పుర పీఠం అధిష్టించేది ఎవరు?

by  |
పుర పీఠం అధిష్టించేది ఎవరు?
X

దిశ ప్రతినిధి, మెదక్: సిద్దిపేట మున్సిపల్ ఎన్నికల్లో గులాబీ గుబాళించింది. కారు జోరుకు ప్రతిపక్షాలు బేజారయ్యాయి. చైర్మన్ పీఠాన్ని అధిష్టించడానికి కావాల్సిన పూర్తి స్థాయి మెజార్టీని టీఆర్ఎస్ దక్కించుకుంది. అయితే ఎన్నికల ఫలితాలు వెలువడటం.. టీఆర్ఎస్ అత్యధిక స్థానాల్లో గెలుపొందడంతో ఇక చైర్మన్ పీఠాన్ని ఎవరూ అధిష్ఠంచనున్నారనే సస్పెన్స్ గా మారింది. చైర్మన్ పీఠాన్ని జనరల్ మహిళకు కేటాయించడంతో పలువురు టీఆర్ఎస్ సీనియర్ నాయకులు తమ భార్యలను బరిలో నిలిపిన విషయం తెలిసిందే. ఫలితాలు వెలువడిన మరుక్షనం నుండి పలువురు నాయకులు మంత్రి వద్దకు పరుగులు తీసినట్టు వినికిడి. ఈ సారి చైర్మన్ పీఠం తమకే కేటాయించాలని వేడుకున్నారని, మరికొందరు చైర్మన్ పీఠం కోసం మంత్రిని కలిసేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నట్టు సమాచారం. ఇదిలా ఉండగా ఈ ఎన్నికల్లో ఘోర పరాజయానికి గల కారణాలను బీజేపీ, కాంగ్రెస్ పార్టీల నాయకులు అన్వేషించుకుంటున్నట్టు సమాచారం.

చైర్మన్ పీఠంపై ఉత్కంఠ

సిద్దిపేట మున్సిపల్ చైర్మన్ పీరం జనరల్ మహిళకు కేటాయించారు. జనరల్ మహిళకు రిజర్వ్ అయిన చైర్మన్ పీఠాన్ని అధిష్టించడానికి మున్సిపల్ ఎన్నికల్లో గెలుపొందిన అందరూ మహిళలు అర్హులే. దీంతో కౌన్సిలర్ అభ్యర్థులుగా గెలుపొందిన మహిళా ప్రజాప్రతినిధులు ఈ సారి తమకు కేటాయించాలని మంత్రి వద్దకు పరుగులు తీసినట్టు సమాచారం. ఎలాగైనా ఈ ఒక్క సారి చైర్మన్ పీఠం తమకంటే తమకు కేటాయించాలని మంత్రి పై ఒత్తిడి తెస్తున్నారని ఆ పార్టీ నాయకుల ద్వారా తెలుస్తోంది. కాగా రాష్ట్ర ఎన్నికల సంఘం కౌన్సిలర్ల ప్రమాణ స్వీకారం, చైర్మన్ పీఠం అధిష్టించే తేదీ ఖరారు చేయలేదు. అది ఖారరైన తర్వాతే చైర్మన్ పీఠం ఎవరూ అధిష్టాపారో చెబుతానని , అప్పటి వరకు చైర్మన్ పీఠం ఎవరూ అనిపించేది గోప్యంగా ఉంటుందని, తనను కలవడానికి ఎవరూ రావద్దంటూ మంత్రి పలువురికి సూచించినట్టు సమాచారం.

చైర్మన్ రేసులో ఇద్దరి పేర్లు వినికిడి

సిద్దిపేట మున్సిపల్ ఎన్నికల్లో 43 వార్డుల్లో 23 వార్డులో మహిళా ప్రజాప్రతినిధులు గెలుపొందారు అందులో ఒకరు బీజేపీ పార్టీ అభ్యర్థి కాగా, మరో ఇద్దరు టీఆర్ఎస్ రెబల్ అభ్యర్థులు గెలుపొందారు. వీరు మినహాయిస్తే 20 మంది టీఆర్ఎస్ పార్టీ తరపున విజేతలుగా నిలిచారు. కాగా ఇందులో ఇద్దరి పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. చైర్మన్ పీఠం కోసం 24 వ వార్డు కౌన్సిలర్ కడవేరు మంజుల రాజనర్సు, నాల్గో వార్డు కొండం కవిత సంపత్ ల పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. వీరితో పాటు మరికొందరు కూడా చైర్మన్ పీఠం కాకపోయిన వైస్ చైర్మన్ పీఠాన్నైనా తమకు కేటాయించాలని మంత్రిని వేడుకున్నట్టు సమాచారం.

మాజీ చైర్మన్ వైపే మంత్రి ఆసక్తి !

సిద్దిపేట మున్సిపల్ ఎన్నికల్లో వరుసగా చైర్మన్‌గా వ్యవహరించిన కడవేరు రాజనర్సు కుటుంబం వైపే మంత్రి హరీశ్ రావు ఆసక్తి చూపుతున్నట్టు తెలుస్తోంది. అందుకోసమే 24 వ వార్డు బీసీ జనరల్ స్థానం కేటాయించినప్పటికీ చైర్మన్ పీఠం జనరల్ మహిళకు కేటాయించడంతో ఈ సారి బీసీ జనరల్ స్థానలో మాజీ చైర్మన్ రాజనర్సు పోటీ చేయకుండా తన సతీమణి మంజులను పోటీలో నిలిపారు. మున్సిపల్ చైర్మన్ గా రాజనర్సు హయాంలో సిద్దిపేట కి పలు జాతీయ అవార్డులు వచ్చాయి. కొత్త వారికి కేటాయించి ఇబ్బందులు పడే కంటే మాజీ చైర్మన్ కుటుంబానికి కేటాయిస్తే సిద్దిపేట పట్టణం మరింత అభివృద్ధి చెందుతుందని, మాజీ చైర్మన్ కూడా అందరితో కలివిడిగా ఉండటం పార్టీకి అనుకూలించే అంశమని మంత్రి అభిప్రాయ పడ్డట్టు సమాచారం.

ఓటమి అన్వేషణలో పరాజితులు

గెలుపొందిన కౌన్సిలర్లు సంతోషంగా మునిగి తేలుతుండగా .. పరాజితులుగా ఉన్న కౌన్సిలర్ అభ్యర్థులు తమ ఓటమికి కారణాలను అన్వేషించుకుంటున్నారు. ముఖ్యంగా ప్రధాన పార్టీకి ధీటుగా ప్రచారం చేసిన బీజేపీ, కాంగ్రెస్ పార్టీ నాయకులు తమ అభ్యర్థుల ఓటమికి కారణాలను అన్వేషించుకుంటున్నారు. ఓటరు జాబితా ముందేసుకొని ఎవరెవరూ తమకు ఓటేసి ఉంటారు, ఎవరూ మనకు వేయలేదనే సమాచారాన్ని సేకరించే పనిలో నిమగ్నమయ్యారు. ఇదిలా ఉండగా స్వతంత్ర అభ్యర్థులు సైతం ఈ ఎన్నికల్లో భారీగా ఖర్చు పెట్టారు. అయినా ఓటమి చెందారు. ఇక తాము పెట్టుబడి తిరిగి పొందడం ఎలా అంటూ లోలోన బాధపడుతూ సన్నిహితుల వద్ద ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.


Next Story

Most Viewed