ఐపీఎల్.. ఆ మూడు వేదికల్లో మ్యాచ్‌లకు..

by  |
ఐపీఎల్.. ఆ మూడు వేదికల్లో మ్యాచ్‌లకు..
X

దిశ, స్పోర్ట్స్ : ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 14వ సీజన్ వేదికలపై అభిమానులు, ఫ్రాంచైజీల అసంతృప్తి ఇంకా తగ్గడం లేదు. ఇప్పటికే పూర్తి స్థాయి షెడ్యూల్‌ను బీసీసీఐ ప్రకటించింది. ఇందులో హైదరాబాద్, మొహలీ, జైపూర్ వేదికలు తప్పించారు. దీనిపై ఆయా ఫ్రాంచైజీ యాజమాన్యాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. తమను నామ మాత్రంగానే సంప్రదించి ఇలాంటి నిర్ణయం తీసుకోవడంపై సన్‌రైజర్స్, పంజాబ్ కింగ్స్, రాజస్థాన్ రాయల్స్ యాజమాన్యాలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాయి. ముంబయి వంటి నగరంతో పోల్చుకుంటే హైదరాబాద్, జైపూర్, మొహలీలో కోవిడ్ కేసులు ఎక్కువగా లేవు. అంతే కాకుండా తెలంగాణ, పంజాబ్ ప్రభుత్వాలు తమ వద్ద ఐపీఎల్ నిర్వహిస్తే పూర్తి సహకారం అందిస్తామని కూడా బీసీసీఐకి చెప్పాయి. అయినా సరే బోర్డు ఈ మూడు వేదికలను కావాలనే తప్పించినట్లు సమాచారం. ఆ మూడు వేదికలపై బోర్డుకు ఉన్న అభిప్రాయాల మేరకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తున్నది.

అసోసియేషన్ గొడవలే..

హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్‌సీఏ)లో అధ్యక్షుడు అజారుద్దీన్‌, కార్యదర్శి విజయానంద్‌ మధ్య ఎప్పటి నుంచో గొడవలు జరుగుతున్నాయి. హెచ్‌సీఏలో అధ్యక్షకార్యదర్శులు, సభ్యులు ఎవరికి వారే అనే తీరులో ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. కనీసం హైదరాబాద్ రంజీ జట్టును సిద్దం చేయడంలో కూడా విఫలమయ్యారు. అదే సమయంలో ఒకరిపై ఒకరు దుమ్మెత్తి పోసుకుంటున్నారు. ప్రతీ ఏడాది జరగాల్సిన ఏజీఎం కూడా హెచ్‌సీఏ నిర్వహించలేక పోయింది. అనామకులను విజయ్ హజారే ట్రోఫీకి ఎంపిక చేశారనే విమర్శలు కూడా ఉన్నాయి. హెచ్‌సీఏలో జరుగుతున్న అంతర్గత రాజకీయాలతో బీసీసీఐ పెద్దలు కూడా విసుగు చెందారు. ప్రొఫెషనల్‌గా నడిపించాల్సిన అసోసియేషన్‌ను రాజకీయ గొడవలకు కేంద్రంగా మార్చారని బోర్డు ఆగ్రహంతో ఉన్నట్లు ఒక అధికారి తెలిపారు. అందుకే స్వయంగా తెలంగాణ మంత్రి కేటీఆర్ ఐపీఎల్ అవకాశం ఇవ్వాలని బహిరంగంగా ప్రకటన చేసినా బీసీసీఐ పట్టించుకోలేదు.

రైతు ఆందోళనతో..

ప్రస్తుతం ఢిల్లీ సరిహద్దుల్లో రైతుల ఆందోళన నడుస్తున్నది. గత ఏడాది నవంబర్ నుంచి జరుగుతున్న ఈ ఆందోళనలో పంజాబ్ రైతులదే కీలక పాత్ర. ఇలాంటి సమయంలో మొహలీలో క్రికెట్ మ్యాచ్‌లు నిర్వహిస్తే రైతులు, రైతు సంఘాలు అడ్డుకునే అవకాశం ఉన్నట్లు బీసీసీఐకి సమాచారం అందినట్లు ఒక అధికారి తెలిపారు. ఐపీఎల్‌ స్డేడియం వెలుపల ఆందోళనలు జరిగితే అది బ్రాండింగ్‌కు నష్టం కలిగిస్తుందనే మొహలీని తప్పించినట్లు తెలుస్తున్నది. ఇక కొత్తగా కట్టిన అహ్మదాబాద్ మొతేరా స్టేడియం కోసం జైపూర్‌ను తాత్కాలికంగా పక్కన పెట్టినట్లు
సమాచారం. గుజరాత్ రాష్ట్రంలో ఎలాంటి ఐపీఎల్ ఫ్రాంచైజీలు లేవు. కానీ గతంలో రాజస్థాన్ రాయల్స్ జట్టు అహ్మదాబాద్‌లో కొన్ని మ్యాచ్‌లు నిర్వహించింది. ఈ నేపథ్యంలోనే జైపూర్‌ను తాత్కాలికంగా పక్కన పెట్టి అహ్మదాబాద్ మొతేరాను వేదికగా ఎంపిక చేశారు. ఈ విషయంలో ఇప్పటికే రాజస్థాన్ రాయల్స్ యాజమాన్యంతో కూడా చర్చలు జరిపినట్లు తెలుస్తున్నది. అందుకే ఆ యాజమాన్యం జైపూర్ వేదికపై పెద్దగా పట్టుబట్టడం లేదని అంటున్నారు. ఏదేమైనా ఆ మూడు వేదికలను లిస్టు నుంచి తప్పించడానికి కరోనా ముఖ్య కారణం కాదని.. వేరే కారాణాలు ఉన్నట్లు బీసీసీఐ వర్గాలు కూడా అంటున్నాయి.


Next Story