బ్రేకింగ్: ఏపీలో శాసన మండలి రద్దు తీర్మానం ఉపసంహరణ

by  |
CM Jagan
X

దిశ, ఏపీ బ్యూరో: మూడు రాజధానుల ఉపసంహరణ బిల్లు ప్రవేశపెట్టిన వైసీపీ ప్రభుత్వం తాజాగా మంగళవారం శాసనమండలి రద్దు తీర్మానాన్ని వెనక్కి తీసుకుంటున్నట్లు ప్రకటించింది. గతంలో శాసనమండలిని రద్దుచేయాలని చేసిన తీర్మానాన్ని వెనక్కి తీసుకోనున్నట్లు శాసన సభా వ్యవహారాల శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి అసెంబ్లీలో ప్రకటించారు. ఈ మేరకు శాసనసభలో ఇవాళ కొత్త తీర్మానం ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా బుగ్గన మాట్లాడుతూ…రద్దు తీర్మానాన్ని జనవరి 27న అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. అయితే ఆ తీర్మానాన్ని కేంద్రం ఆమోదం కోసం పంపగా, గత 22 నెలలుగా అది కేంద్రం వద్దే పెండింగ్ లో ఉండిపోయింది. దాంతో శాసనమండలి కొనసాగింపుపై సందిగ్ధత ఏర్పడింది. ఏపీ ప్రభుత్వ తాజా నిర్ణయంతో ఇప్పుడా సందిగ్ధత తొలగిపోయింది. మండలి రద్దును వెనక్కి తీసుకుంటున్నట్టు ఏపీ సర్కారు తీర్మానం చేయడంతో ఆ సందిగ్ధత తొలిగిపోయినట్లైంది. ఇదే సందర్భంలో శాసనమండలిని యథాతథంగా కొనసాగించాలని కేంద్రాన్ని కోరుతామని ప్రకటించారు.

లెజిస్టేటివ్ అసెంబ్లీకి కౌన్సిల్ బలంగా ఉంటుందని ఆశిస్తూ ఈ నిర్ణయం తీసుకున్నట్లు మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి తెలిపారు. ఇకపోతే బుగ్గన ప్రవేశపెట్టిన తీర్మానాన్ని సభ్యులు ఏకగ్రీవంగా ఆమోదించారు. అయితే ఈ తీర్మానాన్ని ప్రభుత్వం కేంద్రప్రభుత్వానికి అందజేయనున్నట్లు అసెంబ్లీలో మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ప్రకటించారు. ఇకపోతే గతేడాది జనవరిలో ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీషు మీడియంను ప్రవేశపెట్టాలని తీర్మానం చేసింది. అయితే ఆ ఆర్డినెన్స్‌కు మండలి వ్యతిరేకించింది. అనంతరం మూడు రాజధానుల బిల్లులను మండలి వ్యతిరేకించింది. ఈ పరిణామాలు ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌కు ఆగ్రహాన్ని తెప్పించాయి. ప్రజాబలంతో గెలిచిన 151 మంది ఎమ్మెల్యే నిర్ణయాన్ని తప్పుబడతారా మండలిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అసెంబ్లీ నిర్ణయమే ఫైనల్‌ అని తేల్చిచెప్పారు. అసలు మండలి వ్యవస్థే అవసరం లేదంటూ విరుచుకుపడ్డారు. మండలి నిర్వహణ వల్ల ప్రభుత్వానికి ఖర్చు ఎక్కువ అవుతుందని ఆరోపించారు. ఈ నేపథ్యంలో మండలిని రద్దుచేయాలని కేంద్రాన్ని కోరుతూ గతేడాది జనవరి 27న శాసనసభలో తీర్మానం పెట్టారు. ఆ తీర్మానాన్ని కేంద్రానికి సైతం పంపించారు. అయితే దానిపై కేంద్ర ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు.

ఉపసంహరణ వెనుక వ్యూహం ఇదే

మూడు రాజధానులు బిల్లు, ఇంగ్లీషు మీడియంతోపాటు కీలక నిర్ణయాలను శాసనమండలి వ్యతిరేకించింది. అసెంబ్లీలో వైసీపీ బలం ఎక్కువగా ఉండటంతో ప్రభుత్వం పెట్టిన బిల్లు పాస్ అవుతున్నప్పటికీ మండలిలో టీడీపీ సభ్యుల సంఖ్య ఎక్కువగా ఉండటంతో బిల్లు పాస్ కావడం లేదు. ఈ నేపథ్యంలోనే శాసన మండలి రద్దుకు జగన్ నిర్ణయం తీసుకున్నారు. అయితే ప్రస్తుతం శాసన మండలిలో వైసీపీ సభ్యుల సంఖ్య పెరిగింది. శాసన మండలిలో 58 మంది ఎమ్మెల్సీలు ఉండగా ప్రస్తుతం టీడీపీకి చెందిన సభ్యులు 12 మంది వైసీకి 18 మంది సభ్యులు ఉన్నారు. మంగళవారం ఎమ్మెల్యే కోటాలో ముగ్గురు వైసీపీ అభ్యర్థులు ఎమ్మెల్సీలుగా ప్రమాణ స్వీకారం చేశారు. దీంతో మండలిలో వైసీపీ సభ్యుల బలం 21కు చేరింది.

మరికొన్ని రోజుల్లో మరో 11 మంది వైసీపీ ఎమ్మెల్సీలు మండలిలో అడుగుపెట్టనున్నారు. స్థానిక సంస్థల కోటాలో 11స్థానాలకు ఎన్నిక జరగాల్సి ఉంది. ఇప్పటికే ఆయా జిల్లాల్లో వైసీపీ అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. ఈ 11మంది అభ్యర్థులు ఏకగ్రీవమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ 11మంది వైసీపీ సభ్యులు ఏకగ్రీవంగా ఎమ్మెల్సీలు మండలిలో అడుగుపెడితే వైసీపీ బలం 32కు చేరుతుంది. శాసనసభలో ఏ బిల్లు పాస్ అయినా అది మండలిలో కూడా ఈజీగా పాస్ అవుతుంది. వైసీపీ ప్రభుత్వం తీసుకునే ఆర్డినెన్స్‌, బిల్లులకు ఉభయ సభల్లోనూ అడ్డంకి లేదు. అందువల్లే శాసన మండలి రద్దు తీర్మానాన్ని వైసీపీ ఉపసంహరించుకుంది. మరోవైపు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తన పాదయాత్రలో అనేక మందికి ఎమ్మెల్సీలుగా అవకాశం కల్పిస్తానని హామీ ఇచ్చారు. ఈ హామీ నేపథ్యంలో..పదవుల సర్థుబాటుకోసం అయినా మండలిని ఉంచాల్సిదేనని వైసీపీ భావిస్తోంది.

Next Story

Most Viewed