తలైవా పాలిటిక్స్ హిట్టయ్యేనా?

by  |
తలైవా పాలిటిక్స్ హిట్టయ్యేనా?
X

దిశ, వెబ్‌డెస్క్: దక్షిణ భారతంలో సినిమాలు, రాజకీయాలకు అవినాభావ సంబంధముంది. మరీ ముఖ్యంగా తమిళనాట తలైవి, ఎంజీఆర్ వంటి అగ్రనటులు వెండి తెరపై నుంచి రాజకీయ రణక్షేత్రంలోకి వచ్చి విజయం సాధించారు. ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించారు. ఇక ఇప్పుడు రెండు దశాబ్దాల నుంచి రాజకీయాల్లోకి వస్తా..వస్తా అంటూ ఊరించిన సూపర్ స్టార్ రజనీకాంత్ ఎట్టకేలకు కీలక ప్రకటన చేశారు. జనవరిలో తాను సొంత పార్టీని ప్రారంభిస్తున్నట్లు, డిసెంబర్ 31 తర్వాత పూర్తి వివరాలు వెల్లడిస్తానని ట్విట్టర్‌లో వెల్లడించారు. లోకనాయకుడు కమల్ హాసన్ ఇప్పటికే పార్టీ పెట్టినప్పటికీ అంతగా ప్రభావం చూపలేదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. 2021లో ప్రత్యక్ష రాజకీయాల్లోకి తాను సిద్ధమైనట్లు రజనీకాంత్ ప్రకటించడంతో తమిళనాట రాజకీయం హీటెక్కింది. రజనీ కంటే ముందు నుంచి పాలిటిక్స్‌లో‌కి చాలా మంది ప్రముఖులు వచ్చారు. వాళ్ల గురించి ఓ లుక్కేద్దాం.

కంజీవరం నటరాజన్ అన్నాదురై

తమిళనాడు రాష్ట్ర తొలి ముఖ్యమంత్రిగా పనిచేసిన సినీహీరో. సీఎన్ అన్నాదురై.. తమిళ రచయిత. అనేక నాటకాలను రచించి నటించాడు. ఆయన రాసిన చాలా కథలు సినిమాలు తీశారు. ఆయన కూడా సినిమాల్లో నటించి ద్రవిడులను మెప్పించాడు. అనంతరం తమిళనాడులో ద్రావిడ పార్టీని స్థాపించారు. తమిళ సినిమా రంగాన్ని ద్రావిడ పార్టీ ప్రచారానికి వాడుకున్న తొలి రాజకీయ నాయకుడిగా ప్రసిద్ధికెక్కారు. సీఎన్ అన్నాదురై హయాంలోనే మద్రాసు రాష్ట్రం నుండి ఆంధ్రప్రాంతం విడిపోయి తమిళనాడు రాష్ట్రం ఏర్పడింది.

ఎం.కరుణానిధి

ఎం.కెగా, డాక్టర్ కళైనార్‌గా ప్రసిద్ధికెక్కిన మత్తువేల్ కరుణానిధి కూడా సినీ హీరోనే. సీఎన్ అన్నాదురై మరణాంతరం కరుణానిధి రాజకీయ అరంగేట్రం చేశారు. తమిళ సాహిత్యంలో కరుణానిథి తనదైన ముద్రను వేసుకున్నాడు. పద్యాలు, నాటికలు, లేఖలు, నవలలు, జీవిత చరిత్రలు, సినిమాలు, సంభాషణలు, పాటలు మొదలైన అన్ని రంగాల్లో ఆయనకు ప్రవేశం ఉంది. దక్షిణ భారత చలన చిత్ర సీమ నుంచి ముఖ్యమంత్రి అయిన మొదటి వ్యక్తి కరుణానిధి. తమిళనాడులో ద్రవిడ మున్నేట్ర కళగం (డీఎంకే) పార్టీ నుంచి ఆయన ఐదుసార్లు ముఖ్యమంత్రిగా పని చేశారు. ప్రస్తుతం కరుణానిధి కుమారుడు స్టాలిన్ నాయకత్వంలో డీఎంకే ఇప్పుడు ఎన్నికల బరిలో ఉంది.

ఎంజీ రామచంద్రన్..

తమిళ ప్రజల అభిమాన నటుడు. మొదట్లో కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. గాంధీ ప్రభావితుడిగా ఉన్న ఈయన ఆ తర్వాత అన్నాదురై డీఎంకే పార్టీలో చేరారు. ఆ తర్వాత ఏఐడీఎంకే పేరిట పార్టీ స్థాపించారు. ముఖ్యమంత్రిగా పని చేశారు. ఆయన వారసురాలిగా సినీనటి జయలలిత రాజకీయ అరంగేట్రం చేసి ఆమె తుదిశ్వాస వరకు ముఖ్యమంత్రిగా కొనసాగారు.

జయలలిత..

ఎంజీ రామచంద్రన్ మరణానంతరం ఆయన శిష్యురాలిగా పాలిటిక్స్‌లోకి వచ్చారు. తమ అభిమాన నటి జయలలితను తమిళ ప్రజలు ఆదరించారు. ఆమెకు పాలించే అధికారమిచ్చారు.

కెప్టెన్ విజయ్‌కాంత్..

ప్రభాకరన్, రమణ వంటి సామాజిక చిత్రాలతో ప్రజల ఆదరాభిమానాలు చూరగొన్న నటుడు విజయ్‌కాంత్. ఈయన కూడా తెర మీద హీరోగానే కాకుండా రాజకీయాల్లోనూ ఉండాలని రాజకీయ అరంగేట్రం చేశారు. ప్రజల అభివృద్ధి పేరుతో డీఎండీకే పార్టీ స్థాపించారు. కానీ, ఆశించినన్నీ స్థానాలు, ఫలితాలు ఆయనకు రాలేదు. అయితే ప్రజాసేవలో ఇప్పటికీ ఉన్నారు. ప్రతిపక్ష పాత్ర పోషిస్తున్నారు.

ఆర్.శరత్ కుమార్..

ఏఐఏఎస్ఎంకే పార్టీ స్థాపించారు. ప్రజలను కాపాడటం కోసం తాను పార్టీ పెట్టినట్లు ప్రారంభించారు. ప్రజల ఆశీర్వాదంతో శాసనసభ్యుడిగా ఎన్నికయ్యారు. కానీ, తదనంతర కాలంలో మళ్లీ తెరమీద(సినిమాల)కే పరిమితమయ్యారు.

శివాజీ గణేశన్..

నటుడిగా తనకంటూ ఓ విలక్షణశైలి ఏర్పరుచుకున్న శివాజీ గణేశన్ కూడా రాజకీయాల్లోకి వచ్చారు. టీఎంఎం పేరుతో పార్టీ స్థాపించారు. కానీ, పార్టీని విజయతీరాల వైపునకు నడిపించలేకపోయారు.

ఉపేంద్ర

ఉపేంద్ర, ఏ, ష్.. కన్యాదానం తదితర చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన మలయాళ హీరో ఉపేంద్ర కూడా పార్టీని స్థాపించి ఎన్నికల బరిలో దిగాడు. కానీ రాష్ట్ర రాజకీయాల్లో ఏ మాత్రం ప్రభావం చూపలేకపోయాడు.

మెగాస్థార్ చిరంజీవి

తెలుగులో ఎన్టీఆర్ తర్వాత అంతటి చరిష్మా ఉన్న హీరో మెగాస్టార్ చిరంజీవి. టాలీవుడ్ లో అగ్రహీరోగా ఉన్న సమయంలోనే ప్రజారాజ్యం పార్టీ స్థాపించి ఎన్నికల బరిలో దిగాడు. కానీ హీరోగా ఉన్న క్రీజీ రాజకీయాల్లో కనిపించలేదు. ఉమ్మడి రాష్ట్రంలో కేవలం 18 అసెంబ్లీ సీట్లతోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది. తరనాంతరం జరిగిన రాజకీయ పరిణామాలతో ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేశారు. ఆ తర్వాత రాజకీయాల నుంచి తప్పుకోని మళ్లీ సినిమాలు తీసుకుంటున్నారు.

పవర్ స్థార్ పవన్ కళ్యాణ్..

అన్న మెగస్టార్ చిరంజీవి రాజకీయ పార్టీ పెట్టి దెబ్బతిన్నా.. ఆయన సోదరుడు పవన్ కళ్యాణ్ అదే దారిలో నడిచాడు. సినిమాలను వదిలి.. జనసేన పార్టీని స్థాపించారు. 2019లో జరిగిన ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ లో బరిలోకి దిగి బొక్కబోర్ల పడ్డారు. రెండు స్థానాల నుంచి బరిలోకి దిగిన ఆయన.. ఓటమి పాలయ్యారు. ఆయన రెండె సోదరుడు నాగబాబు సైతం నరసాపురం పార్లమెంట్ స్థానం నుంచి పోటీ చేసి ఓడిపోయారు.

వందసార్లు చెప్పినా..

సూపర్ స్టార్ రజనీ రాజకీయం ఆయన డైలాగ్ లాగే ఉంటుందంటున్నారు పరిశీలకులు. వందసార్లు చెప్పినా అర్థం కాదని అంటున్నారు. గతంలో ఆయన ప్రకటనలు చూస్తే అర్థమవుతోంది. తనకు సీఎం కావాలని లేదని, 234 స్థానాల్లో అభ్యర్థులు నిలబెడతానని ప్రకటించారు. అయితే ఇప్పుడు మాత్రం తమ పార్టీ విజయం సాధిస్తుందని చెబుతున్నారు. ఇక తమిళనాటు ద్రవిడ పాలిటిక్స్ గురించి అందరికీ తెలిసే ఉంటుంది. ఆధ్యాత్మికత కంటే కూడా అభివృద్ధిని గురించిన స్పృహ ఎక్కువగా ఉంటుంది. అందుకే బీజేపీ దక్షిణ భారతంలో తమిళనాట ఎదిగే అవకాశాలు తక్కువగా ఉంటాయని పరిశీలకులు చెబుతారు. రజనీ తాను ఆధ్యాత్మిక రాజకీయం చేస్తానని గతంలో ప్రకటించారు. ఈ నేపథ్యంలో అసలు ఆయన ఎలాంటి రాజకీయం చేస్తారు? అనేది తెలియాలంటే పార్టీ విధి విధానాలు పూర్తి వివరాలు ప్రకటించే వరకు వెయిట్ చేయాల్సిందే. కాగా 2021 మే నెలలో తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి.


Next Story

Most Viewed