స్విగ్గీ, బిగ్ బాస్కెట్ ద్వారా పాల సప్లై : తలసాని

by  |
స్విగ్గీ, బిగ్ బాస్కెట్ ద్వారా పాల సప్లై : తలసాని
X

దిశ, న్యూస్‌బ్యూరో : కరోనా వైరస్ నేపథ్యంలో స్విగ్గీ, బిగ్ బాస్కెట్‌ల ద్వారా పాలు సప్లై చేసేలా చర్యలు తీసుకుంటున్నట్లు రాష్ట్ర పశు సంవర్థక శాఖ మంత్రి తలసాని శ్రీనియాస్ యాదవ్ చెప్పారు. పాలు తీసుకెళ్లే వాహనాలకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుంటోందని తెలిపారు. పాలు సరఫరా చేసే సిబ్బంది డ్రెస్ కోడ్ పాటించేలా డెయిరీలు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. కరోనా వ్యాప్తి నిరోధక చర్యల్లో భాగంగా లాక్ డౌన్ అమల్లో ఉన్న ఈ సమయంలో హైదరాబాద్ మాసాబ్ ట్యాంక్ పశుసంవర్థక శాఖ కార్యాలయంలో రాష్ట్రంలోని డెయిరీ యజమానులతో మంత్రి సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో పశుసంవర్థక శాఖ కార్యదర్శి అనితా రాజేంద్రన్, సంచాలకులు డాక్టర్ లక్ష్మారెడ్డి, విజయ డెయిరీ ఎండీ శ్రీనివాసరావుతో పాటు విజయ, మదర్, కరీంనగర్, హెరిటేజ్, అమూల్, జెర్సీ, దుర్గ, తిరుమల, దొడ్ల, ముకుంద తదితర డైరీల రిప్రెజెంటేటివ్స్ హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ప్రజలకు నిత్యావసర వస్తువైన పాలను అందుబాటులో ఉంచేందుకు ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుంటోందని చెప్పారు. ప్రస్తుత తరుణంలో పాలు, పశువుల దాణా, పశుగ్రాసాన్ని అధిక ధరలకు విక్రయిస్తే కఠిన చర్యలు తప్పవని మంత్రి హెచ్చరించారు. సప్లైయర్స్ గోదాములను అధికారులు ఎప్పటికప్పుడు తనిఖీ చేసి అక్రమ నిల్వలతో కొరత సృష్టించకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని మంత్రి తలసాని ఆదేశించారు.

Tags : telangana, dairy development, talasani, review on milk supply

Next Story