మందుతాగి ఆత్మహత్యాయత్నం చేసింది. ఈ ఘటన కామారెడ్డి జిల్లా రాజంపేట మండలం కొండాపూర్ గ్రామంలో చోటు చేసుకుంది. మూడు రోజుల క్రితం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ప్రస్తుతం ఆ మహిళ… జిల్లా ఆస్పత్రిలోని ఐసీయూ వార్డులో చికిత్స పొందుతోంది. బాధితురాలి కుటుంబ సభ్యుల కథనం ప్రకారం… కొండాపూర్ గ్రామానికి చెందిన కీసరి వెంకవ్వ ఓ డ్వాక్రా గ్రూపులో సభ్యురాలిగా ఉంది. 2016 లో తన పెద్ద కూతురు రేణుక పెండ్లి కోసం గ్రామ సంఘం ద్వారా 25 వేలు, స్త్రీ నిధి ద్వారా 15 వేలు అప్పు తీసుకుంది.

అయితే ఈ అప్పు ఇటీవలే చెల్లించింది. చివరగా మిగిలిన 10 వేల రూపాయలు తెలిసిన వాళ్ల వద్ద అప్పు చేసి చెల్లించింది. సంఘానికి మళ్ళీ రుణం రాగానే తీసుకుని ఆ పదివేలు కట్టవచ్చని భావించింది. అయితే సంఘ సభ్యులు ఇటీవల బ్యాంకు నుంచి 3 లక్షలు తీసుకుని వెంకవ్వకు ఇవ్వకుండా మిగతా సభ్యులు పంచుకున్నారు. ఇదేంటని అడిగితే నీకు ఇవ్వలేమని చెప్పారు. ఈ క్రమంలో పదివేలు అప్పు ఇచ్చిన వాళ్లు ఇంటి చుట్టు తిరుగుతుండటంతో మనస్థాపానికి గురైంది. దీంతో గడ్డి మందు తాగి ఆత్మహత్యాయత్నం చేసింది.

కాగా గతంలో డబ్బులు చెల్లించకపోతే ఇంటికి వచ్చి తాళం వేశారని బాధితురాలి కూతురు రేణుక తెలిపింది. కరోనా వల్ల పనులు లేక అప్పులు చెల్లించడం ఆలస్యం అయినందుకు ప్రస్తుతం రుణం ఇవ్వలేదన్నారు. తమకు న్యాయం చేయాలని బాధిత కుటుంబ సభ్యులు కోరుతున్నారు. అయితే కీసరి వెంకవ్వ 2016‌లో తీసుకున్న అప్పు 2018 లో చెల్లించాల్సి ఉందన్నారు. కానీ 2020 డిసెంబర్‌లో చెల్లించిందని గ్రామ సీసీ బాగయ్య, వీఏవో రజితలు తెలిపారు. సకాలంలో రుణం చెల్లించకపోవడం వల్ల సంఘ సభ్యులే తలా కొన్ని జమచేసి చెల్లించారని పేర్కొన్నారు. అయితే ఇటీవల ఆరుగురు సభ్యులకు 50 వేల చొప్పున 3 లక్షల రూపాయలు మంజూరయ్యాయని చెప్పారు. వెంకవ్వ సరిగా చెల్లిస్తుందో లేదోనని రుణం ఇవ్వలేదని తెలిపారు.


Next Story

Most Viewed