తన ప్రాణం పోతుందని తెలిసినా భర్తకు ఊపిరినిచ్చిన భార్య.. చివరకు!

by  |
తన ప్రాణం పోతుందని తెలిసినా భర్తకు ఊపిరినిచ్చిన భార్య.. చివరకు!
X

దిశ, వెబ్‌డెస్క్ : దేశంలో కరోనా మహమ్మారి దెబ్బకు ప్రజలు పిట్టల్లా రాలిపోతున్నారు. కళ్ల ముందే తన వాళ్లు చనిపోతున్నా ఏమీ చేయలేని స్థితిలో కుటుంబ సభ్యులు, బంధువులు ఉంటున్నారు. ధైర్యం చేసి ఏమైనా చేద్దాం అనుకుంటే కరోనా మహమ్మారి వారిని కూడా వదలడం లేదు. దీంతో సొంత కుటుంబసభ్యులు మరణించినా అంత్యక్రియలు నిర్వహించేందుకు, వారి శవాలను స్వాధీనం చేసుకునేందుకు కూడా కొందరు నిరాసక్తి కనబరుస్తున్నారు. మొత్తానికి కొవిడ్-19 నా అనుకునే వారిని కడసారి చూపులకు కూడా నోచుకోకుండా చేస్తోంది. చనిపోయిన వారి మృతదేహం వద్ద కడివెడు కన్నీళ్లను వదిలే అవకాశం కూడా ఇవ్వడం లేదు.

ప్రస్తుత విపత్కర పరిస్థితుల్లో కరోనా లక్షణాలు ఉన్నాయంటే సమాజమే కాదు కుటుంబం మొత్తం అతన్ని వెలివేసినంత పని చేస్తోంది. కట్టుకున్న భార్యతో పాటు పిల్లలు కూడా దూరంగా వెళ్లిపోవాల్సిన దుస్థితి నెలకొంది. బాధిత రోగులు కూడా తమకు ఏమైనా పర్లేదు తమ వాళ్లకు ఏమీ కాకూడదని సొంతంగా ఐసోలేషన్‌కు వెళ్లిపోతున్నారు. ఇలాంటి భయంకర పరిస్థితుల్లోనూ పాజిటివ్ వచ్చిన తన భర్త(47)ను కాపాడుకునేందుకు ఓ భార్య నిజంగా తన ప్రాణాలనే పణంగా పెట్టింది. ఆటో రిక్షాలో భర్తను ఎక్కించుకుని బెడ్ కోసం మూడు నుంచి నాలుగు ఆస్పత్రులు తిరిగింది.

ఎక్కడా బెడ్ దొరకక పోవడంతో చివరకు SNMC ఆస్పత్రికి తీసుకెళ్లగా పరిక్షించిన వైద్యులు అతను చనిపోయినట్లు ధృవీకరించారు. అంతకుముందు ఒకానొక సమయంలో తన భర్తకు ఊపిరి అందక ఇబ్బంది పడుతుంటే ఒక చేత్తో అతని పట్టుకుని, నోట్లో నోరు పెట్టి ప్రాణవాయువును అందించింది. అయినప్పటికీ అతని ప్రాణాలు నిలబడలేదు. ఈ విషాదకరమైన ఘటన యూపీలోని ఆగ్రాలో మంగళవారం వెలుగుచూసింది. అయితే, ఆ వివాహిత తన భర్తకు ప్రాణవాయువు అందిస్తున్న సమయంలో తీసిన ఫోటో ఆన్‌లైన్‌‌లో దర్శనమిచ్చింది. భర్త ప్రాణాలు కాపాడుకోవడానికి తన లైఫ్‌ను రిస్క్ చేసిందని, అయినా తన ప్రయత్నం ఫెయిల్ అయిందని రాసుకొచ్చారు. ప్రస్తుతం ఈ హృదయ విదారకమైన దృశ్యం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

Next Story

Most Viewed