ఆసరా కోసం ఆరునెలలుగా ఎదురుచూపులే!

by  |
ఆసరా కోసం ఆరునెలలుగా ఎదురుచూపులే!
X

దిశ, వేములవాడ: ఆసరా పింఛన్ కోసం అప్లై చేసుకున్న వారు ఆరె నెలలుగా ఎదురు చూస్తునే ఉన్నారు. కానీ ఇప్పటి వరకు పింఛన్ రావడం లేదని అర్హులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పింఛన్ల కోసం అప్లికేషన్లు పట్టుకొని ఆఫీస్‌ల చుట్టూ చెప్పులు అరిగేలా తిరుగుతున్నా పట్టించుకునే వారే కరువయ్యారు. కొన్ని అప్లికేషన్లు ఆఫీసర్లు తీసుకున్నప్పటికీ సర్కారు నిధులు విడుదల చేయడం లేదని ఆఫీసర్లు చెప్తున్నారు. దీంతో దరఖాస్తులు మూలకు పడుతున్నాయి. పింఛన్ల కోసం ఆప్లికేషన్ పెట్టుకున్న వారు ఆశతో ఆరు నెలలుగా ఎదురు చూస్తూనే ఉన్నారు.

3,250 అప్లి కేషన్లు..

రాజన్న సిరిసిల్ల జిల్లాలో ప్రతి నెల 1,12,550 మంది ఆసరా పింఛన్లు అందుకుంటున్నారు. కాగా, అర్హులైన వింతువులు, వృద్ధులు, ఒంటరి మహిళలు, వికలాంగులు, చేనేత, గీత, బీడీ కార్మికులు మొత్తం 3,250 మంది కొత్తగా పింఛన్ల కోసం అప్లై చేసుకున్నారు. అప్లికేషన్లు ఇచ్చి ఆరు నెలలు గడుస్తున్నా సర్కారు నిధులు కేటాయించకపోవడంతో అవికాస్త ఆఫీసుల్లో మూలకు పడ్డాయి. కొత్తగా వచ్చిన అప్లికేషన్ వివరాలను జిల్లా ఆఫీసర్లు పంపినప్పటికీ ఇప్పటికీ అర్హులైన వారికి ఆసరా పింఛన్లు అందించేందుకు నిధులు విడుదల కావడం లేదని తెలుస్తోంది. పింఛన్ కోసం ప్రతి రోజూ ఆఫీసుల చుట్టూ తిరుగుతున్నారు. జిల్లాకు ప్రతి నెల రూ.23 కోట్ల 72 లక్షలు పింఛన్ల రూపంలో సర్కారు చెల్లిస్తోంది. కానీ కొత్త వారికి పింఛన్లు మంజూరు చేయడంలో సర్కారు చొరవ తీసుకోవడం లేదు.

వయస్సు తగ్గింపుతో పెరిగిన అప్లికేషన్లు..

ఎన్నికల్లో 57 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరికీ ఆసరా పింఛన్ మంజూరు చేస్తామని సీఎం కేసీఆర్ హామీ ఇచ్చారు. టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తి కావడంతో జిల్లా వ్యాప్తంగా ఎంత మంది 57 ఏళ్లు నిండిన వారు ఉన్నారో ప్రభుత్వం సమాచారం తీసుకుంది. జిల్లాలో 57 ఏళ్లు నిండిన వారు 14,108 మంది ఉన్నట్లు ఆఫీసర్లు గుర్తించారు. ఇప్పటికైనా సర్కారు స్పందించి, అప్లికేషన్లు పెట్టుకున్న అర్హులందరికీ పింఛన్లు మంజూరు చేయాలని వేడుకుంటున్నారు.



Next Story

Most Viewed