సెటిల్మెంట్ చేయండి.. అనుమతులు ఇస్తాం

by  |
సెటిల్మెంట్ చేయండి.. అనుమతులు ఇస్తాం
X

దిశ, తెలంగాణ బ్యూరో : అధిక ఫీజులు వసూలు చేసిన ఆస్పత్రులకు కరోనా ట్రీట్‌మెంట్ అనుమతులను రద్దు చేసిన ప్రజారోగ్య శాఖ దశలవారీగా ఉపసంహరణ చర్యలను చేపట్టింది. మళ్ళీ యథావిధిగా కరోనా ట్రీట్‌మెంట్ ఇచ్చేందుకు పేషెంట్లను చేర్చుకోడానికి మార్గం సుగమం చేసింది. అధిక ఫీజులు వసూలు చేస్తున్నారంటూ బాధితుల నుంచి ఫిర్యాదులు తీసుకున్న ఆస్పత్రులకు నోటీసులు జారీ చేసి 32 ఆస్పత్రులకు కరోనా ట్రీట్‌మెంట్ అనుమతిని రద్దు చేసింది. బాధితులకు సెటిల్మెంట్లు చేయడానికి రెండు వారాల గడువు ఇచ్చి వెంటనే ట్రీట్‌మెంట్‌ను తిరిగి మొదలు పెట్టుకోవచ్చునంటూ వెసులుబాటు కల్పించింది. ఫిర్యాదు చేసిన బాధితులకు మాత్రమే ఆస్పత్రులు సెటిల్మెంట్ చేయనున్నాయి.

ప్రజారోగ్య శాఖకు దాదాపు రెండు వందల ఫిర్యాదులు వస్తే అందులో 117 ఆస్పత్రులకు నోటీసులు జారీ చేసినట్లు ఇటీవల హైకోర్టుకు సమర్పించిన అఫిడవిట్‌లో ప్రజారోగ్య శాఖ పేర్కొన్నది. అందులో 22 ఆస్పత్రులకు కరోనా ట్రీట్‌మెంట్‌ అనుమతులను రద్దు చేయగా ఖమ్మం జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారి మరో పది ఆస్పత్రుల అనుమతుల్ని రద్దు చేశారు. ఇప్పుడు ఒక్కటొక్కటిగా ఉపసంహరణ దిశగా నిర్ణయాలు జరుగుతున్నాయి. రెండు రోజుల వ్యవధిలో మొత్తం 32 ఆస్పత్రులకు కరోనా అనుమతులు పునరుద్ధరించేలా సర్క్యులర్ జారీ కానున్నట్లు ప్రజారోగ్య శాఖ వర్గాల సమాచారం. ఇప్పటికే వరంగల్ పట్టణంలోని ఒక కార్పొరేట్ ఆస్పత్రికి ఈ మేరకు ఉపసంహరణ ఉత్తర్వులు జారీ అయ్యాయి. మరోసారి అధిక ఫీజులు ఆరోపణలు రాకుండా చూసుకోవాలని, పునరావృతమైతే కఠిన చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని ఆ ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు.


Next Story

Most Viewed