రూ.కోటి కట్నం తెస్తేనే కాపురం చేస్తా !

by  |
రూ.కోటి కట్నం తెస్తేనే కాపురం చేస్తా !
X

దిశ, వెబ్‌డెస్క్: రూ.కోటి కట్నం తెస్తేనే తన భర్త కాపురానికి రావాలని అంటున్నాడని లేకుంటే విడాకులిస్తానని బెదిరిస్తున్నాడని ఓ మహిళ ఆందోళనకు దిగింది. వివరాలు ఇలా ఉన్నాయి. కడప జిల్లాకు చెందిన దీపక్‌కుమార్‌, గాయత్రికి 2018 డిసెంబర్ 27న వివాహం అయ్యింది. పెళ్లి సమయంలో దీపక్‌కుమార్‌కు రూ.20లక్షల నగదు, రూ.10లక్షల విలువైన బంగారు ఆభరణాలు ఇచ్చారు. దీపక్ కుమార్ బెంగళూరులో ఇన్ఫోసిస్‌లో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్. వీరికి ఒక పాప ఉంది. అయితే.. గాయత్రి డెలివరీ సమయంలో పుట్టినింటికి వెళ్లినప్పటి నుంచి ఇప్పటివరకు దీపక్‌కుమార్ వెళ్లి చూడలేదు. ఇదేక్రమంలో గాయత్రి నిన్న కూతురుతో కలిసి వెళ్లగా అత్తమామ ఇంట్లోకి అనుమతించక పోవడంతో ఆందోళనకు దిగింది.

నేను మా అమ్మనాన్న దగ్గరకు వెళ్లాక తన భర్త సాఫ్ట్‌వేర్ ఉద్యోగం వదిలి గంజాయి వ్యాపారం చేస్తున్నాడని, అలా చేయొద్దన్నందుకు విడాకుల నోటీసులు పంపాడని గాయత్రి వాపోయింది. కొద్దిరోజుల క్రితం పోలీసులు కౌన్సెలింగ్ ఇచ్చినా తనను మళ్లీ ఇంట్లోకి రానివ్వడం లేదని కన్నీరు పెట్టుకుంది. మాట మాట్లాడితే రూ. కోటి కట్నం కావాలని బెదిరిస్తున్నారని తెలిపింది. స్థానికుల ద్వారా విషయం తెలియగానే కూతురుతో కలిసి ఆందోళన చేస్తున్న గాయత్రిని అర్బన్‌ పోలీసులు స్టేషన్‌కు పిలిపించారు. ఆమెకు జరిగిన అన్యాయంపై డీఎస్పీ రమాకాంత్, అర్బన్‌ సీఐ కరుణాకర్‌లు విచారణ చేశారు. విడాకులకు భర్త దరఖాస్తు చేసుకున్నందున మరోసారి దంపతులకు కౌన్సెలింగ్‌ ఇచ్చి ఇద్దరినీ కలిసి ఉండేలా చూస్తామని డీఎస్పీ వెల్లడించారు.

Next Story