హుజూరాబాద్‌ బై‌పోల్‌లో బరిగీసి కొట్లాడేదెవరు..?

by  |
Huzurabad-by-election
X

దిశ ప్రతినిధి, కరీంనగర్: ఉప ఎన్నికల్లో బరిగీసి కొట్లాడేదెవరు, తప్పుకునేదెవరో మరో రెండు రోజుల్లో తేలనుంది. 13వ తేదీన నామినేషన్ల విత్ డ్రా గడువు ముగిసిన తరువాత.. పోటీ నుంచి తప్పుకున్న అభ్యర్థులు, తుది జాబితాను ఎన్నికల అధికారులు విడుదల చేయనున్నారు. మొత్తం 61 మంది అభ్యర్థులు నామినేషన్లు వేయగా.. 19 మంది దరఖాస్తులు పరిశీలనలో రిటర్నింగ్ అధికారి తిరస్కరించగా.. 42 మంది అర్హులని తేల్చారు. అయితే వీరిలో ఎంతమంది పోటీ నుంచి తప్పుకుంటారోనన్నది బుధవారం తేలనుంది.

జమునమ్మ ఖాయం..

తన భర్తతో పాటు వరుసగా ఏడోసారి నామినేషన్ వేసిన ఈటల రాజేందర్ సతీమణి జమునమ్మ పోటీ నుంచి తప్పుకోనున్నారు. బీజేపీ అధిష్టానం కూడా రాజేందర్ అభ్యర్థిత్వాన్ని ఖరారు చేయడంతో ఆమె విత్ డ్రా చేసుకుంటారన్నది వాస్తవం. ఈటల రాజేందర్‌కు సెంటిమెంట్‌గా అచ్చొచ్చిన ఈ విధానంతో.. 2014 అసెంబ్లీ ఎన్నికలప్పటి నుంచి నామినేషన్ వేయడం, విత్ డ్రా చేసుకోవడం ఆనవాయితీగా వస్తోంది. దీంతో ఈ ఎన్నికల్లో కూడా జమునమ్మ పోటీ నుంచి తప్పుకుంటారన్నది ఖాయమని తేలిపోయింది. మిగతా 41 మందిలో ఎంత మంది అభ్యర్థులు పోటీ నుంచి తప్పుకుంటారు, ఎంతమంది కదనరంగంలోకి దూకుతారు అన్న విషయం తేలాల్సి ఉంది. 13వ, తేదీ సాయంత్రం వరకూ ఈ జాబితా ఫైనల్ కానుంది.

వీరంతా పోటీలో ఉంటే..?

తిరస్కరణ పూర్తయిన తరువాత మిగిలిన అభ్యర్థులంతా పోటీలో ఉన్నట్టయితే 3 ఈవీఎంలను ఒక బ్యాలెట్‌గా ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. ఒక్కో ఈవీఎంలో 16 మంది అభ్యర్థుల పేర్లు క్రోడీకరించే అవకాశం ఉన్నందున మూడింటినీ ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. ఒక వేళ పోటీ నుంచి తప్పుకునే అభ్యర్థుల సంఖ్య పెరిగితే ఈవీఎంలను తగ్గించే అవకాశాలు ఉంటాయి.


Next Story

Most Viewed