కెప్టెన్ లేని జట్టుగా బీజేపీ

by  |
GHMC BJP
X

దిశ, తెలంగాణ బ్యూరో : బల్దియా ఎన్నికలు గతంలో ఎన్నడూ లేనివిధంగా నువ్వా? నేనా? అన్నట్లు సాగాయి. టీఆర్ఎస్, బీజేపీ మధ్య పోటీ రసవత్తరంగా సాగింది. 150 కార్పొరేటర్ల స్థానాల్లో బీజేపీ 48 స్థానాలను కైవసం చేసుకుంది. మేయర్ పదవికి సైతం పోటీ పడింది. ఎక్స్ అఫీషియల్ సభ్యులు తక్కువగా ఉండటంతో తృటిలో మేయర్ పదవిని కోల్పోయింది. అంత పటిష్టంగా ఉన్న బీజేపీ ఇప్పటివరకు బల్దియాలో బీజేపీ ఫ్లోర్ లీడర్‌ను మాత్రం అధిష్టానం ప్రకటించలేదు. ఆ పదవి కోసం నిత్యం కార్పొరేటర్లు అది నాయకుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. ఎవరికి వారే తమ ప్రయత్నాలను ముమ్మరం చేశారు. అయినప్పటికీ అధిష్టానం నేటికీ క్లారిటీ ఇవ్వలేదు. ఆ పార్టీలో ప్రస్తుతం ఫ్లోర్ లీడర్ ఎన్నిక పై ఆసక్తికరమైన చర్చ కొనసాగుతోంది.

అయితే ఎవరికి ఫ్లోర్ లీడర్ ఇస్తే వారు వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీ చేసే అవకాశం ఉన్నట్లు పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. దీంతో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చుట్టూ కార్పొరేటర్లు ప్రదక్షిణం చేస్తున్నారు. బల్దియా సమావేశాలలో బీజేపీ నుంచి ప్రాతినిధ్యం వహించే వారే కరవయ్యారు. కార్పొరేటర్లు తమ డివిజన్ పరిధిలోని సమస్యలను మాత్రమే ప్రస్తావిస్తూ ఉండటం గమనార్హం.

టీఆర్ఎస్‌కు ప్రత్యామ్నాయంగా చెప్పుకునే బీజేపీ ఫ్లోర్ లీడర్ పోస్టును మాత్రం ఎందుకు భర్తీ చేయలేదని అంశంపై పార్టీలో చర్చ కొనసాగుతోంది. ఏ పార్టీ అయినా బల్దియా ఎన్నికలు ముగిసిన తర్వాత జరిగే సమావేశాలకు ముందే తమ కార్పొరేటర్లతో సమావేశం నిర్వహించి అందులో ఒకరిని ఫ్లోర్ లీడర్ గా నియమిస్తోంది. సమస్యలపై దిశానిర్దేశం చేస్తుంది ఆ పార్టీ అధిష్టానం. కానీ ఈసారి అందుకు భిన్నంగా బీజేపీ వ్యవహరిస్తోంది. దీంతో గ్రేటర్‌లోని ప్రజా సమస్యలపై మాట్లాడేవారే కరువయ్యారు. ఈ తీరుతో కార్పొరేటర్లో కొంత అసహనం పెరిగిపోతుందని సమాచారం. పార్టీ సమావేశాల్లో సైతం ఫ్లోర్ లీడర్ పై చర్చ జరిగినప్పటికీ నియామకం అంశంలో మంత్రం పార్టీ నాన్చుడు ధోరణి అవలంభిస్తున్నది.

బల్దియాలో బీజేపీ రికార్డు…

గత ఎన్నికల్లో బీజేపీ నాలుగు స్థానాల్లో మాత్రమే విజయం సాధించింది. ఈసారి జరిగిన బల్దియా ఎన్నికల్లో 150 డివిజన్లలో 48 స్థానాల్లో విజయం సాధించినప్పటికీ.. లింగోజిగూడ కార్పొరేటర్ మృతి చెందడం, ఉప ఎన్నికల్లో ఓడిపోవడంతో 47 స్థానాలకు పరిమితమైంది. బల్దియాలో టీఆర్ఎస్‌కు బీజేపీ ప్రధాన ప్రతిపక్షంగా ఉంది. గ్రేటర్ లో పార్టీ బలంగా ఉంది. కానీ ఫ్లోర్ లీడర్ ఎన్నికల్లో మాత్రం కెప్టెన్ లేని జట్టుగా బీజేపీ మిగిలిపోయింది. దీంతో కార్పొరేటర్లు ఎవరికివారే తమ సమస్యలను సమావేశాల్లో ప్రస్తావిస్తున్నారు. దీని వల్ల ఇటు అధికారులు, అటు మేయర్ వీరు ప్రస్తావిస్తున్న అంశాలపై అంతగా స్పందించడం లేదని కార్పొరేటర్లు వాపోతున్నారు.

దేవర కర్ణాకర్? శంకర్ యాదవా..?

బీజేపీ బల్దియా ఫ్లోర్ లీడర్ పదవి కోసం గుడిమల్కాపూర్ కార్పొరేటర్ దేవర కర్ణాకర్, బేగంబజార్ కార్పొరేటర్ శంకర్ యాదవ్ ప్రధానంగా పోటీ పడుతున్నారు. వీరు కాకుండా మరికొంత మంది పోటీ పడుతున్నప్పటికీ ప్రధానంగా వీరిపైన చర్చ జరుగుతోంది. వీరిద్దరిలో ఎవరని నియమిస్తారనేది పార్టీ అధిష్టానం తేలాల్సి ఉంది. వీరిద్దరిలో ఎవరికి ఇచ్చినా ప్రజా సమస్యలపై ప్రశ్నిస్తారని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. ఏది ఏమైనప్పటికీ బల్దియా లీడర్ నియామకంలో పార్టీ అధిష్టానం నాన్చివేత ధోరణి విడనాడాల్సిన అవసరం ఉందని పలువురు పార్టీ నేతలు అభిప్రాయపడుతున్నారు. ఇప్పటికైనా ఫ్లోర్ లీడర్‌ను నియమిస్తారా… లేక నాన్చివేత ధోరణే కొనసాగిస్తారా? అనేది వేచిచూడాల్సిందే.


Read More ఖద్దరు వెనుక కన్నీటి వ్యథ లెన్నో.. సర్పంచ్ ఎన్నికలపై గ్రామాల్లో జోరుగా చర్చ !



Next Story

Most Viewed