లాక్‌డౌన్ ఎందుకు వద్దంటే… సీఎం వివరణ

by  |
CM KCR
X

దిశ, తెలంగాణ బ్యూరో : రాష్ట్రంలో లాక్‌డౌన్ ఎందుకు విధించకూడదనే విషయంపై సీఎం కేసీఆర్ లోతైన విశ్లేషణను వివరించారు. “లాక్‌డౌన్ వలన ఉపయోగం లేదు. ఇండియాలోనే ‘మోస్ట్ హాపెనింగ్ స్టేట్‘గా తెలంగాణ రాష్ట్రం ఉంది. ఇక్కడ దాదాపు 30 లక్షల మంది ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన కార్మికులు పనిచేస్తున్నారు. కరోనా మొదటి వేవ్ సమయంలో లాక్‌డౌన్ విధించడం ద్వారా వీరందరి జీవితాలు చెల్లాచెదురైన పరిస్థితిని మనం చూశాం. వీరంతా డిస్‌లొకేట్ అయితే తిరిగి రావడం కష్టం.

రాష్ట్రంలో ధాన్యం పుష్కలంగా పండింది. తెలంగాణ వ్యాప్తంగా గ్రామాల్లో 6,144 కొనుగోలు కేంద్రాల్లో వరి ధాన్యం నిండివున్నది. ప్రస్తుతం అక్కడ వడ్ల కాంటా నడుస్తున్నది. వరి కొనుగోలు ఆషామాషీ కాదు. కింది నుంచి మీది దాక చైన్ సిస్టం ఇమిడి ఉంటుంది. ఐకేపీ కేంద్రాల బాధ్యులు, హమాలీలు, తూకం వేసేందుకు కాంటా పెట్టేవాళ్ళు, మిల్లులకు తరలించే కూలీలు, లారీలు రవాణా వాహనాలు మిల్లులకు చేరవేయడం, తిరిగి అక్కడ అన్‌లోడింగ్ చేయడం, మల్ళీ అక్కడి నుంచి ఎఫ్‌సీఐ గోడౌన్లకు తరలించడం, స్టాక్ చేయడం, వివిధ ప్రాంతాలకు పంపిణీ చేయడం ఇలా చాలా వ్యవహారం ఉంటుంది. లక్షలాది మంది ఇందులో భాగస్వాములౌతారు” అని సీఎం కేసీఆర్ వివరించారు.

లాక్‌డౌన్ విధిస్తే వివిధ రాష్ట్రాల నుంచి వచ్చి రైసు మిల్లుల్లో పనిచేస్తున్న ఇంత మంది కార్మికులు ఏమవుతారని, ఎక్కడకు పోతారని ప్రశ్నించారు. కార్మికులు చెల్లాచెదురైపోతే తిరిగి వారిని రప్పించడం ఎట్లా అని ప్రశ్నించారు. కొనుగోళ్లు చేయకపోతే పండించిన వరి ధాన్యాన్ని రైతు దాచుకోవడం ఇబ్బందవుతుందని, మొత్తం ధాన్యం కొనుగోళ్ల వ్యవస్థ ఎక్కడికక్కడ స్థంభించి పోయే ప్రమాదమున్నదన్నారు. ఈ సంక్షోభం ఘోరంగా ఉండే ప్రమాదం ఉందన్నారు.

నిత్యావసర సరుకులు, పాలు, కూరగాయలు, పండ్లు, ఎమర్జెన్సీ మెడికల్ సర్వీసులు, ప్రసవాలు, పారిశుద్ధ్య కార్యక్రమాలు లాంటి అత్యవసర కార్యక్రమాలను ఆపివేయలేమన్నారు. ఇతర రాష్ట్రాల నుంచి వాక్సిన్లు, మెడిసిన్ ఆక్సీజన్, ఇతర నిత్యావసరాలను సరఫరా చేసుకుంటున్నామని, ఒకవేళ లాక్‌డౌన్ విధిస్తే వీటన్నిటికి ఆటంకం ఏర్పడుతుందన్నారు. ఇన్ని కారణాలవల్ల ప్రభుత్వమే ఒక భయానక పరిస్థితిని సృష్టించినట్లవుతుందని, అందుకు ప్రభుత్వం సిద్ధంగా లేదు కాబట్టి లాక్‌డౌన్ విధించలేమని నొక్కిచెప్పారు.

కరోనా పాజిటివ్ కేసులు ఎక్కువగా ఉన్న ప్రాంతాలను గుర్తించి వాటిని, మైక్రో లెవల్ కంటెయిన్‌మెంట్ జోన్లను ప్రకటించి నిరోధక చర్యలను తక్షణమే చేపడుతామన్నారు. “పరిశ్రమలు ఉన్నపళంగా మూతపడితే అంతా ఆగమాగం కాదా? క్యాబ్, ఆటోల డ్రైవర్ల పరిస్థితి ఏమిటి? కొన్ని లక్షల కుటుంబాలు ఉపాధి కోల్పోయే పరిస్థితి తలెత్తి మొత్తం వ్యవస్థ కుప్పకూలే ప్రమాదమున్నది.

కరోనా ఏమోగాని ఆకలి సంక్షోభం తలెత్తే ప్రమాదమున్నది. గొంతు పిసికినట్టు చేస్తే మొత్తం రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ కుప్పకూలి పోయే ప్రమాదమున్నది. కాబట్టి గతంలో అనుభవాలను దృష్టిలో వుంచుకుని లాక్‌డౌన్‌ను విధించకూడదనే ప్రభుత్వం నిర్ణయించింది“ అని సీఎం స్పష్టంచేశారు.

ఎవరికి వారే జాగ్రత్తలు తీసుకోండి

కరోనా నియంత్రణ కోసం ప్రజలు పూనుకోవాలని, ప్రతి వ్యక్తీ స్వచ్ఛందంగా కరోనా మీద యుద్ధంలో భాగస్వాములు కావాలని ప్రజలకు ముఖ్యమంత్రి పిలుపునిచ్చారు. సమిష్టిగా అందరం కలిసి కొట్లాడితేనే కరోనా అంతమౌతుందని అన్నారు. మేధావులు, బుద్ధిజీవులు ఈ దిశగా ప్రజలను చైతన్యవంతం చేయాలని కోరారు. కరోనా నియంత్రణలో ప్రాణాలకు తెగించి పాటుపడుతున్న వైద్య ఆరోగ్యశాఖను అభినందించారు. వైద్యులు, నర్సులు, ఆశా వర్కర్లు, ఏఎన్ఎంలు తదితర వైద్య సిబ్బంది గొప్ప సేవ చేస్తున్నారని, వారి కృషి, త్యాగం గొప్పదని కొనియాడారు.

కరోనా సెకండ్ వేవ్ మే నెల 15 తర్వాత తగ్గిపోతుందంటూ రిపోర్టులు సూచిస్తున్నాయన్నారు. వ్యాధి నిరోధానికి ఎవరికి వారే జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ప్రజలే స్వీయ నియంత్రణ పాటించాలన్నారు. గుంపులు గుంపులుగా తిరగొద్దని, పెండ్లిల్లలో వందకు మించి జమ కావద్దని తెలిపారు. పరిశుభ్రత పాటించాలని, శానిటైజర్లు వాడాలని, మాస్కులు ధరించాలని, భౌతికదూరాన్ని పాటించాలని కోరారు. ఇటువంటి జాగ్రత్తలే ‘శ్రీరామరక్ష‘గా పేర్కొన్నారు.



Next Story

Most Viewed