రంగంలోకి దిగిన మేయర్ విజయలక్ష్మి.. అధికారులంతా పారాహుషార్..!

by  |
రంగంలోకి దిగిన మేయర్ విజయలక్ష్మి.. అధికారులంతా పారాహుషార్..!
X

దిశ, సిటీ బ్యూరో: పదవీ బాధ్యతలు చేపట్టిన ఏడు నెలలకు అధికారుల పనితీరుపై మేయర్ గద్వాల్ విజయలక్ష్మి ఓ అభిప్రాయానికొచ్చారు. అధికారులు ఏసీ రూమ్ లలో విధులు నిర్వహిస్తూ, ఖరీదైన కార్లలో తిరిగితే మహానగర వాసులు వర్షాల వల్ల ఎదుర్కొనే సమస్యలు మీకెలా తెలుస్తాయి..? జోనల్ స్థాయి అధికారులు, డిప్యూటీ కమిషనర్లు, చీఫ్ ఇంజనీర్లతో పాటు ఇంజనీర్లంతా నగర రోడ్లపై మోటర్ సైకిళ్లపై క్షేత్ర స్థాయిలో పర్యటించి గుంతలు, దెబ్బతిన్న రోడ్లు, త్రాగు నీటి వసతి ఇబ్బందులను గుర్తించి తక్షణ మరమ్మత్తులు చేపట్టాలని చురక పెట్టారు. అంతేగాక, ఈ ఆదేశాలను ఎవ్వరూ కూడా నిర్లక్ష్యం చేసినా చర్యలు తప్పవంటూ అల్టిమేటం కూడా జారీ చేశారు.

మహానగరంలో కొద్ది రోజుల పాటు కురిసిన భారీ వర్షాలకు ప్రభావితం చేసిన ప్రాంతాల్లో తక్షణ సహాయక చర్యలు చేపట్టాలని ఎట్టకేలకు నగర మేయర్ గద్వాల్ విజయలక్ష్మి అధికారులను ఆదేశించారు. వర్ష ప్రభావ ప్రాంతాలలో చేపడుతున్న సహాయక చర్యలను బుధవారం ఆమె వివిధ ప్రాంతాల్లో పర్యటించి క్షేత్ర స్థాయిలో ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా మేయర్ అంబర్ పేట, నారాయణగూడ, హిమాయత్ నగర్, బషీర్ బాగ్ ప్రాంతాల్లో పర్యటించి రోడ్ల పై ఏర్పడిన గుంతలు, దెబ్బతిన్న రోడ్లను పరిశీలించారు. వీటికి వెంటనే మరమ్మత్తులు చేపట్టి, ప్రజలకు, రాకపోకలకు ఇబ్బందులు కలుగకుండా చర్యలు చేపట్టాలని జోనల్ కమిషనర్లను ఆదేశించారు. వర్షాల వల్ల పేరుకుపోయిన చెత్తను తక్షణమే తొలగించాలని మెడికల్ అధికారులను ఆదేశించారు. కురిసిన వర్షాలకు లోతట్టు ప్రాంతాల్లో నిలిచిన నీరు తొలగించడంతో పాటుగా ఆ ప్రాంతాల్లో ప్రజలకు వ్యాధులు ప్రబలకుండా వ్యాధి నివారణ చర్యలను చేపట్టాలని సూచించారు.

విరిగిన చెట్ల తో పాటుగా వీధి దీపాలకు అడ్డుగా ఉన్న చెట్లను గుర్తించి వెంటనే తొలగించాలని ఆదేశించారు. పునరావస కార్యక్రమాలు, మరమ్మతులు చేపట్టే చర్యలతో పాటుగా వినాయక చవతి ఏర్పాట్లపై జోనల్ కమిషనర్లతో మేయర్ తన ఛాంబర్ లో సమీక్ష నిర్వహించారు. వినాయక మండపాల వద్ద పరిసరాలను పరిశుభ్రంగా ఉండేందుకు కమిటీ సభ్యులకు సహకారం అవసరం ఉంటుందని అన్నారు. ప్రతి మండపం వద్ద ఒక చెత్తకుండీ ఏర్పాటు చేయాలని సూచించారు. మరో రెండు రోజులు వర్షాలు తీవ్రంగా కురిసే అవకాశం ఉన్నందున ముందస్తు నివారణ చర్యలు చేపట్టాలని అధికారులకు సూచించారు. ఈ సమీక్షలో అదనపు కమిషనర్ శానిటేషన్ బి.సంతోష్, జోనల్ కమిషనర్లు రవికిరణ్, అశోక్ సామ్రాట్, ఉపేందర్ రెడ్డి, చీఫ్ ఇంజనీర్ శ్రీదర్, డిప్యూటి కమిషనర్లు తదితరులు పాల్గొన్నారు.

మట్టి విగ్రహాలనే పూజిద్దాం: మేయర్

పర్యావరణ పరిరక్షణ కోసం మట్టి వినాయక విగ్రహాలనే వినియోగించుకోవాలని మేయర్ గద్వాల విజయలక్ష్మి మహానగర ప్రజలను కోరారు. బల్దియా ప్రధాన కార్యాలయ సిబ్బందికి వినాయక చవితి పండుగ సందర్భంగా మేయర్ బుధవారం మట్టి వినాయకులను పంపిణీ చేశారు. పర్యావరణహితానికి మట్టి వినాయక విగ్రహాలను వినియోగించుకోవాలని కోరారు. రసాయనిక విగ్రహాల వల్ల పర్యావరణానికి నష్టం కలుగుతుందని, భావి తరాలకు స్వచ్చమైన వాతావరణాన్ని అందించాలంటే మట్టి వినాయకులనే పూజించాలని సూచించారు.



Next Story

Most Viewed