త్రిముఖ పోటీలో చైర్మన్ గా నిలిచేదెవరో..?

by  |

దిశ, మెదక్: వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ పదవిపై సిద్ధిపేట జిల్లా మిరుదొడ్డిలో త్వరలోనే చిక్కుముడి వీడనునట్లు ఉంది. ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి ఇప్పటికే ఒక పేరును ఖరారు చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. చైర్మన్ పదవి దక్కడం కోసం ఎవరికి వారే విశ్వ ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. ఎమ్మెల్యే రామలింగారెడ్డి మెప్పు కోసం నాయకులు పావులు కదుపుతున్నట్టు తెలుస్తోంది. ఏఎంసీ చైర్మన్ పీఠం దక్కించుకోవడం కోసం మిరుదొడ్డి మండలంలో ఇప్పటికే చాలా మంది నాయకుల పేర్లు వినిపించినప్పటికీ, చివరగా ముగ్గురు పేర్లు గట్టిగా వినిపిస్తున్నాయి. పంజాల శ్రీనివాస్ గౌడ్, మాజీ ఎంపీపీ నమిలే భాస్కరాచారి, వల్లాల సత్యనారాయణలు పోటీ పడుతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే వీరిలో ఒకరిపై ఎమ్మెల్యే రామలింగారెడ్డి సుముఖతగా లేరంట. నియోజక వర్గంలోని అన్ని మండలాల్లో ఇప్పటికే ఏఎంసీ చైర్మన్ పదవులు ఎవరికి ఇవ్వాలో.. ఆ వ్యక్తుల పేర్లు బహిరంగంగానే చర్చించుకుంటున్నారు. కానీ, మిరుదొడ్డి మండలంలో చైర్మన్ పదవిని ఎవరికి ఇవ్వాలో ఎమ్మెల్యే సుదీర్ఘ ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది. ఎమ్మెల్యే రామలింగారెడ్డి అనుకున్నవారికే చైర్మన్ పీఠం వరించనుంది. కార్యకర్తల సమన్వయంతోపాటు పార్టీ బలోపేతానికి పనిచేసే నాయకుడికి పగ్గాలు అప్పగించనున్నట్లు తెలుస్తోంది. మొత్తానికి ఈ త్రిముఖ పోటీలో చైర్మన్ పీఠం ఎవరికి దక్కుతుందోనన్న ఆసక్తి ప్రజల్లో నెలకొంది.



Next Story