బ్యాంకు వినియోగదారులకు మరింత భారం కానున్న ఏటీఎమ్ లావాదేవీలు

by  |
బ్యాంకు వినియోగదారులకు మరింత భారం కానున్న ఏటీఎమ్ లావాదేవీలు
X

దిశ, వెబ్‌డెస్క్: ఏటీఏం సెంటర్లను నిర్వహించడం భారంగా మారిన కారణంగా లావాదేవీల ఛార్జీలను పెంచుకోవడానికి ఆర్‌బీఐ తాజా అనుమతిచ్చింది. నెలవారీగా ఉచితంగా అనుమతి ఉన్న దానికంటే ఎక్కువ నగదు, నగదేతర లావాదేవీలపై ఛార్జీలను పెంచుకునేందుకు బ్యాంకులకు అవకాశం లభించింది. ప్రస్తుతం బ్యాంకులన్నీ తమ ఖాతాదారుల నుంచి అదనంగా చేసే ఒక్కో లావాదేవీపై రూ. 20 ఛార్జీ చేస్తోంది. ఏటీఎమ్ సెంటర్లను ఏర్పాటు చేసేందుకు, వాటి నిర్వహణకు ఖర్చులు పెరుగుతుండటం, ఇంటర్‌ఛేంజ్ ఫీజులు పరిగిన కారణంగా సాధారణ వ్యయం కోసం ఛార్జీలను పెంచుకోవచ్చని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్‌బీఐ) ఇటీవెల వెల్లడించింది. ఇటీవల డిజిటల్, నెట్ బ్యాంకింగ్ లావాదేవీలు పెరుగుతున్నాయి. ఈ క్రమంలో ఏటీఎమ్ సెంటర్లలో డిపాజిట్ సహా విత్‌డ్రా మెషీన్లను బ్యాంకులు ఏర్పాటు చేస్తున్నాయి.

అయితే, ప్రజలు ఎక్కువగా డిపాజిట్ మెషీన్లను వినియోగిస్తున్నారు కానీ విత్‌డ్రా చేయడంలేదు. డిజిటల్ విధానంలో చెల్లింపులను, లావాదేవీలను చేస్తున్నారు. దీనివల్ల బ్యాంకులకు అదనపు వ్యయాలు పెరుగుతున్నాయని బ్యాంకు వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా ఆర్‌బీఐ ప్రకారం.. 2022, జనవరి 1వ తేదీ నుంచి నెలవారీ ఉచితంగా చేసే లావాదేవీలు కాకుండా అదనంగా చేసే ఒక్కోదానిపై రూ. 21 చెల్లించాల్సి ఉంటుంది. సొంత బ్యాంకు ఏటీఎమ్ నుంచి నెలలో ఆర్థిక, ఆర్థికేతరమైనవి కలిపి 5 ఉచిత లావాదేవీలు ఖాతాదారులకు ఉంటుంది. మెట్రో నగరాల్లో ఇతర బ్యాంకుల ఏటీఎమ్ నుంచి 3, మిగిలిన ప్రాంతాల్లో 5 ఉచిత లావాదేవీలకు అనుమతి ఉంటుంది. కాగా, ఇప్పటికే ఆగష్టు 1 నుంచి అన్ని ఏటీఎమ్ సెంటర్లలో ఒక్కో ఆర్థిక లావాదేవీపై ఇంటర్‌ఛేంజ్ ఫీజ్ రూ. 15-17, ఆర్థికేతర లావాదీవీలకు రూ. 5-6 పెంచేందుకు బ్యాంకులకు ఆర్‌బీఐ అనుమతి ఇచ్చింది.

Next Story

Most Viewed