మాకైతే మస్త్ గిరాకీ…!

by  |
మాకైతే మస్త్ గిరాకీ…!
X

దిశ‌, మ‌ధిర : ఖమ్మం జిల్లా మధిర ఎక్సైజ్ పరిధిలోని వైన్ షాపులకు గిరాకి ఎక్కువగా ఉంటోంది. ఈ ప్రాంతం ఆంధ్ర‌ప్రదేశ్ రాష్ట్ర సరిహద్దు కావడమే ఇందుకు ప్రధాన కారణం. ఏపీలో మద్యం ధరలు విపరీతంగా పెరిగాయి. ఈ నేపథ్యంలో బోనకల్, సిరిపురం, మధిర, ఎర్రుపాలెం ప్రాంతాలు ఏపీకి సమీపంలో ఉండటంతో అక్కడి వారు ఇక్కడికి వచ్చి ఎక్కువ మొత్తంలో కొనుగోలు చేస్తున్నారు. గతేడాది ఇదే స‌మ‌యానికి జ‌రిగిన అమ్మాకాల‌తో పొల్చుకుంటే ఈ ఏడాది ఇక్కడ 33 శాతం అధికంగా మద్యం అమ్మకాలు జ‌రిగిన‌ట్టు మధిర ఎక్సైజ్ అధికారులు చెబుతున్నారు. ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో మ‌ద్యం రేట్ల‌ను పెంచుతూ ప్ర‌భుత్వం నిర్ణ‌యం తీసుకున్న విష‌యం తెలిసిందే. ఏపీలో మద్యపాన నిషేధం అమలు కోసం ఇప్పటికే జగన్ సర్కార్ 75 శాతం మద్యం రేట్లను పెంచారు. ఏపీతో పోల్చుకుంటే తెలంగాణలో మద్యం రేట్లు తక్కువగా ఉండటంతో అక్క‌డి మందు బాబులు ఈ ప్రాంతాలకు కొనుగోలు చేస్తున్నారు. ఈ దుకాణాల్లో కొన్ని సార్లు నో స్టాక్ అని బోర్డులు త‌గిలించే ప‌రిస్థితి ఏర్పడుతోందంటే అమ్మకాలు ఏ స్థాయిలో ఉన్నాయో ఇట్టే అర్థం చేసుకోవచ్చు. రాత్రి సమయంలో తెలంగాణ సరిహద్దు పల్లెల్లోని బెల్టు షాపులకు, ఏపీలోని వివిధ ప్రాంతాలకు ఇక్కడి దుకాణ యజమానులు మద్యాన్ని తరలిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. వీటి పట్ల ఎక్సైజ్ అధికారులు చూసీచూడనట్టుగా వ్యవహరిస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి. క‌రోనా కారణంగా మ‌ద్యం సేల్స్ మిగ‌తా ప్రాంతాల్లో ప‌డిపోగా.. స‌రిహ‌ద్దు ప్రాంతాల్లోని వైన్ షాపుల్లో అమ్మకాలు పెరిగాయి. దీంతో సాధార‌ణ రోజుల క‌న్నా ప్రస్తుతం సేల్స్ ఎక్కువ‌గా ఉండ‌టంతో మద్యం దుకాణాల నిర్వాహకులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.



Next Story