‘ఆరోగ్య సేతు’ను ఎవరు రూపొందించారు?

by  |
‘ఆరోగ్య సేతు’ను ఎవరు రూపొందించారు?
X

న్యూఢిల్లీ: కరోనాపై పోరులో కీలక అస్త్రంగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ఆరోగ్య సేతు యాప్‌ను ఎవరు రూపొందించారన్న ప్రశ్నకు అధికారుల నుంచి స్పష్టమైన సమాధానం రాలేదు. నేషనల్ ఇన్ఫర్మేటిక్స్ సెంటర్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మినిస్ట్రీలు రూపొందించినట్టు ఆరోగ్య సేతు వెబ్‌సైట్ పేర్కొంది. కానీ, ఈ రెండూ యాప్ అభివృద్ధి చేయడానికి సంబంధించిన ప్రశ్నలకు సమాధానాలివ్వలేకపోయాయి. దీనిపై ఆర్టీఐ బాడీ ఆగ్రహించింది. అధికారులు సమాచారాన్ని నిరాకరించడాన్ని ఉపేక్షించబోమని స్పష్టం చేసింది.

ఆరోగ్య సేతు అప్లికేషన్ తయారుచేయడానికి సంబంధించి ఒక్క చీఫ్ పబ్లిక్ ఇన్ఫర్మేషన్ అధికారీ సమాధానమివ్వలేకపోయారని తెలిపింది. దీంతో సంబంధిత అధికారులకు షోకాజు నోటీసులు జారీచేసింది. నవంబర్ 24లోపు కమిషన్ ముందు హాజరవ్వాలని ఆదేశించింది. ఆరోగ్య సేతు యాప్ ప్రతిపాదన మొదలు, దాని తయారీలో పాలుపంచుకున్న ప్రభుత్వ శాఖ, ప్రైవేటు సంస్థలు, లేదా వ్యక్తులు, ఇతర సమాచారాన్ని కార్యకర్త సౌరవ్ దాస్ అడిగారు. రెండు నెలల కాలంలో ఈ ప్రశ్న పలు ప్రభుత్వ శాఖలకు చేరింది.

కానీ, స్పష్టమైన సమాధానం రాలేదు. ఈ యాప్ తయారీకి సంబంధించిన పూర్తి సమాచారం తమ దగ్గర లేదని నేషనల్ ఇన్ఫర్మేటిక్స్ సెంటర్ పేర్కొని, ప్రశ్నను నేషనల్ ఈ-గవర్నెన్స్ డివిజన్‌కు బదలాయించింది. ఈ ప్రశ్న తమ పరిధిలోకి రాదని ఈ-గవర్నెన్స్ సమాధానమిచ్చింది. దీంతో చీఫ్ పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్స్, నేషనల్ ఈ-గవర్నెన్స్ డివిజన్‌ అధికారులకు షోకాజు నోటీసులు జారీ అయ్యాయి.


Next Story