వ‌రంగ‌ల్‌ ఎన్నికలకు కరోనా అడ్డంకిగా మారేనా..?

by  |
వ‌రంగ‌ల్‌ ఎన్నికలకు కరోనా అడ్డంకిగా మారేనా..?
X

దిశ‌ప్రతినిధి, వ‌రంగ‌ల్ : ఓ వైపు క‌రోనా ముప్పు ముంచుకువ‌స్తోంది.. మ‌రోవైపు రాష్ట్ర ఎన్నిక‌ల సంఘం సాధ్యమైనంత త్వర‌గా వ‌రంగ‌ల్, ఖ‌మ్మం కార్పోరేష‌న్‌తో పాటు మ‌రో నాలుగు మునిసిపాలిటీల‌కు ఎన్నిక‌లు నిర్వహించాల‌ని వేగంగా నిర్ణయాలు తీసుకుంటోంది. వ‌రంగ‌ల్ కార్పోరేష‌న్ ప‌రిధిలోఎన్నిక‌ల ప్రక్రియ వేగంగా జ‌రుగుతోంది. ఇప్పటికే డివిజ‌న్ల పున‌ర్విభ‌జ‌న‌, ఎస్సీ, ఎస్టీ, బీసీ ఓట‌ర్ల గ‌ణ‌న పూర్తి చేసి ముసాయిదా జాబితాను కూడా విడుద‌ల చేశారు. ఈనెల 11 వ‌ర‌కు అభ్యంత‌రాల‌ను స్వీక‌రించిన 14వ తేదీన డివిజ‌న్లకు రిజ‌ర్వేష‌న్లు ప్రక‌టించే అవ‌కాశం ఉంది. ఈ ప్రక్రియ త‌ర్వాత ఏ క్షణ‌మైనా జీడ‌బ్ల్యూఎంసీ ఎన్నిక‌ల నోటిఫికేష‌న్ విడుద‌ల‌య్యే అవ‌కాశం ఉంది. ఎట్టి ప‌రిస్థితుల్లో ఈనెల‌లోనే ఎన్నిక‌లను నిర్వహించి తీరాల‌ని అధికారులకు అంత‌ర్గతంగా ఆదేశాలున్నట్లు స‌మాచారం. ఎన్నిక‌ల నిర్వహ‌ణ‌ను అన్ని పార్టీల నాయ‌కులు కోరుకుంటున్నా.. క‌రోనా ముప్పుమాత్రం సామాన్య జ‌నాన్ని, పోలింగ్ ప్రక్రియ‌లో భాగ‌స్వాములు కాబోతున్ను ఉద్యోగ, అధికార వ‌ర్గాల‌ను భ‌యాందోళ‌న‌కు గురి చేస్తోంది.

రోజుకు వంద‌కు పైగానే కేసులు…

వ‌రంగ‌ల్ అర్భన్ జిల్లాలో క‌రోనా కేసులు గ‌త వారం రోజులుగా క్రమంగా100 దాటి న‌మోద‌వుతున్నట్లు స‌మాచారం. అయితే అధికారికంగా మాత్రం కేసులును త‌క్కువ‌గానే హెల్త్ బులిటెన్‌లో పేర్కొంటుండ‌టం గ‌మ‌నార్హం. అదే పీహెచ్‌సీ సెంట‌ర్ల వారీగా న‌మోదైన కేసుల‌ను ప‌రిగ‌న‌లోకి తీసుకున్నప్పుడు ఈ విష‌యం స్పష్టమ‌వుతోంది. ఇక ఉమ్మడి జిల్లాలోనూ కేసులు భారీగా పెరుగుతున్నాయి. ఏప్రిల్ మాసంలో క‌రోనా కేసులు తార‌స్థాయికి చేరుకుంటున్నాయ‌ని స్వయంగా రాష్ట్ర ప్రభుత్వ పెద్దలే గ‌తంలో ప్రక‌టించారు. వైద్య ఆరోగ్యశాఖ అధికారులు కూడా ఈ విష‌యంపై స్పష్టత ఇచ్చారు. ప్రజ‌లంతా జాగ్రత్తగా ఉండాల‌ని సూచిస్తున్నారు.

ఇప్పుడు ఎన్నిక‌లు అవ‌స‌ర‌మా..?

ప్రజా ఆరోగ్యాన్ని ప్రమాదంలో ప‌డవేసే విధంగా ఇప్పుడు ఎన్నిక‌లు నిర్వహించ‌డం అవ‌స‌ర‌మా అన్న ప్రశ్నలు సామాన్య, మేధావి వ‌ర్గాల నుంచి వ‌స్తున్నాయి. ఎన్నిక‌ల ప్రక్రియ‌లో వంద‌లాది మంది సిబ్బందితో పాటు రాజ‌కీయ పార్టీల హ‌డావుడి, ప్రచారంలో నిత్యం వేలాది మంది పాలు పంచుకుంటారు. కోవిడ్ నిబంధ‌న‌లను మాములుగానే ఉల్లంఘిస్తున్న జ‌నం.. ఎన్నిక‌ల స‌మ‌యంలో పాటిస్తార‌నుకుంటే పొర‌పాటే అవుతుంది. ఎన్నిక‌ల నిర్వహ‌ణ కోవిడ్ వ్యాప్తికి దోహ‌దం చేస్తుంద‌న్న వాద‌న‌లు వినిపిస్తున్నాయి. కోవిడ్ ఉధృత ద‌శ‌లోనే ఉన్న నేప‌థ్యంలో ఎన్నిక‌ల‌ను ఇప్పట్లో నిర్వహించ‌కుండా వాయిదా వేయ‌డ‌మే తెలివైన నిర్ణయ‌మ‌ని కొంత‌మంది న‌గ‌ర ప్రజ‌లు పేర్కొంటున్నారు. ఎన్నిక‌ల క‌మిష‌న్‌, ప్రభుత్వం దీనిపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాలి.



Next Story