కోదండరాం కోరిక నెరవేరుతుందా?

by  |
కోదండరాం కోరిక నెరవేరుతుందా?
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ మలిదశ ఉద్యమంలో జయశంకర్ సార్, కేసీఆర్ తర్వాత అంతటి ప్రముఖ పాత్ర పోషించిన వ్యక్తి కోదండరాం. రాష్ట్ర ఏర్పాటు తర్వాత కేసీఆర్‌తో విభేదాలతో పొలిటికల్ పార్టీ పెట్టిన కోదండరాం.. ఇప్పటివరకూ చట్టసభల్లోకి అడుగు పెట్టలేదు. 2018 ఎన్నికల్లో జనగామ నుంచి బరిలో దిగి అసెంబ్లీలో అడుగుపెట్టాలని భావించినా ఆ సీటు పొన్నాల లక్ష్మయ్యకు వెళ్లిపోయింది. ఆ తర్వాత కాంగ్రెస్, టీజేఎస్ మధ్య భేదాభిప్రాయాలు వచ్చాయని టాక్ నడిచినా ర్యాలీలు, సభల్లో పాల్గొన్నారు. కానీ ఇటీవల పట్టభద్రుల ఎన్నికలకు తమ పార్టీ నుంచే అభ్యర్థిని నిలుపుతామని కాంగ్రెస్ ప్రకటించడంతో కోదండరామ్‌కు పెద్ద షాక్ తగిలినట్లయ్యింది. ఉద్యమ సమయంలో కేసీఆర్, ప్రజెంట్ కాంగ్రెస్‌ చేతిలో ఎదురుదెబ్బతలు తిన్న కోదండరామ్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలిచి చట్టసభల్లో అడుగుపెట్టాలనుకుంటున్న కోరిక నెరవేరుతుందా లేదా అన్నది ఆసక్తికరంగా మారింది.

నల్గొండ, వరంగల్, ఖమ్మం పట్టభద్రుల ఎన్నికల్లో ప్రస్తుతం కాంగ్రెస్ నుంచి బెల్లయ్యనాయక్, రాములు నాయక్ పేర్లు వినిపిస్తుండగా టీఆర్ఎస్‌ నుంచి మరోసారి పల్లా రాజేశ్వర్‌రెడ్డి, వామపక్షాల నుంచి జయసారథి రెడ్డి, యువ తెలంగాణ పార్టీ నుంచి రాణి రుద్రమారెడ్డి, ఇంటిపార్టీ నుంచి చెరుకు సుధాకర్, స్వతంత్ర్య అభ్యర్థిగా తీన్మార్ మల్లన్న బరిలో నిలుస్తున్నారు. వీరంతా ఇప్పటికే ప్రచారం మొదలు పెట్టారు. తీన్మార్ మల్లన్న అయితే ఏకంగా పాదయాత్ర నిర్వహించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎక్కడ ఏ కార్యక్రమం ఉన్నా ముందుండి సభల్లో పాల్గొంటున్న కోదండరాం.. గ్రామీణ ప్రాంతాల ప్రజలు, నిరుద్యోగులు, యువతలో మంచి ఫాలోయింగ్‌‌తో సోషల్ మీడియాలో సైతం దూసుకెళ్తున్నారు.

అయితే.. ఏ పార్టీ నుంచి ఎవరు పోటీలో ఉన్నా.. కోదండరామ్‌ పేరు అనగానే స్పెషల్ అటెన్షన్ ఉంటోంది. కానీ తన పాజిటివ్‌ ఓట్లతో పాటు టీఆర్ఎస్, కాంగ్రెస్‌ ఓట్లను ఎలా తిప్పుకుంటారనేది క్వశ్చన్ మార్క్‌. పైగా రాజకీయంగా నిలవాలంటే కోదండరామ్‌కు ఇదే చివరి అవకాశం కూడా. ప్రభుత్వ వ్యతిరేక ఓట్లలో ఇతర పార్టీలు, స్వతంత్రులతో పాటు కోదండరామ్‌ ఓటు బ్యాంక్‌లో ఎన్ని చేరతాయనేది రిజల్ట్ వస్తేకానీ తెలియదు. ఇప్పటికే అరడజనకు పైగా అభ్యర్థులు బరిలో ఉంటామని స్పష్టం చేయగా, నామినేషన్లు ముగిసేవరకు కనీసం ముగ్గురు నలుగురైనా స్వతంత్ర్య అభ్యర్థులు పుట్టుకొస్తారు. ప్రస్తుతం తెలంగాణ జనసమితి అంటే కోదండరాం పేరే వినపడుతోంది. కానీ ఇతర మాస్ లీడర్లు, జనాకర్షణ నేతలు లేరు. ఒక్కడే ఒంటరిగా బరిలో దిగుతుండగా అటు అధికార టీఆర్ఎస్, ప్రతిపక్ష కాంగ్రెస్, యూత్‌లో క్రేజ్‌ పెంచుకొన్న తీన్మార్ మల్లన్న, రాణిరుద్రమ ఓట్లను తనకు అనుకూలంగా ఎలా మార్చుకుంటారు? అనేది ప్రశ్నార్థకమే. కానీ ఆ ఓట్లు చేరితేనే కోదండరాం గెలుపునకు ఛాన్సెస్ ఉంటాయి.

ఇప్పుడు కోదండరామ్ గెలిస్తేనే 2023వరకు జనసమితి పార్టీ ఉనికి వినిపిస్తుంది, కనిపిస్తుంది. ఇలాంటి క్రమంలో పొలిటికల్‌గా పార్టీకి మైలేజ్‌ తేవాలన్న టార్గెట్ ఫాలో అయి గెలిచి నిలవాలి.. ప్రజలు తనవైపు ఉన్నారని నిరూపించుకోవాలి. ఓవైపు బీజేపీ దూసుకొస్తున్న తరుణంలో ముందు ముందు ఎన్నికలు టీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీగా మారే అవకాశాలు ఉన్నాయి. అలాంటప్పుడు ఎమ్మెల్సీగా కోదండరామ్‌ గెలిచి మండలిలో అడుగుపెడితేనే రాజకీయంగా జనసమితి పార్టీకి కలిసొస్తుంది. అప్పుడు స్టేట్‌లో ప్రజలు, నిరుద్యోగలకు ఓ డిఫరెంట్‌ వేదిక కోదండరాం రూపంలో కనపడే చాన్స్ ఉంటుంది.


Next Story

Most Viewed