'తెలంగాణ డిమాండ్స్ డేను జయప్రదం చేయండి'

by  |
తెలంగాణ డిమాండ్స్ డేను జయప్రదం చేయండి
X

దిశ, నిజామాబాద్: జూన్ 2 తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటివరకు ప్రజల సమస్యలను ప్రభుత్వం పట్టించుకోకపోవడం మూలంగా ఆ సమస్యల పరిష్కారం కొరకు డిమాండ్స్ డేగా ప్రజలందరూ నిర్వహించాలని వామపక్ష పార్టీల నాయకులు ప్రజలకు పిలుపునిచ్చారు. సోమవారం సీపీఎం పార్టీ కార్యాలయంలో జరిగిన వామపక్ష పార్టీల సమావేశంలో సీపీఐ జిల్లా కార్యదర్శి కంజర భూమన్న మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రం ఏర్పడి ఆరు సంవత్సరాలు గడిచి ఏడవ సంవత్సరంలోకి అడుగిడుతున్న వేళ ప్రజల సమస్యలు ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్న చందంగా ఉన్నాయని, ప్రధానంగా పేదలకు ఉపాధి, ఉద్యోగం, డబుల్ బెడ్ రూమ్ ఇల్లు, మూడెకరాల భూమి అంద లేదని, వీటి పరిష్కారం కొరకు అనేక పోరాటాలు చేసిన పట్టించుకోవట్లేదని విమర్శించారు. సీపీఎం జిల్లా కార్యదర్శి ఏ. రమేష్ బాబు మాట్లాడుతూ.. ధనిక రాష్ట్రమైన తెలంగాణలో కరోనా వంకతో వేతనాల్లో కోతలు విధిస్తున్నారని, దేశంలోని అనేక రాష్ట్రాల్లో, ఉద్యోగ కార్మికులకు ఏప్రిల్, మే నెలలో పూర్తి వేతనాలు చెల్లించినప్పటికీ మన రాష్ట్ర ప్రభుత్వం కోతలు విధించాలని నిర్ణయించటం సరైంది కాదన్నారు. ప్రభుత్వ నిర్ణయం వల్ల ప్రైవేట్ కంపెనీలు, ఇతర యజమానులు కార్మికుల వేతనాల్లో కోతలను, తొలగింపులను చేసి ప్రజలను ఇబ్బంది పెట్టే పరిస్థితి ఉందని ఆయన విమర్శించారు. నిరుపేదల అందరికీ రేషన్ బియ్యంతో పాటు, పదిహేను వందల రూపాయలు నగదును, నిత్యావసర సరుకులను అందజేయాలని డిమాండ్ చేశారు. సీపీయూఎస్ఐ నాయకులు మల్లికార్జున్ మాట్లాడుతూ రైతులు ప్రభుత్వం చెప్పిన పంటలనే వేయాలని.. లేనియెడల రైతుబంధు వర్తించదని, ఇతర పంటలు వేస్తే కొనుగోలు తమ బాధ్యత కాదని బెదిరించటం సరైంది కాదన్నారు. ఈ కార్యక్రమంలో వామపక్ష పార్టీల నాయకులు రాజన్న, గోవర్ధన్, తదితరులు పాల్గొన్నారు.

Next Story

Most Viewed