అక్షయ తృతీయకు బంగారం అమ్మకాలపై వ్యాపారుల ఆందోళన!

by  |
అక్షయ తృతీయకు బంగారం అమ్మకాలపై వ్యాపారుల ఆందోళన!
X

దిశ, వెబ్‌డెస్క్: కరోనా తీవ్రంగా ఉండటంతో చాలా రాష్ట్రాల్లో లాక్‌డౌన్ ఆంక్షలు కొనసాగుతున్న నేపథ్యంలో ఈ ఏడాది అక్షయ తృతీయకు ఆభరణాల వ్యాపారం సన్నగిల్లే అవకాశం ఉందని వ్యాపారులు భావిస్తున్నారు. గతేడాది ఇదే సమయంలో దేశవ్యాప్త లాక్‌డౌన్ కారణంగా అమ్మకాలు జరగలేదు. ఈసారి కూడా ఇదే పరిస్థితి ఉంటే అక్షయ తృతీయ అమ్మకాలు వరుసగా రెండో ఏట తక్కువగా నమోదవుతాయని వ్యాపారులు ఆందోళన చెందుతున్నారు. సాధారణంగా అక్షయ తృతీయ రోజున బంగారం కొనడం భారత్‌లో సాంప్రదాయంగా భావిస్తారు.

గతేడాది 2019తో పోలిస్తే బంగారం డిమాండ్ 70 శాతం తక్కువగా నమోదైంది. ఆరోగ్య సంరక్షణ ప్రాధాన్యంగా మారిపోవడంతో ఆన్‌లైన్ అమ్మకాలపై జ్యువెలర్లు ఎలాంటి ఆశలు పెట్టుకోలేదు.”అక్షయ తృతీయ సమయానికి జ్యువెలరీ దుకాణాలను మూసేయడం వరుసగా రెండో ఏడాది. ఇప్పటికే పెద్ద ఎత్తున అమ్మకాలను కోల్పోయాం. ఏడాది మొత్తంలో బంగారం అమ్మకాలకు కీలకమైన రోజున అమ్మకాలు నిర్వహించకపోతే తమ వ్యాపారాలు తీవ్రంగా దెబ్బతింటాయి. సెమీ స్కిల్‌డ్ వర్క్‌ఫోర్స్‌కు భారీగా ఉపాధి అవకాశాలను అందించే బంగారం రిటైల్ రంగానికి ఇది పెద్ద దెబ్బ అవుతుందని” డబ్ల్యూహెచ్‌పీ జ్యువెలర్స్ డైరెక్టర్ ఆదిత్య చెప్పారు.

“బంగారం విషయంలో ఆన్‌లైన్ కొనుగోళ్లపై పెద్దగా ఆశలు లేవని అన్మోల్ జ్యువెలర్స్ వ్యవస్థాపకుడు ఇషు దత్వాని చెప్పారు. 2020 ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో బంగారం డిమాండ్ అంతకుముందు ఏడాది 213.2 టన్నుల నుంచి 63.7 టన్నులకు పడిపోయింది. ఈ ఏడాది ఇది మరింత క్షీణించేలా అంచనా వేస్తున్నట్టు ఆయన వివరించారు. బడా ఆభరణాల స్టోర్లు డిజిటల్ మార్కెటింగ్‌ని ప్రోత్సహిస్తున్నాయి. తాము కూడా ఆ దిశగా ప్రయత్నిస్తున్నాం. ఈ ఏడాది జనవరి-మార్చి మధ్య అమ్మకాలు పెరిగాయి. అయితే, మరోసారి కరోనా పెరగడంతో అమ్మకాలపై ప్రతికూల ప్రభావం ఏర్పడిందని” మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ ఛైర్మన్ అహ్మద్ వివరించారు.


Next Story

Most Viewed